Jio Bharat V4: భారతదేశంలో డిజిటల్ విప్లవానికి మరోసారి తెరలేపుతూ రిలయన్స్ జియో సరికొత్త సంచలనానికి శ్రీకారం చుట్టింది. సామాన్యులకు సైతం ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో కేవలం రూ.799కే ‘జియోభారత్ V4’ 4G ఫీచర్ ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇప్పటికీ పాతకాలపు 2G నెట్వర్క్ను వాడుతున్న కోట్లాది మంది ప్రజలను 4G వైపు నడిపించేందుకు ఈ ఫోన్ ఎంతగానో ఉపయోగపడనుంది.
స్మార్ట్ఫోన్ల ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో.. తక్కువ బడ్జెట్లో కనెక్టివిటీని కోరుకునే వారికి ఈ ఫోన్ ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లోని ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని జియో దీనిని రూపొందించింది. మొదటిసారి ఇంటర్నెట్ వాడే వారికి కూడా అర్థమయ్యేలా దీనిని చాలా సులభంగా డిజైన్ చేశారు.
Also Read: సరికొత్త రికార్డ్.. అత్యంత సన్నని ఫోన్ను లాంచ్ చేసిన టెక్నో.. ఫీచర్లు, ధర వివరాలు మీ కోసం!
ఈ ఫోన్లో అందరినీ ఆకట్టుకుంటున్న ప్రధాన అంశం ఇందులోని ‘సేఫ్టీ ఫస్ట్’ ఫీచర్. దీని ద్వారా కుటుంబ సభ్యుల లైవ్ లొకేషన్ను సులభంగా తెలుసుకోవచ్చు. అలాగే ఆ ఫోన్లో యూసేజ్ మేనేజర్ సాయంతో మనకు నచ్చిన యాప్స్, కాంటాక్ట్స్ను మాత్రమే అందుబాటులో ఉంచుకోవచ్చు. ఇంట్లోని పిల్లలు, వృద్ధుల భద్రతకు ఈ ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుంది.
తక్కువ ధరకే వస్తున్నప్పటికీ.. వినోదానికి దీనిలో ఎలాంటి కొరత లేదు. వినియోగదారులు జియోహాట్స్టార్ (JioHotstar) ద్వారా లైవ్ క్రికెట్, షోలను చూడవచ్చు. అలాగే జియోటీవీ (JioTV) సాయంతో 500 పైగా లైవ్ ఛానళ్లను వీక్షించవచ్చు. పాటల ప్రియుల కోసం జియోసావన్ (JioSaavn) యాప్ కూడా ఉంది. మెరుగైన ఆడియో క్వాలిటీతో పాటలు వినడం ఇప్పుడు మరింత సరదాగా మారనుంది.
ఈ ఫోన్లో జియోపే (JioPay) ద్వారా యూపీఐ (UPI) పేమెంట్స్ చేసుకునే సౌకర్యం ఉంది. క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసి డబ్బులు పంపడం, తీసుకోవడం చాలా సులభం. ముఖ్యంగా చిన్న వ్యాపారులకు ఉపయోగపడేలా, డబ్బులు అకౌంట్లో పడగానే సౌండ్ అలర్ట్ వచ్చేలా దీనిని రూపొందించారు. ఈ జియోభారత్ V4 ఫోన్ బ్లూ, బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. దీనిని జియోమార్ట్, రిలయన్స్ డిజిటల్, అధికారిక జియో స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు.
Also Read: బడ్జెట్ ధరలో సూపర్ 5G ఫోన్లు.. కస్టమైజ్డ్ లైట్లతో ఆకట్టుకుంటున్న Ai+ Nova 2 Pro!