![Mumbai Indians vs Rajasthan Royals Live Updates](https://www.bigtvlive.com/wp-content/uploads/2024/04/MI.jpg)
Mumbai Indians vs Rajasthan Royals Highlights: వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాజసంగా విజయం సాధించింది. మరో 27 బంతులు మిగిలుండగానే రాజస్ధాన్ విజయం సాధించింది. దీంతో ముంబై హ్యాట్రిక్ ఓటములను మూటగట్టుకుంది. రియాన్ పరాగ్(54*, 39 బంతుల్లో) చెలరేగడంతో 126 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ 4 వికెట్లు కోల్పోయి చేధించింది.
అంతకుముందు ట్రెంట్ బౌల్ట్, చాహల్ చెరో 3 వికెట్లతో చెలరేగడంతో ముంబై 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది.
126 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. రెండు ఫోర్లు కొట్టి ఊపు మీదున్న యశస్వి జైస్వాల్(10)ను మఫాకా అవుట్ చేశాడు. 42 పరుగుల వద్ద సంజూ శాంసన్(12) వద్ద రెండో వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. ఆ తరువాత జాస్ బట్లర్(13) మధ్వాల్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. దీంతో 48 పరుగులకు రాజస్థాన్ 3 వికెట్లు కోల్పోయింది.
ఆ తరువాత గత మ్యాచ్ హీరో పరాగ్, అశ్విన్ రాజస్థాన్ను విజయం దిశగా నడిపించారు.
16 పరుగులు చేసిన ఆశ్విన్ మధ్వాల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీంతో రాజస్థాన్ 88 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.
రియాన్ పరాగ్ హాఫ్ సెంచరీతో చెలరేగడంతో రాజస్థాన్ సునాయాసంగా లక్ష్యాన్ని చేధించింది.
తడబడిన ముంబై
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబై ఓపెనర్లకు రాజస్థాన్ బౌలర్లు చుక్కలు చూపించారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే రాజస్థాన్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ వరుస బంతుల్లో రోహిత్ శర్మ, నమన్ ధీర్ వికెట్లను తీసి ముంబై వికెట్ల పతనాన్ని శాసించాడు. ఇద్దరు గోల్డెన్ డక్లుగా వెనుదిరగడం విశేషం.
ఇక ఇన్నింగ్స్ మూడో ఓవర్లో ఇంపాక్ట్ సబ్ ట్రిస్టన్ స్టబ్స్ను గోల్డెన్ డక్గా పెవిలియన్ పంపిచాడు ట్రెంట్ బౌల్ట్. 16 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ బర్గర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీంతో 20 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ముంబై కష్టాల్లో పడింది. పవర్ ప్లే ముగిసేలోపు ముంబై 4 వికెట్లు కోల్పోయి 46 పరుగులు చేసింది.
ఆ తర్వాత తిలక్ వర్మ 32, హార్ధిక్ పాండ్యా 34 పరుగులతో ముంబై ఇన్నింగ్స్ను గాడిలో పెట్టారు. 34 పరుగులు చేసిన హార్ధిక్ పాండ్యా చాహల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన పియూష్ చావ్లా 3 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. దీంతో 83 పరుగుల వద్ద ముంబై 6వ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత 32 పరుగులు చేసిన తిలక్ వర్మ చాహల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు.
4 పరుగులు చేసిన గెరాల్డ్ కోయెట్జీ 8వ వికెట్ రూపంలో వెనుదిరిగాడు. 111 పరుగుల వద్ద ముంబై కోయెట్జీ వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన టిమ్ డేవిడ్.. బర్గర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీంతో ముంబై 9వ వికెట్ కోల్పోయింది. చివర్లో బుమ్రా రాణించడంతో ముంబై 20 ఓవర్లలో 125 పరుగులు చేసింది.
రాజస్థాన్ బౌలర్లలో చాహల్ 3, బౌల్ట్ 3, బర్గర్ 2, అవేశ్ ఖాన్ 1 వికెట్ తీసుకున్నారు.