Glenn Maxwell-IPL 2026 : ఐపీఎల్ సీజన్ 2026 కి కీలక ఆటగాళ్లు దూరం కానున్నట్టు తెలుస్తోంది. వీరిలో ప్రధానంగా మ్యాక్స్ వెల్, డూప్లెసిస్, మొయిన్ అలీ, ఆండ్రె రస్సెల్. అయితే రస్సెల్ రిటైర్డ్ కాగా.. మొయిన్ అలీ పీఎస్ఎల్, డూప్లెసిస్ కూడా పీఎస్ఎల్ కి ఆడనున్నారు. కానీ మ్యాక్స్ వెల్ మాత్రం రిజిస్టర్ చేసుకోకపోవడం గమనార్హం. ఈనెలలో జరిగే మినీ వేలం కోసం ఆస్ట్రేలియన్ క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ ఇప్పటివరకు రిజిస్టర్ చేసుకోలేదని సమాచారం. గత సీజన్ లో మ్యాక్స్ వెల్ పంజాబ్ కింగ్స్ తరపున ఆడాడు. తిరిగి రిటైన్ చేసుకోని విషయం తెలిసిందే. ఈ క్రమంలో మ్యాక్స్ వెల్ వచ్చే సీజన్ ఆడేది అనుమానమేనని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి. ఐపీఎల్ మిని ఆక్షన్ కోసం 14 దేశాల నుంచి 1,355 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నట్టు క్రిక్ బజ్ తెలిపింది.
వీరిలో మయాంక్ అగర్వాల్, వెంకటేష్ అయ్యర్, రాహుల్ చాహర్, కే.ఎస్.భరత్, పృథ్వీషా వంటి క్రీడాకారులు ఉన్నారు. భారత్ నుంచి కేవలం రవి బిష్ణోయ్, వెంకటేష్ అయ్యర్, విదేశాల నుంచి గ్రీన్, స్టీవ్ స్మిత్, ఇంగ్లీషు తదితర 47 మంది రూ.2కోట్ల బేస్ ప్రైజ్ లిస్టులో ఉన్నారు. ఈనెల 16న అబుదాబి వేదికగా మినీ వేలం జరుగనుంది. ముఖ్యంగా ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్, సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్, ఇంగ్లండ్ వికెట్ కీపర్ జామీ స్మిత్ ఈ జాబితాలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. గాయం కారణంగా గత సీజన్ కి దూరమైన కామెరాన్ గ్రీన్, ఈసారి వేలంలోకి భారీ అంచనాలతో వస్తున్నాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ రూ.2 కోట్ల కనీస ధరతో తన పేరును నమోదు చేసుకున్నాడు.
ఐపీఎల్ లో విధ్వంసకర బ్యాటింగ్ కి పెట్టింది పేరైన గ్లెన్ మ్యాక్స్ వెల్ ఈ వేలానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం గమనార్హం. ఆయన ఈ సారి వేలంలో పాల్గొనడం లేదు. భారత ఆటగాళ్లలో కేవలం ఇద్దరూ మాత్రమే అత్యధిక ధర అయిన రూ.2కోట్ల విభాగంలో ఉన్నారు. వారిలో మాజీ కేకేఆర్ స్టార్ వెంకటేష్ అయ్యర్, లక్నో సూపర్ జెయింట్స్ మాజీ స్పిన్నర్ రవి బిష్ణోయ్ ఉన్నారు. మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, రాహుల్ త్రిపాఠి వంటి ప్రముఖ భారతీయ ఆటగాళ్లు కూడా వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఐపీఎల్ 2026 మినీ వేలం కోసం అప్గానిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఐర్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండిస్, జింబాబ్వే, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, యూఎస్ఏ సహా వివిధ దేశాల నుంచి మొత్తం 14 మంది విదేశీ ఆటగాళ్లు నమోదు చేసుకున్నారు. భారత సంతతికి చెందిన మలేషియా క్రికెటర్ వీరన్ దీప్ సింగ్ కూడా ప్రవేశం పొందాడు. కుడిచేతి వాటం మలేషియా ఆల్ రౌండర్ తన బేస్ ధరను రూ.30లక్షలుగా నిర్ణయించాడు.
Also Read : KL Rahul -Kohli : టీమిండియా జట్టులో గొడవలు.. KL రాహుల్ కేక్ కటింగ్, అవమానించిన కింగ్ కోహ్లీ!