Rajasthan Royals Won the Match Against Punjab Kings: ఐపీఎల్ సీజన్ 2024లో మ్యాచ్ లు కొన్ని ఆసక్తికరంగా సాగుతున్నాయి. కొన్ని చప్పగా సాగుతున్నాయి. పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ మధ్య మొహలీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ మొదట చప్పగా సాగినా, చివరికి వచ్చేసరికి ఆసక్తికరంగా మారిపోయింది.
ఎందుకంటే టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఆఖరి ఓవర్ 5వ బంతి వరకు ఉత్కంఠ సాగింది. చివరికి 152 పరుగులు చేసి రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది.
ఈసారి మ్యాచ్ లో కెప్టెన్ శిఖర్ ధావన్ ఆడలేదు. ఎందుకు గబ్బర్ ఆడలేదనేది ఇంకా తెలీదు. గాయపడ్డాడా? రెస్ట్ కోరుకున్నాడా? లేక తప్పించారో తెలీదు. అలాగే రాజస్థాన్ రాయల్స్ నుంచి సెంచరీ హీరో జోస్ బట్లర్, అశ్విన్ ఇద్దరినీ తీసుకోలేదు. వీరిద్దరూ ఫిట్ గా లేరని సమాచారం. ఇంక పంజాబ్ లో ధావన్ ప్లేస్ లో శ్యామ్ కర్రన్ కెప్టెన్ గా వచ్చాడు.
Also Read: బస్సు డ్రైవర్గా మారిన రోహిత్ శర్మ.. వీడియో వైరల్..
తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ ఆరంభం నుంచి పడుతూ లేస్తూనే ముందుకు సాగింది. ఆవేశ్ ఖాన్(2/25), కేశవ్ మహరాజ్(2/23) సత్తా చాటడంతో వీళ్లు తేలిపోయారు. ధావన్ ప్లేస్ లో వచ్చిన అధర్వ (15), బెయిర్ స్టో (15) , ప్రభ్ సిమ్రాన్ (10), శ్యామ్ కర్రన్ (6) ఇలా వరుసపెట్టి అవుట్ అయిపోయారు.
ఒక దశలో 70 పరుగులకే 5 వికెట్లు పడిపోయిన పంజాబ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. తర్వాత జితేశ్ శర్మ (29), అశుతోష్ శర్మ (31), లివింగ్ స్టోన్ (21) గట్టిగా ఆడటంతో 147 పరుగులైనా చేయగలిగింది.
రాజస్థాన్ బౌలింగ్ లో ఆవేశ్ ఖాన్ 2, కేశవ్ మహరాజ్ 2, ట్రెంట్ బౌల్ట్, కుల్దీప్ సేన్, చాహల్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
148 పరుగుల లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్ కి మంచి శుభారంభమే దక్కింది. ఒక దశలో ఓపెనర్లు ఇద్దరూ గెలిపిస్తారని అంతా అనుకున్నారు. చాలా మ్యాచ్ ల తర్వాత యశస్వి జైశ్వాల్ ఫామ్ లోకి వచ్చాడు. 28 బంతుల్లో 4 ఫోర్లతో 39 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ తనుష్ (24) అవుట్ అయ్యాడు.
Also Read: Shikhar Dhawan: పంజాబ్ కి షాక్.. ధావన్ రెండు వారాలు ఆడట్లేదు
ఆ తర్వాత కెప్టెన్ సంజూ శాంసన్ (18), రియాన్ పరాగ్ (23), ధ్రువ్ జురెల్ (6), పావెల్ (11), కేశవ్ మహరాజ్ (1) ఇలా వీళ్లు కూడా క్యూ కట్టారు. ఇంక చివరికి 6 బంతుల్లో 10 పరుగులు చేయాల్సిన పరిస్థితిలో షిమ్రాన్ హెట్ మేర్ ఫటాఫట్ కొట్టి, మరో బంతి మిగిలి ఉండగా విజయాన్ని అందించాడు.
152 పరుగులతో విజయ పతాకాన్ని ఎగురవేసింది. లో స్కోర్ మ్యాచ్ అయినా సరే, చివరి వరకు ఉత్కంఠగానే సాగి,అభిమానులకి కావల్సిన మసాలాని అందించింది.
పంజాబ్ బౌలింగ్ లో కసిగో రబడ 2, శామ్ కర్రన్ 2, అర్షదీప్, లివింగ్ స్టోన్, హర్షల్ పటేల్ తలా ఒక వికెట్ పడగొట్టారు. వీరిలో అర్షదీప్ 4 ఓవర్లలో 45 పరుగులిచ్చాడు. ఇదే కొంప ముంచిందని కొందరు విశ్లేషిస్తున్నారు.