Sourav Ganguly Says Virat Kohli Can Hit A 40-Ball Century: కొహ్లీలో ఆడే సత్తా వీసమెత్తయినా తగ్గలేదని సౌరభ్ గంగూలీ అన్నాడు. జూన్ 1 నుంచి ప్రారంభమయ్యే టీ 20 ప్రపంచకప్ లో ఎవరెవరు ఆడాలి? ఎవరు ఓపెనర్లుగా రావాలి? అనే చర్చ నెట్టింట జోరుగా సాగుతోంది. అందుకు తగినట్టుగానే సీనియర్లు పలువురు తమకు తోచిన విధంగా సలహాలు, సూచనలు చేస్తున్నారు. ఇంతకు ముందే సురేశ్ రైనా ట్వీట్ చేస్తూ శివమ్ దుబెను ఎంపిక చేయమని అనడం నెట్టింట వైరల్ గా మారింది.
ఇలా ఎవరికివారు తమ జట్లను ప్రకటిస్తున్నారు. అందులో ఇర్ఫాన్ పఠాన్, హర్షా భోగ్లే, ఇంకా విదేశీ ప్లేయర్లున్నారు. ప్రస్తుతం వీరి జాబితాలోకి సౌరవ్ గంగూలీ చేరాడు. ఇంతకీ విషయం ఏమిటంటే విరాట్ కొహ్లీకి 40 బంతుల్లోనే సెంచరీ చేయగల సత్తా ఉందని తెలిపాడు. ఆల్రడీ ప్రపంచ కప్ కి కెప్టెన్ గా రోహిత్ శర్మ ఉంటాడని బీసీసీఐ ప్రకటించింది. అందుకని తనతో పాటు మరో ఓపెనర్ గా విరాట్ కొహ్లీ వస్తే చాలా బాగుంటుందని అన్నాడు.
ఇద్దరూ రెండు వైపుల నుంచి దంచి కొడతారని అన్నాడు. ఒకరు అవుట్ అయినా, మరొకరు తగ్గి ఆడతారు, మ్యాచ్ ని కాపాడుకుంటూ వెళతారని అన్నాడు. విదేశీ పిచ్ లపై ఆడటం, భారత్ లో ఐపీఎల్ ఆడినంత తేలిక కాదని అన్నాడు. ముఖ్యంగా అమెరికాలో వాతావరణ పరిస్థితులకు తగినట్టుగా మన శరీరం సిద్ధం కావాలని అన్నాడు. ఒకవైపున వణికించే చలిలో చేతులు గడ్డకట్టుకుపోతుంటే, చెవుల్లోంచి చల్లని గాలి వెళుతుంటే, మరోవైపు ఆటపై శ్రద్ధ పెట్టి షాట్లు కొట్టడం అనుకున్నంత తేలిక కాదని అన్నాడు.
Also Read: ఉత్కంఠ పోరులో..ఢిల్లీ గెలుపు.. పోరాడి ఓడిన గుజరాత్
మనకు రోహిత్, విరాట్, సూర్యకుమార్, శివమ్ దూబె, హార్దిక్ పాండ్య లతో పాటు ఇంకా ఎంతో మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారన్నాడు. అవలీలగా బౌండరీలు కొట్టగల సారథ్యం వారి సొంతమన్నాడు. ఏదీ ఏమైనప్పటికీ అనుభవజ్ఞులు, యువ ఆటగాళ్లతో కూడిన జట్టుతోనే భారత జట్టు ప్రపంచకప్ బరిలోకి దిగాలని సూచించాడు.
ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్ మే 26న జరగనుంది. జూన్ 1న అమెరికా, వెస్టిండీస్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్తో టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీ ఆరంభం కానుంది. టీమ్ఇండియా తన తొలి మ్యాచ్ను జూన్ 5న ఐర్లాండ్తో ఆడనుంది. ఇందుకు న్యూయార్క్ వేదిక కానుంది.