Humidifier: వర్షాలు పడగానే ఎండల వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది కానీ, దానితో పాటు వాతావరణంలో తేమ బాగా పెరిగిపోతుంది. గాలిలో జిగటగా అనిపించడం, ఎంతసేపటికీ చెమట ఆరకపోవడం లాంటి సమస్యలు మొదలవుతాయి. గోడలు, బట్టలు కూడా తడి తడిగా అనిపిస్తుంటాయి. ఇలాంటప్పుడు ఇంట్లోని గాలిని మార్చడానికి ‘హ్యూమిడిఫైయర్’ వాడదామని చాలామంది అనుకుంటారు. కానీ అది మంచి ఆలోచన కాదని నిపుణులు చెప్తున్నారు. ఎందుకో ఇప్పుడీ కథనం ద్వారా తెలుసుకుందాం పదండి..
గాలిలో ఉండే నీటి ఆవిరి శాతాన్నే మనం తేమ అంటాం. వర్షాల వల్ల ఈ తేమ చాలా ఎక్కువగా పెరుగుతుంది. దీనివల్ల మన శరీరంలో చెమట త్వరగా ఆరిపోక వేడిగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇల్లు అదో రకమైన వాసన రావడం, సామాన్లు, బట్టలు ఆరకపోవడం, గోడలు తడిగా మారడం లాంటివి దీనివల్లే జరుగుతాయి.
హ్యూమిడిఫైయర్ అనేది గాలిలో తేమను పెంచడానికి ఉపయోగపడే పరికరం. పొడి వాతావరణం ఉన్న చలికాలంలో లేదా ఏసీ వల్ల గాలి పొడిబారినప్పుడు దీనిని వాడతారు. కొన్నిసార్లు ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారికి డాక్టర్లు దీనిని సూచిస్తారు. కానీ ఇప్పటికే గాలిలో తేమ ఎక్కువగా ఉన్న వర్షాకాలంలో దీనిని వాడితే.. అది ఇంట్లో మరింత తడిని పెంచి సమస్యలను కొనితెస్తుంది.
ఇంట్లో తేమ పరిమితి దాటితే నల్లటి బూజు, ఫంగస్ చేరతాయి. పురుగులు కూడా వేగంగా పెరుగుతాయి. దీంతో అలెర్జీలు, ఆస్తమా లాంటి సమస్యలు ఎక్కువవుతాయి. అంతేకాదు.. ఇల్లంతా ఒక రకమైన మురికి వాసన వస్తుంది. చెక్క ఫర్నిచర్, పుస్తకాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు త్వరగా పాడైపోతాయి.
వర్షాకాలంలో గాలిలో తేమను పెంచడం కాకుండా తగ్గించడంపై దృష్టి పెట్టాలి. దీని కోసం మీ ఇంట్లోని ఏసీలో ఉన్న ‘డ్రై మోడ్’ వాడితే గాలిలోని తేమ తగ్గుతుంది. ముంబయి, విశాఖపట్నం లాంటి తీర ప్రాంతాల్లో ఉండేవారు ‘డీహ్యూమిడిఫైయర్’ వాడుకోవచ్చు. వర్షం తగ్గినప్పుడు కిటికీలు తెరిచి గాలి ఆడేలా చూడాలి. తడి బట్టలను ఇంట్లో ఆరబెట్టకూడదు. వీలైతే ఇంట్లో తేమ శాతాన్ని 40 నుండి 60 శాతం మధ్య ఉండేలా చూసుకోవాలి.
ఎండాకాలంలో లేదా చలికాలంలో ఏసీ వాడినప్పుడు గాలి పొడిబారితే హ్యూమిడిఫైయర్ వాడొచ్చు. కానీ వర్షాకాలంలో ఏసీ, హ్యూమిడిఫైయర్ కలిపి వాడటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. వర్షాకాలంలో గాలిలోని తేమను తొలగించడమే మన ప్రధాన లక్ష్యం కావాలి. దీనివల్ల ఇల్లు శుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉంటుంది.
Also Read: రూ.18 వేలకే క్యూఎల్ఈడీ, ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీలు.. లైనప్లో బెస్ట్ ఆప్షన్స్ ఇవే!