Controlling PC With Hand: కీ బోర్డు అవసరం లేదు.. మౌస్ కదపాల్సిన పని లేదు.. టచ్ స్క్రీన్పై టచ్ చేయాల్సిన పనే లేదు.. ఇవన్నీ కాదు.. వాయిస్ కమాండ్ వాడాల్సిన అవసరం కూడా లేదు. ఇవేవీ లేకుండా.. కంప్యూటర్తో ఓ ఆటాడుకోవచ్చు. జస్ట్.. ఓ స్మార్ట్ రిస్ట్ బ్యాండ్తో ఇవన్నీ చేయొచ్చంటోంది మెటా. ఇదే.. మైండ్ బ్లాంక్ అయ్యే విషయమంటే.. అదే మైండ్లో చిప్ పెట్టి.. ఆ రిస్ట్ బ్యాండ్ కూడా అవసరం లేదంటున్నాడు ఎలాన్ మస్క్. ఈ రేంజ్ ఎవల్యూషన్తో.. టెక్నాలజీలో ఎలాంటి రెవల్యూషన్ రాబోతోంది?
స్మార్ట్ రిస్ట్ బ్యాండ్తో అన్నీ చేయొచ్చంటున్న మెటా
ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓ.. కష్టపడిపోయి కంప్యూటర్ల ముందు కూర్చొని.. టైప్ చేయాల్సిన పనే లేదు. జస్ట్.. అలా మీ చేయి కదిపితే పనైపోతుంది. చిటికేసేంత టైమ్ కంటే తక్కువ సమయంలోనే.. పనులు చక్కబెట్టేయొచ్చు. ఒక్క స్మార్ట్ రిస్ట్ బ్యాండ్తో.. ఇవన్నీ చేయొచ్చంటోంది మార్క్ జుకర్బర్గ్కు చెందిన మెటా సంస్థ. కేవలం చేతివేళ్ల కదలికలతో.. కంప్యూటర్లూ, ఆగ్మెంటెడ్ రియాలిటీతో పనిచేసే వస్తువులను ఇకపై.. ఆపరేట్ చేయొచ్చు. టెక్నాలజీ వాడకంలో.. ఇదో గ్రేట్ టర్న్ కాబోతోంది. ముఖ్యంగా.. దివ్యాంగులకు ఇదో వరం అనే చెప్పాలి. వాయిస్ కమాండ్, సాధారణ ఇన్పుట్ పద్ధతుల్లో కాకుండా.. ఇదెంతో ఉపయోగకరంగా మారబోతోంది. భవిష్యత్తులో మన చేతివేళ్ల కదలికలతోనే కంప్యూటర్కు అన్నీ చెప్పేయొచ్చు. వాటిని ఆపరేట్ చేయొచ్చు. పనులన్నీ చక్కబెట్టేయొచ్చు. ముఖ్యంగా.. సీక్రెట్ విషయాలను ఎవ్వరికీ తెలియకుండా.. నిర్భయంగా కంప్యూటర్లో కంపోజ్ చేయొచ్చు. సెర్చ్ చేయొచ్చు. ఇలా.. ఒకటేమిటి.. మనకు నచ్చినవన్నీ.. నచ్చినవిధంగా చేసేయొచ్చు. మెటా తయారుచేస్తున్న ఈ స్మార్ట్ రిస్ట్ బ్యాండ్తో.. ఇదంతా సాధ్యం కానుంది. టెక్నాలజీ వినియోగంలో.. ఇదో రెవల్యూషన్గా చెబుతున్నారు టెక్ ఎక్స్పర్ట్స్. ఇప్పటికే.. వాయిస్ కమాండ్స్తో పనిచేసే స్మార్ట్ గ్లాసెస్ని మెటా తయారుచేసింది. ఇప్పుడు.. ఈ రిస్ట్ బ్యాండ్తో.. సంచలనం సృష్టించేందుకు సిద్ధమైంది.
