Offline UPI Payments: మన దేశంలో యూపీఐ వాడకం ఎంతగా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టీ కొట్టు నుండి కార్ షోరూమ్ వరకు అంతా స్కాన్ చేసి పేమెంట్లు చేసేస్తున్నారు. అయితే సిగ్నల్ సరిగ్గా లేనప్పుడు లేదా ఇంటర్నెట్ స్లోగా ఉన్నప్పుడు డబ్బులు కట్ అవ్వక ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇకపై అలాంటి చిక్కులు ఉండవు. ఇంటర్నెట్ లేకపోయినా చాలా తేలిగ్గా పేమెంట్ చేసే కొత్త విధానాన్ని తెచ్చేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) సిద్ధమవుతోంది.
ఈ కొత్త విధానంలో నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్సీ) టెక్నాలజీని వాడనున్నారు. అంటే ఇకపై క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం, పిన్ నెంబర్ కొట్టడం లాంటివి అవసరం ఉండదు. దీని కోసం మీ ఫోన్లో ఎన్ఎఫ్సీ ఆప్షన్ ఉంటే చాలు. దానిని షాపులో ఉన్న పేమెంట్ మెషిన్ (పీఓఎస్) దగ్గర చిన్నగా టాప్ చేస్తే సరిపోతుంది. క్షణాల్లో పేమెంట్ పూర్తయిపోతుంది.
Also Read: ఊహించని ఫీచర్లు.. ఏకంగా 8000mAh బ్యాటరీతో Oppo K15 లాంచ్, ధర ఎంతంటే?
ఈ సేవలు మన ఫోన్లోని ‘యూపీఐ లైట్’ వాలెట్ ఆధారంగా పనిచేస్తాయి. నెట్వర్క్ ఉన్నప్పుడు మన బ్యాంక్ ఖాతా నుండి ఈ వాలెట్లో ముందే కొంత డబ్బు లోడ్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్నెట్ లేని ప్రదేశాల్లో కూడా ఈ డబ్బుతో రూ.2,000 వరకు సులభంగా లావాదేవీలు జరుపుకోవచ్చు. మెట్రో స్టేషన్లు, బేస్మెంట్లు, ప్రయాణాలు చేసే సమయంలో లేదా సిగ్నల్ లేని మారుమూల ప్రాంతాల్లో ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
ఈ సేవలను వ్యాపారులు అందించాలంటే వారు వాడే పీఓఎస్ మెషిన్లకు ఎన్పీసీఐ గుర్తింపు తప్పనిసరి. ఈ ఏడాది ఆఖరు నాటికి దీనికి సంబంధించిన అనుమతులు ఇచ్చే ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆ తర్వాత ప్రముఖ పేమెంట్ యాప్స్ ద్వారా ఈ ఫీచర్ మనందరికీ అందుబాటులోకి వస్తుంది. ఇంటర్నెట్ అంతరాయాలతో సంబంధం లేకుండా డిజిటల్ చెల్లింపులు చేయాలనుకునే వారికి ఇది నిజంగా పెద్ద ఉపశమనం అనే చెప్పాలి.
Also Read: పవర్ఫుల్ ప్రాసెసర్లతో POCO F9 సిరీస్.. సర్టిఫికేషన్ సైట్లలో లీకైన వివరాలు ఇవే!