UPSC Interviews: అఖిల భారత సర్వీసుల్లోని పలు ఉద్యోగాల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిర్వహించిన ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ (మెయిన్) పరీక్షా ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా ఆగస్టు 22 నుంచి 31 వరకు జరిగిన మెయిన్ పరీక్ష (UPSC CSE Main Exam)ల్లో మొత్తం 2,736 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూ లేదా పర్సనాలిటీ టెస్ట్ రౌండ్కు ఎంపికైనట్లు యూపీఎస్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు క్వాలిఫై అయిన విద్యార్థుల రోల్ నంబర్లు, పేర్లతో కూడిన వేర్వేరు జాబితాలను యూపీఎస్సీ తన అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది.
ఈ సివిల్స్ మెయిన్ ఫలితాల్లో తెలంగాణ అభ్యర్థులు సత్తా చాటారు. ముఖ్యంగా.. యువతకు సాధికారత కల్పించే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం’ పథకం (Rajiv Gandhi Civil Services Abhaya Hastham) కింద సహాయం పొందిన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ఇంటర్వ్యూలకు ఎంపిక కావడం విశేషం. ఈ ఇంటర్వ్యూలకు ఎంపికైన వారిలో ఏకంగా 43 మంది అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రం నుంచి ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇది సివిల్స్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించాలనే రాష్ట్ర ప్రభుత్వ కృషికి నిదర్శనంగా నిలుస్తోంది.
గత ఏడాది సివిల్స్ ప్రిలిమ్స్లో అర్హత సాధించిన 140 మంది అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందుకున్నారు. వారిలో 20 మంది మెయిన్ పరీక్షలో క్వాలిఫై అయ్యారు. ఇక ఈ ఏడాది, ప్రభుత్వం 202 మంది అభ్యర్థులకు ఆర్థిక సహాయం అందించగా.. వారిలో ఏకంగా 43 మంది ఇంటర్వ్యూ దశకు చేరుకున్నారు. ఈ సంఖ్య గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు కంటే ఎక్కువగా ఉండటం ప్రభుత్వ పథకం విజయాన్ని సూచిస్తోంది.
మెయిన్స్ పరీక్షలో క్వాలిఫై అయిన ఈ 43 మంది అభ్యర్థులకు త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మరో రూ.లక్ష చొప్పున ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందించనున్నారు. మొత్తం రూ.2 లక్షల ఆర్థిక సహాయం ద్వారా అభ్యర్థులు తమ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ను మరింత మెరుగుపరుచుకునేందుకు వీలు కలుగుతుంది. ఆర్థిక సాయంతో పాటు, ప్రభుత్వం ఇంటర్వ్యూ కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు కీలక మద్దతు అందిస్తోంది. సీనియర్ సివిల్ సర్వీసెస్ అధికారులతో మాక్ ఇంటర్వ్యూలు ఏర్పాటు చేయడంతో పాటు.. ఇంటర్వ్యూ సమయంలో ఢిల్లీలో ఉచిత వసతిని కూడా కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.
ALSO READ: Minister Sitakka: సమ్మక్క సారక్క పవర్ ఫుల్.. రాజకీయం చేస్తే.. ఇచ్చిపడేసిన మంత్రి సీతక్క..
తెలంగాణ యువత సివిల్స్ సర్వీసెస్లో ఉన్నత స్థానాలు సాధించాలనే ముఖ్యమంత్రి లక్ష్యానికి అనుగుణంగా ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం’ పథకం నిరంతరాయంగా అండగా నిలుస్తోంది. ఇంటర్వ్యూలకు ఎంపికైన ఈ 43 మంది అభ్యర్థులు తుది ఎంపికలో విజయం సాధించి.. రాష్ట్రానికి పేరు తేవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.