Adilabad Airport: ఉత్తర తెలంగాణ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం సాకారమయ్యే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఆదిలాబాద్ జిల్లాలో విమానాశ్రయం అభివృద్ధి కోసం 700 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ను వెంటనే భూసేకరణ ప్రక్రియను ప్రారంభించవలసిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) సమన్వయంతో ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును అమలు చేయనున్నారు.
ఆదిలాబాద్లో విమానాశ్రయం ఏర్పాటు సాధ్యమని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) సమర్పించిన సాంకేతిక-ఆర్థిక అధ్యయన నివేదిక (Techno-Economic Feasibility Report)లో నిర్ధారించిన నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. జాయింట్-యూజర్ ఎయిర్ఫీల్డ్ గా దీనిని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిర్ణయం ఉత్తర తెలంగాణ ప్రాంతానికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.
ఆదిలాబాద్ విమానాశ్రయం రూపుదిద్దుకుంటే.. ఇది ప్రాంతీయ కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తుంది. మహారాష్ట్ర సరిహద్దులకు దగ్గరగా ఉన్న ఈ జిల్లాలో ఎయిర్పోర్టు ఏర్పాటు వల్ల చుట్టుపక్కల ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయి. ముఖ్యంగా.. ఈ ప్రాజెక్టు ద్వారా ఆర్థికాభివృద్ధి, పర్యాటకం ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
ALSO READ: Dog Bite Victims: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక మలుపు.. బాధితుల జోక్యానికి గ్రీన్ సిగ్నల్!
విమానయాన సదుపాయం మెరుగుపడటం వలన ఈ ప్రాంతంలో వాణిజ్య కార్యకలాపాలు వృద్ధి చెందుతాయి. పర్యాటక రంగానికి కూడా కొత్త గుర్తింపు లభించే అవకాశం ఉంది. అత్యవసర వైద్య సేవలు, విపత్తు ప్రతిస్పందన వంటి అత్యవసర సేవల మౌలిక వసతులు సైతం బలోపేతం అవుతాయి. ఈ విమానాశ్రయం ద్వారా ఆదిలాబాద్ జిల్లాకు దేశీయ విమానయాన పటంలో కొత్త, బలమైన గుర్తింపు లభించనుంది.భూసేకరణ ప్రక్రియ వేగవంతం అయిన తర్వాత.. AAI తదుపరి నిర్మాణ పనులను ప్రారంభించడానికి సిద్ధమవుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఆదిలాబాద్ ప్రజల దశాబ్దాల కల త్వరలోనే నెరవేరే అవకాశం ఉంది.
ALSO READ: Jagityala News: రూ.50 లేక తల్లిని భుజాన మోసిన కుమారుడు.. కన్న ప్రేమకు నిలువెత్తు నిదర్శనం