Bhagirath Case: పోక్సో కేసులో నిందితునిగా ఉన్న బండి భగీరథ్ కు శుక్రవారం ఊరట దక్కలేదు. సుధీర్ఘ వాదనల అనంతరం తదుపరి విచారణలో మధ్యంతర బెయిల్ పిటిషన్ పై తుది ఉత్తర్వులు ఇస్తామని హైకోర్టు పేర్కొంది. అప్పటి వరకు పోలీసులు అరెస్ట్ చేయకుండా మధ్యంతర రక్షణ కల్పించాలంటూ బండి భగీరథ్ తరపు న్యాయవాది చేసిన అభ్యర్థనను కూడా తోసిపుచ్చింది. మైనర్ అయిన తన కూతురిని మాయ మాటలతో లొంగదీసుకుని బండి భగీరథ్ లైంగిక దాడులకు పాల్పడ్డాడంటూ ఓ మహిళ ఈనెల 8న పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు పోలీసులు బీఎన్ఎస్, పోక్సో యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశారు. కాగా, ఈ వ్యవహారంపై రాజకీయ దుమారం చెలరేగిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమగ్రమైన విచారణ జరిపించాలని డీజీపీకి ఆదేశాలు ఇచ్చారు. దాంతో కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక సిట్ ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కూకట్ పల్లి జోన్ డీసీపీ రితి రాజ్ కేసును విచారణ చేస్తున్నారు. రెండోసారి బాధితురాలి నుంచి వాంగ్మూలం సేకరించిన తరువాత పోక్సో యాక్ట్ లోని కఠినమైన సెక్షన్లను కేసులో చేర్చారు.
ఈ పరిణామాల మధ్యలోనే బండి భగీరథ్ తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాంతోపాటు ముందస్తు బెయిల్ కోసం కూడా పిటిషన్ వేశారు. బండి భగీరథ్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ పై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. ఆ సమయంలో బండి భగీరథ్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ పోలీసులు బాధితురాలి వయసు 15ఏళ్లుగా పేర్కొన్నారన్నారు. అయితే, జీహెచ్ఎంసీ జారీ చేసిన బర్త్ సర్టిఫికెట్ లో ఆమె పుట్టిన సంవత్సరం 2008గా ఉందని తెలిపారు. పాన్ కార్డులో 2010 అని ఉందని చెప్పారు. ఇక, 2021లో ర్యాష్ డ్రైవింగ్ కేసులో బాధితురాలు పట్టుబడినపుడు ఆమె వయసు 15ఏళ్లుగా ఉందని తెలిపారు. దీనిపై స్పందించిన హైకోర్టు బాధితురాలి బర్త్ సర్టిఫికెట్లను పరిశీలించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఇక, బండి భగీరథ్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ పై శుక్రవారం కూడా హైకోర్టులో సుధీర్ఘ విచారణ జరిగింది. ఈ సందర్భంగా బండి సంజయ్ పై కొన్ని సోషల్ ప్లాట్ ఫాంలలో దుష్ప్రచారం జరుగుతున్నట్టు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
ఆ సమయంలో జోక్యం చేసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టీ.మాధవీ దేవి తనపై కూడా ఇలాంటి ప్రచారం జరుగుతోందన్నారు. సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో మీలో ఎంతమంది ఉన్నారు? నాపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని గమనించారా? అని ప్రశ్నించారు. ఇది తనకు కూడా బాధను కలిగించిందన్నారు. పిటిషనర్ తరపున వాదనలు వినిపిస్తున్న నిరంజన్ రెడ్డి, బాధితురాలి తల్లి తరపు న్యాయవాది పప్పు నాగేశ్వరరావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావులను ఉద్దేశిస్తూ తాను కేసు విచారించటంపై ఏవైనా అభ్యంతరాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఏవైనా ఉంటే చెప్పండి నన్ను నేను రక్షించుకునేందుకు అవసరమైన నిర్ణయాలు తీసుకుంటానన్నారు. దీనిపై బాధితురాలి తల్లి తరపు న్యాయవాది స్పందిస్తూ తనకెలాంటి అభ్యంతరం లేదని చెప్పారు.
