YS Jagan: రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువత, వైఎస్సార్సీపీ శ్రేణులు చేపట్టిన శాంతియుత దీక్షా శిబిరాలపై దాడులు జరగడం పట్ల పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. నిరుద్యోగుల సమస్యలపై ప్రశ్నిస్తే హింసతో సమాధానం చెబుతారా అని నిలదీశారు.
శాంతియుత దీక్షలపై దాడులు..
డీఎస్సీ-2025 ప్రశ్నపత్రం లీకేజీ, నియామకాల్లో జరిగిన తీవ్రమైన అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నేతృత్వంలో విజయవాడలో చేపట్టిన రిలే నిరాహార దీక్షపై టీడీపీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడులకు తెగబడ్డారని జగన్ ఆరోపించారు. పోలీసుల సమక్షంలోనే టెంట్లు లాగిపడేసి, మహిళలు, నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకుని రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలతో దాడులు చేశారని మండిపడ్డారు.
విజయవాడతో పాటు చిలకలూరిపేట, కనిగిరి, యాడికి, తాడిపత్రి, పలమనేరు, రేపల్లె, గుంటూరు, పొన్నూరు, వేమూరు, మాచర్ల, గురజాల, కందుకూరు, బాపట్ల వరకు అన్ని నిరసన శిబిరాలపై నిర్బంధకాండ కొనసాగించారని ధ్వజమెత్తారు.
వైఎస్ జగన్ ప్రధాన డిమాండ్లు..
తన కుమారుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను బాధ్యత నుంచి తప్పించడానికే ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని, పార్టీ శ్రేణులను ఉపయోగిస్తోందని జగన్ విమర్శించారు. డీఎస్సీ ప్రక్రియ పారదర్శకంగా జరిగితే సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.
Also Read: కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలి- మంత్రి అడ్లూరి లక్ష్మణ్
ప్రభుత్వం ముందు పలు డిమాండ్లు..
నియామకాల్లో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రూ.9,000 కోట్లకు చేరిన విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. సూపర్ సిక్స్ హామీ ప్రకారం నిరుద్యోగులకు నెలకు రూ.3,000 చొప్పున గత రెండేళ్ల బకాయిలతో కలిపి తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Also Read: గాంధీ, నెహ్రూల నాటి రోజులు పోయాయి!.. ఉచిత పథకాలపై హైకోర్టు వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ Gen Z గొంతును మూయలేరు..
దీక్షా శిబిరాలను ధ్వంసం చేసి, అరెస్టులు చేసినంత మాత్రాన డీఎస్సీ లీకేజీ ఆధారాలను చెరిపేయలేరని జగన్ తేల్చిచెప్పారు. నిరుద్యోగ యువతలో రగులుతున్న ఆగ్రహాన్ని అణచివేయడం ఎవరి వల్లా కాదన్నారు. ‘ఆంధ్రప్రదేశ్ Gen Z గొంతును మూయలేరు.. న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదు’ అని స్పష్టం చేశారు.
@ncbn గారూ, మీ కుమారుడిని కాపాడుకోవడానికి మీ ప్రభుత్వం ఇంకా ఎంత దిగజారుతుంది? నిరుద్యోగ యువతకు, వారికి మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగితే… దానికి మీరు హింసతో సమాధానం చెప్పాలనుకుంటున్నారా?#DSC2025 ప్రశ్నాపత్రం లీక్, నియామకాల్లో జరిగిన తీవ్రమైన అక్రమాలపై సీబీఐతో విచారణ… pic.twitter.com/SbndqNaPsD
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 7, 2026