మెషీన్ లెర్నింగ్ మాడ్యూళ్లకు మెటా ట్రైనింగ్
ఈ టెక్నాలజీకి సంబంధించిన డెవలప్మెంట్ని మెటా బయటపెట్టింది. మెటాకు చెందిన బిజినెస్, రీసెర్చ్ విభాగం రియాలిటీ ల్యాబ్స్లో.. దీనికి సంబంధించిన పరిశోధనలు నిర్వహించారు. సుమారు 300 మంది వివిధ రకాల పనులు చేస్తుంటే.. వారి కండరాల నుంచి వచ్చే విద్యుత్ సంకేతాలను పసిగట్టేందుకు.. మెషీన్ లెర్నింగ్ మాడ్యూళ్లకు ట్రైనింగ్ ఇచ్చారు. ఆ మోడల్స్.. వారి కండరాల సిగ్నల్స్ని గ్రహించి, వారి కదలికలకు అనుగుణంగా పనిచేశాయి. ఈ రిస్ట్ బ్యాండ్ని.. మెటా ఏర్ కళ్లదాద్లు ఓరియన్తోనూ టెస్ట్ చేశారు. ఈ రిస్ట్ బ్యాండ్ ఎలా పనిచేస్తుందంటే.. మన మెదడు, నరాల ద్వారా కండరాలకు విద్యుత్ సంకేతాలు పంపుతుంది. వీటిని ఎలక్ట్రోమయోగ్రాఫిక్ సిగ్నల్స్ అంటారు. మన మణికట్టు దగ్గర ఉండే కండరాల నుంచి వచ్చే విద్యుత్ సంకేతాల ఆధారంగా ఈ రిస్ట్ బ్యాండ్ పనిచేస్తుంది. దీని సాయంతో కంప్యూటర్లు, ఏఆర్తో పనిచేసే వస్తువులను సులువుగా ఆపరేట్ చేయొచ్చు. దీనివల్ల ఇక మీదట కీబోర్డులు, మౌస్లు, స్క్రీన్ను టచ్ చేయడం లాంటివేవీ అవసరం లేదు. దీంతో.. కంప్యూటర్లతో పనిచేయించడం మరింత సులువు, సరళతరం అవుతుంది. మన జేబుల్లో చేయి పెట్టి వేళ్లు కదిలించినప్పుడు కూడా ఇది పనిచేస్తుంది.
అతి సూక్ష్మ స్వల్ప స్థాయి విద్యుత్ సంకేతాలు పసిగట్టే టెక్నాలజీ
బేసిగ్గా.. ఈఎమ్జీ సంకేతాలు శరీరం లోపలి నుంచి వస్తాయి. వాటిని గ్రహించి బయట నుంచి పనిచేస్తుంది కాబట్టి దీన్ని సర్ఫేస్ ఈఎమ్జీ టెక్నాలజీగా పిలుస్తున్నారు. ఇది చాలా తేలికైన రిస్ట్ బ్యాండ్. మన చేయి కదిలినప్పుడు కండరాల నుంచి వచ్చే అతి సూక్ష్మ, స్వల్ప స్థాయి విద్యుత్ సంకేతాలను కూడా గ్రహించడం దీని ప్రత్యేకత. పెద్ద పరికరాలు, యంత్రాల అవసరం లేకుండానే ఇది పనిచేస్తుంది. కెమెరాలు, కొన్ని రకాల సెన్సర్లతో పనిచేసే సిస్టమ్స్ కూడా.. మన కదలికలను గుర్తించి పనిచేస్తాయ్. ఓ టేబుల్పై మనం రాసిన దాన్ని కూడా ఈ రిస్ట్ బ్యాండ్ గుర్తించి.. మనం ఏం రాశామో.. కంప్యూటర్ స్క్రీన్ మీద చూపిస్తుంది. అంటే.. మెసేజ్లు టైప్ చేయొచ్చు. మెనూలు ఆపరేట్ చేయొచ్చు. చేతి కదలికల ద్వారా డిజిటల్ కంటెంట్ని మనకు నచ్చినట్లు యాక్సెస్ చేయొచ్చు. ఈ సరికొత్త టెక్నాలజీ.. దివ్యాంగులకు ఎంతో ఉపయోగకరమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. శరీరంలోకి ప్రత్యేకమైన ఇంప్లాంట్లు, పరికరాలు జొప్పించాల్సిన అవసరం లేకుండా ఇది ఉపయోగపడుతుంది.
