Rohit Sharma – London: భారత క్రికెట్ జట్టులో {ROKO} గా పేరుపొందిన ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. క్రికెట్ చరిత్రలో ఎన్నో సంచలన రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. వీరిద్దరూ తమ అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నారు. అయితే ఇటీవల వీరిద్దరూ టెస్ట్ క్రికెట్ నుండి ఆకస్మికంగా రిటైర్మెంట్ తీసుకున్న విషయం తెలిసిందే. అంతకుముందే టి-20 వరల్డ్ కప్ గెలిచిన సమయంలో పొట్టి ఫార్మాట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన ఈ ఇద్దరు.. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు.
రోహిత్ – విరాట్ 2027 వరల్డ్ కప్ ఆడతారా..?
ఇక ఈ స్టార్ బ్యాటర్లు ఇద్దరూ 2027 ప్రపంచకప్ ఆడతారా..? లేక అంతకు ముందే రిటైర్మెంట్ అవుతారా..? అని మరోసారి చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో వన్డే వరల్డ్ కప్ 2027 లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ భాగస్వాములు అవుతారని భారత క్రికెట్ బోర్డు {బీసీసీఐ} ఓ ప్రకటన చేసింది. బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్ల ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ఈ మాజీ కెప్టెన్లు ఇద్దరు 2027 లో జరిగే వరల్డ్ కప్ కోసం అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు. వీరిద్దరూ టి-20, టెస్ట్ ఫార్మాట్లలో లేకపోవడంతో చాలా మిస్ అవుతున్నానని.. అయితే రిటైర్మెంట్ తీసుకోవాలనే నిర్ణయం వారి వ్యక్తిగత అభిప్రాయం అని అన్నారు.
విరాట్ కోహ్లీ బాటలో రోహిత్ శర్మ:
ఇక విరాట్ కోహ్లీ ప్రస్తుతం దాదాపు లండన్ షిఫ్ట్ అయిపోయాడు. అయితే ఇప్పుడు రోహిత్ శర్మ కూడా తన ఫ్యూచర్ ని లండన్ లో వెతుక్కోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎందుకంటే భారత్ లో ఉంటే అభిమానుల కారణంగా స్వేచ్ఛగా తిరగలేమనే భావనలో ఈ ఇద్దరు క్రికెటర్లు ఇప్పుడు విదేశాల్లో స్థిరపడే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. విరాట్ కోహ్లీ మ్యాచ్ లు ఉంటేనే భారత్ వచ్చి ఆడుతున్నాడు. లేదంటే ఎక్కువగా లండన్ లోనే గడుపుతున్నాడు.
ఇప్పుడు రోహిత్ శర్మ కూడా లండన్ షిఫ్ట్ కాబోతున్నాడని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రోహిత్ శర్మ ఇప్పటికే లండన్ లో ఖరీదైన ప్రాంతంలో ఇల్లు కొనుగోలు చేశాడని.. త్వరలోనే కుటుంబం మొత్తాన్ని అక్కడికి షిఫ్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు జాతీయ మీడియాలోనూ కథనాలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం రోహిత్ శర్మ వన్డే జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు. ఇప్పుడు వన్డేలు కూడా తక్కువగానే జరుగుతున్నాయి. మరో మూడు నెలల వరకు వన్డేలు లేవు.
ఈ క్రమంలో తన పిల్లల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని, కాలుష్యం వంటి సమస్యలు, అభిమానులతో ఇబ్బందులు ఉండకూడదు అని.. లండన్ లో ఉండడం మంచిదని రోహిత్ శర్మ భావిస్తున్నాడట. అంతేకాకుండా ప్రస్తుతం రోహిత్ శర్మ దేశవాళీ క్రికెటర్ లో కూడా పెద్దగా ఆడే ప్రయత్నం చేయడం లేదు. ఇక లండన్ షిఫ్ట్ అయిన తర్వాత ఇంగ్లాండ్ లో కౌంటి క్రికెట్ ఆడాలని రోహిత్ శర్మ భావిస్తున్నట్లు జాతీయ మీడియా వెల్లడించింది.
ఇక రోహిత్ శర్మ తన కెరీర్ లో ఇప్పటివరకు 273 వన్డే మ్యాచులు ఆడాడు. ఇందులో 11,168 పరుగులు చేశాడు. వన్డే ఫార్మాట్ లో 32 సెంచరీలు, 58 హాఫ్ సెంచరీలు చేశాడు. వన్డేల్లో అతడి అత్యధిక వ్యక్తిగత స్కోరు 264. అలాగే వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్ రోహిత్ శర్మ. ఇక 67 టెస్టులలో 4301 పరుగులు, 159 టి-20 మ్యాచ్లలో 4231 పరుగులు చేశాడు. రోహిత్ కెప్టెన్సీలో భారత జట్టు 2024 టీ-20 ప్రపంచ కప్, 2025 లో ఛాంపియన్స్ ట్రోఫీని అందుకుంది.