టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. కొత్త కొత్త మార్గాల ద్వారా సైబర్ నేరస్తులు రెచ్చిపోతున్నారు. అమాయక ప్రజల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. లాభాల ఆశ చూపించి కొందరిని, డిజిటల్ అరెస్టుల పేరుతో మరికొంత మందిని భయపెట్టి డబ్బులు లాగేసుకుంటున్నారు. 2024లో ఎక్కువగా వాట్సాప్ ను ఉపయోగించి మోసాలకు పాల్పడినట్లు కేంద్ర హోంశాఖ వల్లడించింది. సోషల్ మీడియా యాప్స్ ఉపయోగించే వాళ్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ముఖ్యంగా వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్ స్టాగ్రామ్ లో సైబర్ మోసాలకు సంబంధించిన చాలా కేసులు తమ దృష్టిలోకి వచ్చినట్లు తెలిపింది.
వాట్సాప్ ద్వారానే ఎక్కువ మోసాలు
2024లో ఎక్కువగా ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ద్వారానే సైబర్ మోసాలు జరిగినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఈ యాప్ ను ఆసరాగా చేసుకుని అమాయకుల నుంచి సైబర్ కేటుగాళ్లు పెద్ద మొత్తంలో డబ్బులు కొల్లగొట్టినట్లు తెలిపింది. వాట్సాప్ తర్వాత టెలిగ్రామ్, ఇన్ స్టా గ్రామ్ ద్వారా ఎక్కువ మోసాలు జరిగిట్లు వివరించింది. 2024లో తొలి మూడు నెలల్లో వాట్సాప్ ద్వారా జరిగిన సైబర్ మోసాలకు సంబంధించి 43,797 ఫిర్యాదులు అందినట్లు తెలిపింది. అటు టెలిగ్రామ్ మోసాలకు సంబంధించి 22,680 ఫిర్యాదులు, ఇన్ స్టా గ్రామ్ మోసాలకు సంబంధించి 19,800 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపింది. సైబర్ కేటుగాళ్లు ఇలాంటి నేరాలకు పాల్పడేందుకు గూగుల్ సర్వీస్ ప్లాట్ఫారమ్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. కొంత మందిని టార్గెట్ చేసుకుని
వాళ్లే సైబర్ నేరస్తుల టార్గెట్!
అటు సైబర్ మోసాలకు సంబంధించిన కేసుల విషయంలో కేంద్ర హోం మంత్రిత్వశాఖ వార్షిక నివేదికలో కీలక విషయాలు వెల్లడి అయ్యాయి. ఇలాంటి సైబర్ మోసాలు కేవలం భారత్ లోనే కాదు, ఇతర దేశాల్లోనూ జరుగుతున్నట్లు వెల్లడైంది. ఇందులో పెద్ద ఎత్తున మనీలాండరింగ్, సైబర్ బానిసత్వం కూడా ఉన్నట్లు తెలిపింది. సైబర్ ఫ్రాడ్ కేటుగాళ్లు ఎక్కువగా నిరుద్యోగ యువత, గృహిణులు, విద్యార్థులతో పాటు ఇతర నిరుపేదలను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నట్లు వెల్లడించింది. వారు పెద్ద మొత్తంలో డబ్బును కోల్పోతున్నట్లు వివరించింది. ఈ డబ్బులో ఎక్కువగా అవసరాల కోసం ఇతరుల నుంచి అప్పుగా తీసుకున్న డబ్బు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది.
ఫేస్ బుక్ మీద కేంద్రం నిఘా
అటు స్పాన్సర్ ఫేస్ బుక్ యాడ్స్ ద్వారా సైబర్ దుండగులు రెచ్చిపోతున్నట్లు కేంద్ర హోంశాఖ గుర్తించింది. దేశంలో అక్రమంగా రుణాలు ఇచ్చే యాప్లను కూడా సైబర్ నేరస్తులు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది. వారిపై గట్టి నిఘా పెట్టినట్లు వెల్లడించింది. సైబర్ నేరస్తులపై చర్యలు తీసుకోవడానికి, ప్రభుత్వం ఇప్పటికే అలాంటి లింక్లను గుర్తించినట్లు తెలిపింది. అవసరమైతే, ఈ లింక్లను తొలగించమని ఫేస్ బుక్ కు తగిన సూచనలు చేస్తామని వెల్లడించింది. ప్రజలు సైబర్ నేరాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. బ్యాంకు లింకులు, బంపర్ ఆఫర్లు, ఆధార్ వివరాలు, బ్యాంక్ కేవైసీ అంటూ ఎవరు కాల్ చేసినా వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ వివరాలను చెప్పకూడని వెల్లడించింది.
Read Also: సిమ్ కార్డు మిస్ యూజ్, ఆ తప్పు చేశారో జైల్లో చిప్పకూడు తినాల్సిందే!