Sanjay Manjrekar On IND VS SL: టీమిండియా వర్సెస్ శ్రీలంక మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ ఇవాల్టితో ముగిసింది. ఈ టెస్ట్ సిరీస్ లో మొదటి మ్యాచ్ లో టీమిండియా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. సెకండ్ మ్యాచ్ లో గెలుపు ముంగిట… టీమిండియా బోల్తా కొట్టింది. ఐదవ రోజు శ్రీలంక బ్యాటర్లను అవుట్ చేయడంలో ఇబ్బంది పడ్డ టీమిండియా… మ్యాచ్ డ్రా చేసుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ 1-0 తేడాతో ఈ టెస్ట్ సిరీస్ కైవసం చేసుకుంది టీం ఇండియా. అయితే రెండవ టెస్టు డ్రా అయిన నేపథ్యంలో టీమిండియా పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా కెప్టెన్ శుభమాన్ గిల్ అటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తప్పుడు నిర్ణయాల వల్ల మ్యాచ్ డ్రా అయిందని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
శ్రీలంక వర్సెస్ టీమ్ ఇండియా (Sri Lanka vs India) మధ్య జరిగిన రెండో టెస్టు ( India tour of Sri Lanka 2026 ) డ్రా కావడంపై తాజాగా సంజయ్ మంజ్రేకర్ కూడా స్పందించారు. కెప్టెన్ గిల్ తో పాటు కోచ్ గౌతమ్ గంభీర్ ను ఏకిపారేశారు. రెండో టెస్ట్ లో గెలవాలన్న కసి ఈ ఇద్దరిలో కనిపించలేదని మండిపడ్డారు. మొదటి మ్యాచ్ గెలిచిన ఆనందంలో… ఇద్దరికీ పొగరు తలకెక్కిందని ఫైర్ అయ్యారు. ఈ దెబ్బకు మ్యాచ్ గెలిచి అర్హతను కూడా టీమిండియా కోల్పోయిందని విమర్శలు చేశారు. మ్యాచ్ డ్రా అవుతున్న నేపథ్యంలో డ్రెస్సింగ్ రూమ్ లో గౌతమ్ గంభీర్ నవ్వుతూ కనిపించాడని కూడా విమర్శలు చేశారు.
ఇటు కెప్టెన్ గిల్ కూడా మైదానంలో కంటే డ్రెస్సింగ్ రూమ్ లో ఎక్కువగా కనిపించాడని ఆగ్రహించారు. ఈ పరిస్థితి చూసిన తర్వాత టెస్టులు గెలవడం టీమిండియా యాజమాన్యానికి అసలు ఇష్టం లేదా ? అని తనకు అనిపించినట్లు ఆగ్రహించారు. ఇప్పటికైనా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ట్రోఫీ గెలవాలంటే ముందుగా కోచ్ గౌతమ్ గంభీర్ ఆ తర్వాత గిల్ ను కూడా టీమిండియా నుంచి గెంటేయాలని డిమాండ్ చేశారు. అప్పుడే టీమ్ ఇండియాకు విజయాలు దక్కుతాయని పేర్కొన్నారు.
శ్రీలంకతో జరిగిన రెండో టెస్టు సందర్భంగా ఫాలో ఆన్ నిర్ణయమే టీమిండియా కొంపముంచిందని, ఇర్ఫాన్ పఠాన్ ఫైర్ అయ్యారు. ఫాలో ఆన్ ఇవ్వకుండా టీమిండియా రెండో ఇన్నింగ్ లో బ్యాటింగ్ చేసి ఉంటే పరిస్థితి వేరే లాగా మారేదని తెలిపారు. వరుసగా రెండు ఇన్నింగ్స్ లలో టీమిండియా బౌలర్లు బౌలింగ్ చేసి అలిసిపోయారని తెలిపారు. దీని వల్ల ఐదవ రోజు వికెట్లు పడలేదని ఇర్ఫాన్ పఠాన్ క్లారిటీ ఇచ్చారు. గిల్ కెప్టెన్సీ తో పాటు గౌతమ్ గంభీర్ ను కూడా విమర్శించారు.