KTR: మాజీ మంత్రి కేటీఆర్ చెప్పిందే జరిగింది. తన నివాసంలో ఏసీబీ సోదాలు జరుగుతాయని, సోమవారం ఏసీబీ విచారణకు వచ్చిన సందర్భంగా కేటీఆర్ చెప్పారు. అదే రీతిలో గచ్చిబౌలి ఓరియన్ విల్లాస్ లో ఏసీబీ అధికారులు సోమవారం సాయంత్రం సోదాలు నిర్వహించడం విశేషం. అయితే ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తారని ముందే కేటీఆర్ కు సమాచారం ఎలా చేరిందన్నది తెలియాల్సి ఉంది.
ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే జనవరి ఆరవ తేదీన విచారణకు రావాలని కేటీఆర్ కు గతంలో ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. తనపై కేసు నమోదు కాగా హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ వేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును, ప్రస్తుతం రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఏసీబీ విచారణకు పూర్తిస్థాయిలో సహకరించాలని హైకోర్టు తెలిపింది.
ఈ మేరకు సోమవారం ఏసీబీ కార్యాలయం వద్దకు విచారణకు వచ్చిన కేటీఆర్, తనతోపాటు న్యాయవాదులను కూడా అనుమతించాలని ఏసీబీ అధికారులను కోరారు. న్యాయవాదులను అనుమతించకపోవడంతో కేటీఆర్ అక్కడి నుండి వెనుతిరిగి వెళ్లిపోయారు. అయితే ఏసీబీ కార్యాలయం వద్ద కారులో నుండే మీడియా ప్రతినిధులతో మాట్లాడిన కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు తన నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించేందుకు పక్కా ప్లాన్ తో అడుగులు వేస్తున్నట్లు తనకు తెలిసిందన్నారు. సోదాల పేరుతో తన ఇంటిలో పలు పత్రాలను ఉంచి తనను అరెస్టు చేసేందుకు ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తుందని కేటీఆర్ అన్నారు.
Also Read: Congress: కేటీఆర్.. మరీ అంత భయమా? కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మేల్యే సెటైర్లు
కేటీఆర్ చెప్పినట్లుగానే ఏసీబీ అధికారులు గచ్చిబౌలి ఓరియన్ విల్లాస్ లో సోమవారం సాయంత్రం సోదాలు ప్రారంభించారు. తమ విచారణలో భాగంగా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నప్పటికీ, రహస్యంగా ఉండాల్సిన సోదాల విషయం కేటీఆర్ కు ఎలా తెలిసిందన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మొత్తం మీద కేటీఆర్ నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున విల్లాస్ వద్దకు చేరుకున్నారు.