Also read: కేంద్ర మంత్రి బండి సంజయ్ తల్లికి గుండెపోటు.. ఐసీయూలో చికిత్స!
పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాట్లాడుతూ కరపత్రం లాంటి ఓ మెసేజ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోందన్నారు. దీనిపై ఇప్పటికే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను అప్రమత్తం చేసినట్టు చెప్పారు. దీనిపై అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్టు తెలిపారు. పిటిషనర్ తరపు న్యాయవాది మాట్లాడుతూ ఇలాంటివి గతంలో కూడా జరిగాయన్నారు. అనంతరం జడ్జి మాధవీ దేవి అయిదు నిమిషాల బ్రేక్ తీసుకున్నారు. అనంతరం తిరిగి విచారణను కొనసాగించారు. ఆ సమయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ బాధితురాలి పుట్టిన తేదీపై తనిఖీ చేశామని, ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు సరైనవే అని చెప్పారు. లైంగిక దాడి జరిగినపుడు బాధితురాలు మైనర్ అని చెబుతూ అప్పుడు ఆమె వయసు 17 సంవత్సరాల మూడు నెలలు అని తెలియచేశారు. ఇటువంటి పరిస్థితుల్లో నిందితుడు మధ్యంతర బెయిల్ పొందటానికి అర్హుడు కాదని పేర్కొంటూ పిటిషన్ ను కొట్టి వేయాలని అభ్యర్థించారు.
వాదనలు సీరియస్ గా నడుస్తున్న సమయంలో బాధితురాలి తరపు న్యాయవాది ప్రతీరోజు రాత్రి 8గంటలకు తాను నిద్రపోతానని చెప్పారు. తెల్లవారుఝాము 4.30గంటలకు మేల్కొని గోల్ఫ్ ఆడటానికి వెళ్లటం అలవాటన్నారు. దీనిపై స్పందించిన జడ్జి అంటే ప్రస్తుతం మీరు నిద్రపోతున్నారా? మేల్కొని ఉన్నారా? అని ప్రశ్నించటంతో కోర్టు హాల్లో నవ్వులు పూశాయి. ఆ తరువాత వాదనలు కొనసాగించిన బాధితురాలి తరపు న్యాయవాది నిందితునిపై గతంలో కూడా రెండు ఎఫ్ఐఆర్ లు నమోదై ఉన్నట్టు చెప్పారు. జోక్యం చేసుకున్న జడ్జి ఆ కేసులతో ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇంతకు ముందు నమోదైనవి కూడా ఇలాంటి కేసులేనా? అని ప్రశ్నించారు. అలా అయితే ఓకే అని వ్యాఖ్యానించారు.
ఇక, బండి భగీరథ్ తరపు న్యాయవాది మాట్లాడుతూ తన క్లయింట్ తండ్రి రాజకీయ నాయకుడని పేర్కొన్నారు. రాజకీయ ప్రత్యర్థులు ఆయనను దెబ్బ తీయటానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలోనే పదవిని అడ్డం పెట్టుకుని కేసుపై ప్రభావం చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారని తెలిపారు. విచారణకు సహకరించటానికి తన క్లయింట్ సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. తన క్లయింట్ ను పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు. ఆ సమయంలో జడ్జి స్పందిస్తూ బాధితురాలి వాంగ్మూలాన్ని క్షుణ్నంగా అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుత స్థితిలో మధ్యంతర బెయిల్ ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేనని పేర్కొన్నారు. తదుపరి విచారణలో తుది ఉత్తర్వులు జారీ చేస్తానని పేర్కొన్నారు.
Also read: ఐరోపా మాఫియాను గడగడలాడించిన దొంగ… నెట్ఫ్లిక్స్ను ఊపేస్తోన్న సిరీస్