Kill-switch technology: బ్రిటన్లో మొబైల్ దొంగతనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గత ఏడాది ఒక్క లండన్ నగరంలోనే దాదాపు 70 వేల మంది తమ ఫోన్లను పోగొట్టుకున్నారు. ఈ నేపథ్యంలో దొంగల ఆట కట్టించడానికి యూకే టెలికాం సంస్థలు ఒక సరికొత్త ఆయుధాన్ని తీసుకొచ్చాయి. అదే ‘కిల్ స్విచ్’ (Kill Switch) టెక్నాలజీ. ఈ సరికొత్త ఫీచర్ సహాయంతో దొంగిలించిన ఫోన్ను ఒక్క క్లిక్తో పూర్తిగా పనికిరాకుండా చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం రండి..
వర్జిన్ మీడియా O2, వోడాఫోన్ వంటి ప్రముఖ బ్రిటీష్ టెలికాం కంపెనీలు ఈ సరికొత్త టెక్నాలజీని పరిచయం చేశాయి. సాధారణంగా దొంగలు ఫోన్ను ఎత్తుకెళ్లిన తర్వాత వేరే సిమ్ కార్డ్ వేసి వాడుతుంటారు లేదా తక్కువ ధరకు వేరొకరికి అమ్మేస్తుంటారు. కానీ ఈ కిల్ స్విచ్ ఫీచర్ యాక్టివేట్ అయితే.. సదరు ఫోన్ ఎక్కడున్నా సరే రిమోట్ కమాండ్ ద్వారా దాన్ని పూర్తిగా బ్లాక్ చేయవచ్చు. దీంతో ఆ ఫోన్ను దొంగలించిన వ్యక్తి ఏ విధంగానూ వాడుకోలేడు.
Also Read: రూ.10వేల లోపే ఇలాంటి ఫోనా? లావా దెబ్బకు చైనా బ్రాండ్లు విలవిల!
కొత్త ఫోన్ తయారైనప్పుడే దాని వివరాలన్నీ సదరు కంపెనీ డేటాబేస్లో నమోదవుతాయి. ఒకవేళ షోరూమ్ల నుంచి గానీ, డెలివరీ చేసేటప్పుడు గానీ ఎవరైనా ఫోన్లను దొంగిలిస్తే, కంపెనీలు వెంటనే ఒకే ఒక్క కమాండ్తో ఆ ఫోన్ను లాక్ చేస్తాయి. ఆ తర్వాత అందులో ఏ సిమ్ వేసినా పనిచేయదు సరి కదా.. కాల్స్ కూడా వెళ్లవు. దీనివల్ల ఆ ఫోన్కు మార్కెట్లో పైసా విలువ కూడా ఉండదు. ఫలితంగా దొంగతనాలకు అడ్డుకట్ట పడుతుందని నిపుణులు భావిస్తున్నారు.
ప్రస్తుతానికైతే ఈ టెక్నాలజీని కేవలం విక్రయానికి సిద్ధంగా ఉన్న కొత్త ఫోన్ల రక్షణ కోసమే వాడుతున్నారు. అయితే సాధారణ వినియోగదారులు కూడా తమ ఫోన్ల కోసం ఇలాంటి ఫీచర్ కావాలని కోరుకుంటున్నారు. ప్రముఖ కంపెనీలైన యాపిల్, శాంసంగ్ కూడా ఈ దిశగా అడుగులు వేస్తున్నాయి. త్వరలోనే ఈ కిల్ స్విచ్ టెక్నాలజీ సాధారణ ప్రజలందరికీ అందుబాటులోకి వస్తే, మొబైల్ దొంగతనాలకు శాశ్వతంగా చెక్ పెట్టే అవకాశం ఉంటుంది.
Also Read: భారత్లో యాపిల్ ప్రొడక్ట్ల ధరలు భారీగా పెంపు.. ఏ గ్యాడ్జెట్ ధర ఎంత పెరిగిందంటే?