BJP Mission: స్వేచ్చ బ్యూరో: దేశంలో 2029లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా నాలుగోసారి కేంద్రంలో అధికారాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కొత్త జట్టుకు దిశానిర్దేశం చేశారు. ఢిల్లీలో శనివారం ప్రారంభమైన కొత్త జాతీయ కార్యవర్గం తొలి సమావేశంలో సంస్థాగత బలోపేతం, క్షేత్రస్థాయిలో పార్టీ విస్తరణ, రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సమగ్ర వ్యూహంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. నబీన్ నేతృత్వంలో ఇటీవలే 65 మంది సభ్యులతో కొత్త జాతీయ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ జాతీయ కార్యవర్గంలో 51 మంది కొత్తవారే కావడం ఈ సమావేశానికి ప్రత్యేకతగా నిలిచింది. ఈ కీలక మీటింగ్ లో 2029 లోక్సభ ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీని ఎన్నికల మోడ్లోకి తీసుకెళ్లాలని నబీన్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
అయితే అంతకంటే ముందుగా 2027లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ వంటి 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలే పార్టీకి కీలక పరీక్షగా నితీన్ నబీన్ అభివర్ణించినట్లు సమాచారం. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, పంజాబ్ వంటి రాజకీయంగా కీలకమైన రాష్ట్రాల్లో సంస్థాగత బలం, కార్యకర్తల ఉత్సాహం, సామాజిక సమీకరణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. యూపీలో ఇప్పటికే దాదాపు 20 మంది పార్టీ ఎంపీలతో నబీన్ విడివిడిగా సమావేశమై క్షేత్రస్థాయి పరిస్థితులపై అభిప్రాయాలు సేకరించినట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో గెలుపునకు కేవలం అగ్రనేతల ప్రచారంపైనే ఆధారపడకుండా బూత్ స్థాయి నుంచి పార్టీ యంత్రాంగాన్ని పటిష్ఠం చేయాలని నబీన్ ఆదేశించినట్లు తెలుస్తోంది.
బూత్, శక్తికేంద్ర, మండల, జిల్లా స్థాయిల్లో నిరంతర సమీక్షలు నిర్వహిస్తూ ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలను పెంచుకోవాలని సూచించారు. యువతను, ముఖ్యంగా కొత్త తరం ఓటర్లను పార్టీతో అనుసంధానం చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. యువ ఓటర్లను చేరుకునేందుకు బీజేపీ ప్రత్యేక జెన్ జీ ఔట్రీచ్ కార్యక్రమాన్ని కూడా రూపొందించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రాల వారీగా ఎన్నికల వ్యూహాన్ని స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రూపొందించాలని నబీన్ స్పష్టం చేసినట్లు సమాచారం. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, గుజరాత్, మణిపూర్, హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొత్త జాతీయ కార్యవర్గంలో కీలక బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే యూపీ, పంజాబ్ తదితర రాష్ట్రాలకు కొత్త ఇన్చార్జీలను నియమించడం ద్వారా ఎన్నికల సన్నాహాలను వేగవంతం చేశారు.
Also Read: ఇండియాలో క్రిప్టో కరెన్సీ కొనొద్దు.. పెట్టుబడిదారులకు హెచ్చరిక
ఇదిలా ఉండగా.. బీజేపీ రాష్ట్రాల ఇన్ చార్జీలతోనూ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్రావుతో నబీన్ భేటీ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపైనా చర్చ జరిగినట్లు సమాచారం. తెలంగాణలో సంస్థాగత విస్తరణను మరింత వేగవంతం చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో పనిచేసే నాయకులు, కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాలని నబీన్ సూచించినట్లు తెలుస్తోంది.
నియోజకవర్గాల వారీగా పార్టీ బలాబలాలను సమీక్షిస్తూ స్థానిక సమస్యలపై నిరంతర పోరాటాలు నిర్వహించాలని, బూత్ స్థాయిలో పార్టీని పటిష్ఠం చేయడమే అధికారంలోకి రావడానికి కీలకమని ఆయన గతంలోనూ తెలంగాణ నాయకత్వానికి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలంటే నాయకులంతా సమన్వయంతో పనిచేయాలని, వ్యక్తిగత రాజకీయాల కంటే పార్టీ విస్తరణకు ప్రాధాన్యం ఇవ్వాలని నబీన్ సూచించినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రజా సమస్యలపై పోరాటాలను మరింత ఉధృతం చేయడంతో పాటు సంస్థాగత కార్యక్రమాలకు నాయకుల హాజరు, బాధ్యతల నిర్వహణను పర్యవేక్షించాలని దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.
మొత్తంగా.. 2027 అసెంబ్లీ ఎన్నికలను 2029 లోక్సభ సమరానికి సన్నాహకంగా భావిస్తున్న బీజేపీ, కొత్త జాతీయ కార్యవర్గం ద్వారా సంస్థాగత యంత్రాంగానికి కొత్త ఊపునివ్వాలని భావిస్తోంది. రాష్ట్రాల వారీగా ఎన్నికల బాధ్యతలు, క్షేత్రస్థాయి విస్తరణ, యువత-మహిళల భాగస్వామ్యం, బూత్ నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా మిషన్-2029కు ఇప్పటి నుంచే బలమైన పునాది వేయాలని నబీన్ తన తొలి సమావేశంలో స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Also Read: కాంగ్రెస్ పార్టీలోకి మాజీ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్.. జగన్కు సహాయం కోసమా?