Dream11 : ఆసియా కప్ 2025 కి ముందు టీమిండియా కి స్పాన్సర్ షిప్ పరేషాన్ పట్టింది. ముఖ్యంగా ఆన్లైన్ గేమింగ్ నిర్వహణపై పార్లమెంట్లో తీసుకొచ్చిన కొత్త చట్టం వల్ల టీం ఇండియా స్పాన్సర్ షిప్ నుండి తప్పుకుంటున్నట్టు డ్రీమ్ 11 ప్రకటించింది. ఆసియా కప్ కు ముందు డ్రీమ్ 11 తప్పుకోవడంతో కొత్త స్పాన్సర్ వేటలో పడింది బీసీసీఐ. ముఖ్యంగా ఆసియా కప్ 2025 ప్రారంభానికి కొద్ది వారాల సమయం మాత్రమే మిగిలిఉన్న వేల భారత క్రికెట్ జట్టుకు మైదానం బయట ఊహించని షాక్ తగిలింది. జట్టు ప్రధాన స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న ప్రముఖ పాంటసీ గేమ్ ప్లాట్ ఫామ్ డ్రీమ్ 11 తమ ఒప్పందం నుంచి తప్పుకుంటున్న ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్ లైన్ గేమింగ్ బిల్లు 2025 కారణంగానే ఈ పరిణామం చోటు చేసుకుంది.
Also Read : Aus Vs SA : ఆస్ట్రేలియా విధ్వంసం.. 50 ఓవర్లలో 431 పరుగులు.. హెడ్ తో పాటు మొత్తం ముగ్గురు సెంచరీలు
డ్రీమ్ 11 వైదొలగడానికి అదే కారణమా..?
ఈ కొత్త చట్టం ప్రకారం.. డబ్బుతో ఆడే ఆన్ లైన్ గేమింగ్ ప్లాట్ ఫామ్ లను నిషేదించడమే డ్రీమ్ 11 వైదొలగడానికి ప్రధాన కారణం అని తెలుస్తోంది. ఇక ఈ అనూహ్య పరిణామంతో బీసీసీఐ అప్రమత్తమైంది. త్వరలోనే జెర్సీ స్పాన్సర్ షిప్ హక్కుల కోసం కొత్త బిడ్లను ఆహ్వానించేందుకు సిద్ధం అవుతోంది. సెప్టెంబర్ 09 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కేవలం రెండు వారాల వ్యవధిలో కొత్త స్పాన్సర్ ను ఖరారు చేయడం ఇప్పుడు బీసీసీఐకి కత్తిమీద సాములా మారింది. భారత జట్టు స్పాన్సర్ షిప్ కి ఎప్పుడూ భారీ డిమాండ్ ఉన్నప్పటికీ ఇంత తక్కువ సమయంలో ఈ ప్రక్రియను పూర్తి చేయడం ఇప్పుడు పెను సవాల్ గా మారింది. ఒకవేళ టోర్నమెంట్ ప్రారంభమయ్యే లోపు కొత్త స్పాన్సన్ ఖారారు కాకపోతే ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ బోర్డుగా పేరున్న బీసీసీఐ ఆధ్వర్యంలోని భారత జట్టు, జెర్సీ పై ప్రధాన స్పాన్సర్ లోగో లేకుండానే బరిలోకి దిగాల్సి వస్తుంది.
ఇది చాలా అరుదైన ఘటన
ఇది చాలా అరుదైన సంఘటన అవుతుంది. ఇప్పటికే డ్రీమ్ 11 లోగో తో జెర్సీలను ముద్రించినప్పటికీ వాటిని టోర్నమెంట్ లో ఉపయోగించబోరని సమాచారం. గతంలో ఆర్థిక సంక్షోభం కారణంగా బైజూస్, న్యాయపరమైన చిక్కులతో సహారా వంటి సంస్థలు కూడా టీమిండియా స్పాన్సర్ షిప్ నుంచి మధ్యలోనే తప్పుకున్నాయి. ఇప్పుడు డ్రీమ్ 11 కూడా అదే జాబితాలో చేరింది. 2023 జులైలో బీసీసీ, డ్రీమ్ 11 మధ్య మూడేళ్ల కాలానికి గాను రూ.358 కోట్లతో ఒప్పందం కుదిరింది. కానీ కొత్త చట్టం కారణంగా ఈ ఒప్పందం రెండేళ్లకే ముగిసిపోతోంది. ఈ విషయం పై డ్రీమ్ 11 తాజాగా క్లారిటీ ఇచ్చింది. బీసీసీఐ ఇప్పుడు కొత్త స్పాన్సర్ ను నియమిస్తుందా..? లేక ఆసియా కప్ ముగిసిన తరువాత కొత్త స్పాన్సర్ షిప్ తో ఒప్పందం చేసుకుంటుందా..? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.