ఏదైనా విషయాన్ని రహస్యంగా చేరవేసే వెసులుబాటు
ఇప్పటికే అందుబాటులో ఉన్న ఇన్పుట్ పరికరాల్ని ఉపయోగించడంలో ఇబ్బంది పడుతున్నవారికి, బహిరంగంగా, ప్రైవేటుగా మాట్లాడలేని పరిస్థితుల్లో.. ఏదైనా విషయాన్ని రహస్యంగా అవతలివారికి చేరవేయాల్సి వచ్చినప్పుడు.. ఈ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుంది అంటున్నారు. అయితే.. ఈ టెక్నాలజీ ఇంకా పూర్తిగా డెవలప్ కాలేదు. అన్ని విధాలుగా దీనిని డెవలప్ చేశాక.. అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని మెటా చెబుతోంది. ఈ టెక్నాలజీకి సంబంధించిన డేటా, సాఫ్ట్వేర్ మోడళ్లు, డిజైన్ గైడ్లైన్స్ని.. పరిశోధకులతో పంచుకునేందుకు ఇప్పుడు మెటా ముందుకొచ్చింది. దీనివల్ల.. కండరాల నుంచి వచ్చే విద్యుత్ సంకేతాల ఆధారంగా పనిచేసే.. మరిన్ని టెక్నాలజీల ఆవిష్కరణలకు ఇది ఉపయోగపడనుంది.
ఇప్పటికే.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వచ్చేసింది. ఏఐ.. వండర్స్ క్రియేట్ చేస్తోంది. ఇప్పుడు.. మెటా కూడా రిస్ట్ బ్యాండ్ తయారుచేసింది. వీటికి మించి.. ఎలాన్ మస్క్ న్యూరాలింక్ ప్రాజెక్ట్ కూడా మరింత అడ్వాన్స్డ్గా త్వరలోనే అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. జస్ట్.. మైండ్లో అనుకుంటే చాలు.. అయిపోతుంది. ఆలోచన వస్తే చాలు.. ఎక్కువగా ఆలోచించకుండా సెకన్లలో ఆచరణలో పెట్టేయొచ్చు. రాబోయే రోజుల్లో టెక్నాలజీ మరింత అద్భుతంగా మారబోతోంది. ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేయబోతోంది.
మనిషి మెదడుని కంప్యూటర్తో లింక్ చేసే టెక్నాలజీ
ఈ ఇన్పుట్ పరికరాలు, వాయిస్ కమాండ్లు, రిస్ట్ బ్యాండ్లు కాదు.. డైరెక్ట్గా మానవ మెదడుని.. కంప్యూటర్తో లింక్ చేసే టెక్నాలజీ రెడీ అవుతోంది. అదే.. ఎలాన్ మస్క్ స్థాపించిన న్యూరాలింక్. ఇప్పటికే.. ఈ సంస్థ.. తన బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ చిప్ని.. తొమ్మిదో వ్యక్తి మెదదడులో విజయవంతంగా అమర్చింది. ఈ టెక్నాలజీ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసే మ్యాట్రిక్స్ లాంటి ఫ్యూచర్ని.. వాస్తవంగా మార్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఇది గనక పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే.. టెక్నాలజీ రంగంలో ఇదో సరికొత్త రెవల్యూషన్ తీసుకొస్తుంది.
మానవ సామర్థ్యాలను మెరుగుపరిచే దిశగా ప్రయత్నాలు
న్యూరాలింక్ అనేది.. 2016లో ఎలాన్ మస్క్ స్థాపించిన.. ఓ న్యూరో టెక్నాలజీ కంపెనీ. దీని ప్రధాన లక్ష్యం.. మానవ మెదడుని, ఏఐ, కంప్యూటర్లతో లింక్ చేయడమే. దీని ద్వారా వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంతో పాటు, మానవ సామర్థ్యాలను మెరుగుపరిచే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. న్యూరాలింక్ బ్రెయిన్ చిప్, మెదడు నుంచి వచ్చే సంకేతాలను చదవడం, వాటిని కంప్యూటర్ ద్వారా నియంత్రించడం, ఉత్తేజపరచడం లాంటి పనుల్ని చేయగలదు. ఈ దిశలో.. న్యూరాలింక్ తమ టెక్నాలజీని తొమ్మిదో వ్యక్తి మెదడులో అమర్చినట్లు ఇటీవల ప్రకటించింది. ఈ చిప్ని.. లింక్ అని పిలుస్తారు. ఇది చిన్న సైజులో ఉండి.. మెదడులోని న్యూరాన్ల కార్యకలాపాలను రికార్డ్ చేసి.. బయట ఉన్న డివైజ్లకు పంపగలదు. ఈ ప్రక్రియలో భాగంగా.. న్యూరాలింక్.. సర్జరీ ద్వారా ఈ చిప్ని మనిషి మెదడులో అమర్చుతుంది. ఈ సర్జరీ చాలా కచ్చితమైన రోబోటిక్ టెక్నాలజీ ద్వారా జరుగుతుంది. ఇది.. హ్యూమన్ సర్జన్ల కంటే ఎక్కువ కచ్చితత్వంతో పనిచేస్తుంది.
