Chicken Waste: స్వేచ్ఛ బ్యూరో: మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చికెన్ వ్యర్థాల సేకరణ టెండర్ ప్రక్రియలో భారీ ఎత్తున అవకతవకలు చోటు చేసుకున్నాయని భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు తీవ్ర ఆరోపణలు చేశారు. బుధవారం జిల్లా భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్పొరేటర్ గుండా సంతోష్ మాట్లాడుతూ.. టెండర్ ప్రక్రియ మొత్తం అనుమానాస్పదంగా సాగిందన్నారు. మహబూబ్నగర్ కంటే చిన్న పట్టణమైన జడ్చర్లలో చికెన్ వ్యర్థాల టెండర్ రూ.35 లక్షలకు దక్కగా, పెద్ద నగరమైన మహబూబ్నగర్లో మాత్రం కేవలం రూ.25 లక్షలకు టెండర్ ఖరారవడం వెనుక పెద్ద మర్మం ఉందన్నారు. దీనిపై ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, అధికార పార్టీ నేతల ప్రమేయం లేకుండా ఇలాంటి వ్యవహారం జరగదని ఆరోపించారు.
టెండర్ ప్రకటనను కూడా చాలా చిన్న పరిమాణంలో విడుదల చేసి, సాధారణ ప్రజలు లేదా ఇతర ఆసక్తిగల వ్యక్తుల దృష్టికి రాకుండా జాగ్రత్త పడ్డారని విమర్శించారు. ముందుగానే ప్రణాళిక ప్రకారం టెండర్ ప్రక్రియను పూర్తి చేసినట్లు కనిపిస్తోందన్నారు. టెండర్ అధికారికంగా మరో వ్యక్తికి దక్కినా, ప్రస్తుతం కూడా గతంలో చికెన్ వ్యర్థాలు సేకరించిన వారికే చికెన్ షాపుల యజమానులు వ్యర్థాలను అప్పగిస్తున్నారని పేర్కొన్నారు. ఈ అంశాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చికెన్ వ్యర్థాల నిర్వహణలో నిర్లక్ష్యం ప్రజారోగ్యానికి తీవ్రమైన ముప్పుగా మారే అవకాశముందని భాజపా నేతలు హెచ్చరించారు. గతంలో జడ్చర్ల, మహబూబ్నగర్ ప్రాంతాల్లోని చికెన్ వ్యర్థాలను ఓ ప్రైవేట్ కంపెనీ కొనుగోలు చేసేదని, ప్రస్తుతం గద్వాల మరియు పరిసర ప్రాంతాల చేపల చెరువుల యజమానులు వాటిని కొనుగోలు చేసి చేపలకు ఆహారంగా వినియోగిస్తున్నారని తెలిపారు.
Also read: మేడ్చల్ సర్కార్ దవాఖానలో దారుణం.. సమయానికి రాని డాక్టర్లు.. రోడ్డుపైనే రోగులు!
చికెన్ వ్యర్థాలను తిన్న చేపలను ప్రజలు ఆహారంగా తీసుకుంటే క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ముప్పు పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చేపల చెరువులపై ప్రత్యేక దృష్టి సారించి సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లే అంశాలపై భాజపా ఎట్టి పరిస్థితుల్లోనూ మౌనంగా ఉండబోదని, అవసరమైతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు యాదయ్య ముదిరాజ్, భాజపా నాయకులు రాజేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Also read: ముల్కలపల్లిలో జోరుగా మట్టి మాఫియా దందా..!