Ravindra Jadeja: ఐదు టెస్టుల అండర్సన్ – సచిన్ ట్రోఫీలో భాగంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన మూడవ టెస్ట్ లో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా భారత్ ను మ్యాచ్ లో నిలబెట్టడానికి పోరాట ఇన్నింగ్స్ ఆడాడు. జడేజా ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. వారియర్ లాగా భారత్ ని గెలుపు దిశగా తీసుకురావడంలో.. ఇంగ్లాండ్ నీ టెన్షన్ పెట్టడంలో విజయవంతం అయ్యాడు. మ్యాచ్ ఓడిపోయినప్పటికీ జడేజా ఆట తీరుకు ప్రశంసలు దక్కాయి.
లార్డ్స్ మైదానంలో ఆడడమే గొప్ప అనుకుంటే.. మంచి ఫైటింగ్ స్పిరిట్ తో ఆఫ్ సెంచరీ కూడా పూర్తి చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లు జోఫ్రా ఆర్చర్, కెప్టెన్ బెెన్ స్టోక్స్, బ్రైడెన్ కార్స్ ల పదునైన ఫాస్ట్ బౌలింగ్ ముందు భారత టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ కుప్ప కూలింది. ఆ సమయంలో టీమిండియా స్కోరు 7 వికెట్లకు 82 కాగా.. కాసేపటికి ఎనిమిది వికెట్లకు 112 గా మారింది. ఆ సమయంలో భారత బ్యాటింగ్ బాధ్యతను తీసుకున్న రవీంద్ర జడేజా.. చివరివరకు పోరాడాడు. బుమ్రా, మహమ్మద్ సిరాజ్ అండతో ఆటను చివరి సెషన్ వరకు తీసుకువెళ్లాడు. ఇక టీమిండియా గెలుపుకి చేరువగా వచ్చిన సమయంలో మహమ్మద్ సిరాజ్ బోల్డ్ కావడంతో భారత్ లక్ష్యానికి 22 పరుగుల దూరంలో నిలిచిపోయింది.
జడేజా రికార్డ్:
ఇక రవీంద్ర జడేజా తన అద్భుతమైన బ్యాటింగ్ తో అంతర్జాతీయ క్రికెట్ లో 7,000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. అలాగే రికార్డ్స్ బుక్ లో రిషబ్ పంత్, సౌరబ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోని, మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ సరసన చేరాడు. క్రికెట్ పుట్టినీళ్లుగా పేరున్న లార్డ్స్ లో రెండు ఇన్నింగ్స్ లలోను హాఫ్ సెంచరీలు సాధించి సత్తా చాటాడు. ఇంగ్లాండ్ తో భారత్ ఆడిన ఈ మూడు టెస్ట్ మ్యాచ్లలో జడేజా 109 యావరేజ్ తో 327 పరుగులు చేశాడు. ఇందులో అత్యధికంగా ఒక ఇన్నింగ్స్ లో 89 పరుగులు చేశాడు. ఈ సిరీస్ లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో ఐదవ స్థానంలో నిలిచాడు రవీంద్ర జడేజా.
రవీంద్ర జడేజా బ్యాట్ పై సింబల్:
మూడవ టెస్ట్ లోని రెండవ ఇన్నింగ్స్ సందర్భంలో రవీంద్ర జడేజా బ్యాట్ పై ఉన్న ఓ గుర్తు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణంగా క్రికెటర్లు వాడే బ్యాట్ దగ్గర నుంచి ప్యాడ్స్, హెల్మెట్, గ్లౌజ్ వంటి వాటిపై తమకు నచ్చిన విషయాలు ఫాలో అవుతుంటారు. అయితే రవీంద్ర జడేజా మాత్రం వీళ్లకు భిన్నంగా తన బ్యాట్ పై గుర్రం బొమ్మ వేయించాడు. ఇది సాదాసీదా గుర్రం కాదు. దీని వెనక ఓ పెద్ద కథ ఉంది. జడేజా బ్యాట్ పై ఉన్న సింబల్ ని మార్వాడి గుర్రం అని పిలుస్తారు.
మనదేశంలోని అత్యంత విలువైన గుర్రాలుగా వీటిని చెబుతుంటారు. వీటిని అప్పట్లో యుద్ధాలలో ఎక్కువగా వినియోగించేవారు. గతంలో మార్వార్, జైపూర్, జోధ్పూర్ సామ్రాజ్యాలలో ఈ గుర్రాలు లేకుండా యుద్ధాలు జరిగేవి కాదు. ముఖ్యంగా రాజ్ పుత్ యోధులు ఈ గుర్రాలపై సవారీ చేస్తూ యుద్ధాల్లో పై చేయి సాధించే వారని చరిత్రకారులు చెబుతున్నారు. అలాంటి ఎంతో ఘన చరిత్ర కలిగిన గుర్రం బొమ్మని జడేజా తన బ్యాట్ పై ముద్ర వేయించుకున్నాడు. జడేజాకి ఈ గుర్రాలు అంటే చాలా ఇష్టమట. అందుకే తన బ్యాట్ పై ఆ గుర్రం బొమ్మ ముద్ర వేయించుకున్నాడు.