మెదడు ద్వారా నేరుగా ఇంటర్నెట్ని యాక్సెస్, జ్ఞాపకశక్తి మెరుగుదల
న్యూరాలింక్ మెయిన్ టార్గెట్.. వైద్య రంగంలో సమస్యల్ని పరిష్కరించడమే. పక్షవాతం, అల్జీమర్స్, పార్కిన్సన్స్ లాంటి న్యూరోలాజికల్ వ్యాధులకు చికిత్స అందించడం ప్రధానంగా కనిపిస్తున్నాయ్. అంతేకాదు.. మెదడు ద్వారా నేరుగా ఇంటర్నెట్ని యాక్సెస్ చేయడం, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడం, ఏఐతో సమానంగా పనిచేసేలా.. మానవ సామర్థ్యాలను మెరుగుపరచడమే దీని లక్ష్యం. అంతేకాదు.. సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూపించినట్లుగా.. మానవులు తమ మెదడు ద్వారా వర్చువల్ రియాలిటీ, కంప్యూటర్ సిస్టమ్స్తో నేరుగా ఇంటరాక్ట్ అయ్యే రోజులు కూడా రావొచ్చంటున్నారు. ఇప్పటివరకు న్యూరాలింక్ 9 మందిపై తమ చిప్ని పరీక్షించింది. మొదటి వ్యక్తిలో చిప్ అమర్చిన తర్వాత.. తన ఆలోచనలతో కంప్యూటర్ కర్సర్ని నియంత్రిస్తూ.. చెస్ ఆడగలిగాడు. ఈ టెక్నాలజీ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది.
Also Read: ఎమ్మెల్యేలకు బాబు వార్నింగ్..! టెన్షన్లో ఎమ్మెల్యేలు..
చిప్ని మరింత చిన్న సేఫ్గా తయారుచేస్తున్న న్యూరాలింక్
న్యూరాలింక్ తమ చిప్ని మరింత చిన్నగా, సురక్షితంగా, సమర్థవంతంగా చేయడానికి పనిచేస్తోంది. ఈ టెక్నాలజీ గనక సక్సెస్ అయితే.. మానవుల జీవన విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావొచ్చు. మనుషులు తమ మెదడు ద్వారా నేరుగా సమాచారాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. వర్చువల్ రియాలిటీలో మునిగిపోవచ్చు. ఈ న్యూరాలింక్ చిప్.. మనిషి మెదడు, యంత్రాల మధ్య గ్యాప్ని తగ్గించే దిశగా.. ఓ గొప్ప ఆవిష్కరణగా కనిపిస్తోంది. తొమ్మిదో వ్యక్తిలోనూ చిప్ అమరిక విజయవంతం కావడం.. ఈ టెక్నాలజీ సామర్థ్యాన్ని తెలియజేస్తోంది. అయితే.. ఇది పూర్తిగా డెవలప్ అవడానికి.. ఇంకొన్ని సవాళ్లను అధిగమించాల్సి ఉంటుందనే చర్చ జరుగుతోంది. న్యూరాలింక్ ప్రాజెక్ట్, మెటా రిస్ట్ బ్యాండ్ లాంటి అద్భుతమైన టెక్నాలజీలు.. మానవుల భవిష్యత్తును మార్చే కెపాసిటీ కలిగి ఉన్నాయ్.
Story By Anup, Bigtv