Kohli – Sangwan: గత కొంతకాలంగా పేలవ ఫామ్ తో బాధపడుతున్న టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దాదాపు 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రంజీ ట్రోఫీలో బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఢిల్లీ – రైల్వేస్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీని చూసేందుకు భారీ ఎత్తున తరలి వచ్చిన అభిమానులను కేవలం ఆరు పరుగులు మాత్రమే చేసి మరోసారి నిరాశపరిచాడు విరాట్ కోహ్లీ. ఈ మ్యాచ్ లో కోహ్లీని అవుట్ చేసి ఓవర్ నైట్ పాపులర్ స్టార్ అయిపోయాడు పేసర్ హిమాన్షు సాంగ్వాన్.
Also Read: IND Vs ENG ODI 2025: వన్డే సిరీస్ టైమింగ్స్.. ఉచితంగా ఎలా,ఎక్కడ చూడాలంటే..?
ఈ మ్యాచ్ లో మంచి స్పీడుతో అతడు వేసిన ఇన్ స్వింగ్ స్వింగర్ షాట్ ని ఆడబోయిన విరాట్ కోహ్లీ పెవిలియన్ చేరాడు. అతడి బ్యాట్ ని చేదించుకొని బంతి దూసుకు వచ్చి వికెట్లను గిరాటేసింది. దీంతో బాల్ తగిలిన వేగానికి స్టంప్ గాల్లోకి లేచి దాదాపు కీపర్ కి దగ్గరలో వెళ్లిపడింది. ఈ క్రమంలో తమ ఫేవరెట్ ఆటగాడిని అవుట్ చేసావని కొందరు సాంగ్వాన్ ని విమర్శిస్తే.. మరికొందరు మాత్రం అంతటి దిగ్గజ బ్యాటర్ ని పెవిలియన్ కి పంపావ్, నువ్వు గ్రేట్ అని మెచ్చుకున్నారు.
అయితే విరాట్ కోహ్లీ వికెట్ తీసినందుకు తనను ఫ్యాన్స్ తిట్టుకున్నా, ట్రోల్ చేసినా.. కోహ్లీ మాత్రం తనని మెచ్చుకున్నాడని తెలిపాడు సాంగ్వాన్. మ్యాచ్ అనంతరం కోహ్లీ నుంచి తాను ఆటోగ్రాఫ్ తీసుకున్నానని తెలిపారు. తనని మరింత కష్టపడాలని విరాట్ కోహ్లీ సూచించాడని తెలిపాడు. అయితే తాజాగా విరాట్ కోహ్లీ డిస్మిసల్ విషయంలో ఓ బస్సు డ్రైవర్ కి కూడా క్రెడిట్ ఇవ్వాలని అన్నాడు హిమాన్షు సాంగ్వాన్.
ఎందుకంటే విరాట్ కోహ్లీని అవుట్ చేసేందుకు ఐదవ స్టంప్ లైన్ లో బంతులు వేయాలని తమ టీమ్ బస్ డ్రైవర్ చెప్పాడని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు హిమాన్షు సాంగ్వాన్. ” ఈ మ్యాచ్ కి ముందు ఢిల్లీ తరపున విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ బరిలోకి దిగుతున్నారని వార్తలు వచ్చాయి. ఈ మ్యాచ్ ని ప్రత్యక్ష ప్రసారం చేస్తారని విషయం కూడా మాకు తెలియదు. ఆ తరువాత నెమ్మదిగా రిషబ్ పంత్ ఆడడం లేదని, కేవలం కోహ్లీ మాత్రమే బరిలోకి దిగుతున్నాడని తెలిసింది. అనంతరం ఈ మ్యాచ్ లైవ్ ఉంటుందని ఒక్కొక్కటిగా తెలిశాయి.
Also Read: Gongadi Trisha: తెలంగాణ తడాఖా చూపించా.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో త్రిష !
రైల్వేస్ పేస్ విభాగాన్ని నేనే నడిపిస్తున్నాను. దాంతో జట్టులోని ప్రతి ఒక్కరూ విరాట్ కోహ్లీని నేనే అవుట్ చేస్తానని అనుకున్నారు. నాపై నాకు నమ్మకం ఉంది. మా బస్సు డ్రైవర్ కూడా విరాట్ కోహ్లీ అవుట్ అవ్వాలంటే ఐదవ స్టంప్ లైన్ లో బాల్స్ వెయ్యాలని నాకు సలహా ఇచ్చాడు. నేను ప్రత్యర్థుల బలహీనతలకంటే.. నా బలాలపైనే ఫోకస్ చేస్తాను. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ వికెట్ సాధించా” అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ కామెంట్స్ విన్న నెటిజెన్లు విరాట్ కోహ్లీ ఫామ్ అందుకుంటే టీమిండియాకే ప్లస్ అయ్యేది కదా..? అని కామెంట్స్ చేస్తున్నారు.