World’s Highest Cricket Stadium: భారత్లో క్రికెట్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న పట్టణాల నుంచి నగరాల వరకు ఈ ఆటకు అభిమానులు ఉన్నారు. ఇప్పుడు క్రికెట్ను మరో లెవల్ కు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు కేంద్రం నిర్ణయించింది. లడఖ్ లోని లేహ్ కు సమీపంలోని థిక్సే-రణబీర్ పూర్ ప్రాంతంలో ఈ భారీ స్టేడియాన్ని నిర్మించాలని ప్రతిపాదించింది. సముద్ర మట్టానికి సుమారు 11,800 అడుగులు అంటే దాదాపు 3,600 మీటర్ల ఎత్తులో ఈ మైదానం ఉండనుంది. ప్రాజెక్ట్ పూర్తయితే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన క్రికెట్ స్టేడియాల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది.
ప్రతిపాదిత రణబీర్ పూర్ క్రికెట్ స్టేడియం లేహ్ పట్టణానికి సుమారు 19 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉండనుంది. భారీ స్థాయిలో నిర్మించాలనుకుంటున్న ఈ స్టేడియంలో దాదాపు 40 వేల మంది కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.100 కోట్ల నుంచి రూ.116 కోట్ల వరకు ఖర్చు కావచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, పూర్తి వ్యయం డీపీఆర్, డిజైన్, నిర్మాణ ప్రణాళికలు ఖరారైన తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
స్టేడియం నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనట్లు తెలుస్తోంది. 2026 ఆగస్టులో లేహ్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక తయారీ కోసం టెండర్ను ఆహ్వానించినట్లు సమాచారం. ఈ డీపీఆర్ లో స్టేడియం డిజైన్ ఎలా ఉండాలి? ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి? ఎంత ఖర్చు అవుతుంది? నిర్మాణం ఎప్పటిలోగా పూర్తి చేయాలి? లాంటి అంశాలను నిర్ణయించే అవకాశం ఉంది. ఆ తర్వాత అవసరమైన అనుమతులు, ఆమోదాలు లభించాక నిర్మాణ పనులు మొదలుపెట్టనున్నారు.
ప్రస్తుతం దేశంలోని అత్యంత ఎత్తైన క్రికెట్ మైదానాల్లో హిమాచల్ ప్రదేశ్లోని చైల్ క్రికెట్ గ్రౌండ్ ఒకటి. ఇది సముద్ర మట్టానికి సుమారు 8,000 అడుగుల ఎత్తులో ఉంది. అదే, సమయంలో రణబీర్ పూర్లో ప్రతిపాదిస్తున్న స్టేడియం సుమారు 11,800 అడుగుల ఎత్తులో ఉండనుంది. అంటే, చైల్ మైదానం కంటే దాదాపు 3,800 అడుగుల ఎత్తులో ఈ కొత్త మైదానం ఉండబోతోంది. దీంతో లడఖ్ స్టేడియం ప్రత్యేక ఆకర్షణగా మారే అవకాశం ఉంది.
ఈ స్టేడియం కేవలం క్రికెట్ మ్యాచ్ల కోసం మాత్రమే కాకుండా లడఖ్లో క్రీడా పర్యాటకాన్ని పెంచేందుకు కూడా ఉపయోగపడొచ్చని భావిస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి క్రికెటర్లు, జట్లు, అభిమానులు లేహ్కు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా, స్థానిక యువతకు క్రికెట్లో శిక్షణ పొందేందుకు మెరుగైన మైదానం, ప్రాక్టీస్ సౌకర్యాలు అందుబాటులోకి రావచ్చు. దీంతో లడఖ్ నుంచి ప్రతిభావంతులైన క్రికెటర్లు వెలుగులోకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది.
Read Also: సన్ రైజర్స్, గంభీర్ మధ్య భారీ డీలింగ్..ఇక 2027 ఐపీఎల్ మాములుగా ఉండదు!