Telangana Rtc: మహాలక్ష్మి పథకం అమలులోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య అమాంతంగా పెరిగింది. ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో మహిళలు ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. అయితే నిత్యం రాకపోకలు సాగించే పురుషులు సాధారణ ప్రయాణికులకు బస్సుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు మొదలయ్యాయి. పరిస్థితి గమనించిన తెలంగాణ ఆర్టీసీ, పురుషుల ఇబ్బందిని నివారించడానికి ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపింది.
కొత్తగా 75 మెట్రో డీలక్స్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని డిసైడ్ అయ్యింది. ఈ నిర్ణయం వల్ల రద్దీ వేళల్లో ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ సౌకర్యాన్ని అందించడానికి ఉపయోగపడుతోంది. అందరికీ సీట్లు లభించనున్నాయి. కొత్తగా ప్రవేశపెట్టనున్న మెట్రో డీలక్స్ బస్సుల విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది ఆర్టీసీ.
ఈ బస్సుల్లో మహాలక్ష్మి ఉచిత ప్రయాణ పథకం వర్తించదని క్లారిటీ ఇచ్చింది. ఒకవేళ మహిళలు ఈ బస్సులు ఎక్కితే మిగతా ప్రయాణికుల మాదిరిగా టికెట్ కొనుగోలు చేయాలి. ఇప్పటికే చెల్లుబాటులోవున్న ప్రత్యేక బస్ పాస్లు కలిగినవారు ఈ బస్సుల్లో ప్రయాణించేందుకు అర్హులు. ప్రయాణికుల రద్దీని బట్టి కొత్త బస్సులను 45 లాంగ్ రూట్లలో నడపాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.
ప్రస్తుతం గ్రేటర్లో 3,200 సిటీ బస్సులు నడుస్తున్నాయి. అందులో మెట్రో డీలక్స్ బస్సులు 275 మాత్రమే ఉన్నాయి. మెట్రో ఎక్స్ప్రెస్, ఆర్డినరీ బస్సులు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఆయా కేటగిరీ బస్సులను మహిళలు ఉక్కువగా ఉపయోగించుకుంటున్నారు. ఈ క్రమంలో పురుషులు.. మెట్రోరైల్, ఎంఎంటీఎస్, క్యాబ్, ఆటోల వైపు మొగ్గు చూపుతున్న సందర్భాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ విధంగా ఆర్టీసీకి రావాల్సిన ఆదాయం తగ్గిపోతోంది. సిటీలో తిరుగుతున్న మెట్రో డీలక్స్ బస్సులు కిక్కిరిసిపోతుండడంతో మరో 75 మెట్రో డీలక్స్ బస్సులను ప్రవేశ పెట్టబోతోంది. ఉన్న బస్సులకు అదనంగా 75 బస్సులను ప్రవేశ పెట్టడం వల్ల ట్రిప్పుల సంఖ్య పెరుగుతుందన్నది అధికారుల ఆలోచన. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు అందుబాటులో ఉంటాయని చెబుతున్నారు.