Bhatti Vikramarka: కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను సామరస్యంగా పరిష్కరించడంతో పాటు తీసుకున్న నిర్ణయాలను వేగంగా అమలు చేయడమే సహకార సమాఖ్యవాద స్ఫూర్తి అని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. భిన్నమైన ప్రయోజనాలు ఎదురైనప్పుడు కూడా న్యాయబద్ధమైన పరిష్కారాన్ని కనుగొనగలగడమే సమాఖ్య వ్యవస్థకు అసలైన పరీక్ష అని ఆయన పేర్కొన్నారు.
మహాబలిపురంలో జరిగిన 31వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశంలో ఆయన తెలంగాణ వైఖరిని స్పష్టంగా వెల్లడించారు. కేంద్ర హోం శాఖ మంత్రి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మహాబలిపురంలోని చారిత్రక కట్టడాలను ప్రస్తావించారు. బలమైన నిర్మాణానికి ప్రతి భాగం ఒకేలా ఉండాల్సిన అవసరం లేదని, ప్రతి భాగం తన వంతు భారాన్ని మోయాల్సి ఉంటుందని అన్నారు. భారత సమాఖ్య వ్యవస్థ కూడా ఇదే స్ఫూర్తితో పనిచేయాలని పేర్కొన్నారు.
భిన్నమైన ప్రయోజనాలను న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, సమర్థవంతంగా సమన్వయం చేయగల సంస్థలు ఉండటమే నిజమైన సమాఖ్యవాదమని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలు, ప్రతిభ కోసం రాష్ట్రాల మధ్య పోటీ సహజమేనని ఆయన చెప్పుకొచ్చారు. నదులు, విద్యుత్ గ్రిడ్లు, కార్మికులు, వ్యాపారాలకు రాష్ట్ర సరిహద్దులు అడ్డంకులు కావని డిప్యూటీ సీఎం చెప్పారు. సమస్యలు.. రాష్ట్ర సరిహద్దులను ప్రభుత్వ ఫైళ్ల కంటే వేగంగా దాటుతాయి భట్టి చమత్కరించారు.
Also Read: కాంగ్రెస్ను కనుమరుగు చేయడానికి రేవంత్ కుట్ర.. జీవన్ రెడ్డి సంచలనం
పరస్పర ఆధారిత పరిస్థితుల నేపథ్యంలో దక్షిణ ప్రాంతీయ మండలి వంటి సంస్థల ప్రాధాన్యత మరింత పెరుగుతోందన్నారు. అన్ని రాష్ట్రాలకు ఒకే నిబంధనలు వర్తించాలని తెలంగాణ కోరుకుంటోందని తెలిపారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ చాలా స్పష్టంగా ఉందని చెప్పారు. ఇప్పటికే ఏర్పాటైన చట్టపరమైన వ్యవస్థల ప్రకారం రాష్ట్రానికి దక్కాల్సిన న్యాయమైన వాటాను తెలంగాణ కచ్చితంగా కోరుకుంటోందని చెప్పారు. దిగువ రాష్ట్రాల హక్కులకు భంగం కలిగించే ఏకపక్ష చర్యలను అడ్డుకోవాలని, కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోని అన్ని రాష్ట్రాలకు ఒకే సూత్రాలను వర్తింపజేయాలని ఆయన చెప్పారు.
Also Read: పుస్తకంలో రాసిన పాత్రలు నిజంగా బయటకొస్తే ? తర్వాత జరిగింది చూస్తే నవ్వాపుకోలేరు