Uttam Kumar Reddy: తెలంగాణ శాసనసభలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కృష్ణా నదీ జలాల పంపకాల్లో తెలంగాణకు తీరని అన్యాయం చేశారని, ఆంధ్రాకు 66 శాతం (512 టీఎంసీలు) నీటిని, తెలంగాణకు కేవలం 34 శాతం (299 టీఎంసీలు) నీటిని అంగీకరిస్తూ లిఖితపూర్వకంగా రాసిచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని మండిపడ్డారు. 2015 నుంచి 2020 వరకు ఏటా ఇదే విధానాన్ని కొనసాగిస్తూ తెలంగాణ రైతాంగం ప్రయోజనాలను దెబ్బతీశారని విమర్శించారు. సభలో ప్రత్యేక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (PPT) ద్వారా గత పదేళ్లలో సాగునీటి రంగంలో జరిగిన విధ్వంసాన్ని ఆయన వివరించారు.
పదేళ్ల కాలంలో బడ్జెట్ అంచనాలు సుమారు రూ. 17 లక్షల కోట్లు చూపించినా, క్షేత్రస్థాయిలో ఫలితాలు శూన్యమని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కోసం రూ. 23,000 కోట్లు, సీతారామ ప్రాజెక్టు కోసం రూ. 8,500 కోట్లు ఖర్చు చేసినప్పటికీ, ఒక్క ఎకరాకు కూడా నీరందించలేకపోయారని ఎద్దేవా చేశారు. మూడు బ్యారేజీలు కూలిపోయినా, ప్రాజెక్టుల నిర్వహణను గాలికి వదిలేశారని ఆరోపించారు. గత ప్రభుత్వం 90 శాతం పనులు పూర్తయ్యాయని గొప్పలు చెప్పుకుందని, కానీ వాస్తవ పరిస్థితిని ప్రజలకు వివరించేందుకే తాను ఈ ప్రజెంటేషన్ ఇస్తున్నానని మంత్రి స్పష్టం చేశారు.
శ్రీశైలం నుంచి ఏపీ ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలిస్తుంటే గత బీఆర్ఎస్ సర్కారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందని విమర్శించారు మంత్రి. ఏపీ రోజుకు 13 టీఎంసీలు తరలించేలా ప్రాజెక్టులు విస్తరించినా, రాయలసీమ ఎత్తిపోతల చేపట్టినా కేసీఆర్ అడ్డుకోలేదని, తాము అధికారంలోకి వచ్చాక కేంద్రానికి ఫిర్యాదు చేసి ఆ పనులను ఆపించామని మంత్రి తెలిపారు. కృష్ణా జలాల్లో కేవలం 299 టీఎంసీలకే అంగీకరించి కేసీఆర్ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని, తాము ఇప్పుడు 550 టీఎంసీల కోసం డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. పాలమూరు ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా 39 వేల ఎకరాల భూసేకరణ పెండింగ్లో ఉందని మంత్రి ఉత్తమ్ వివరించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఏకంగా రూ. 90 వేల కోట్లు ఖర్చు చేసిన గత పాలకులు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు మాత్రం కేవలం రూ. 27 వేల కోట్లు మాత్రమే వెచ్చించి తీవ్ర వివక్ష చూపారని ఉత్తమ్ కుమార్ రెడ్డి గత బీఆర్ఎస్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పాలమూరులో కేవలం ఒక మోటార్ ను ఆన్ చేసి జాతికి అంకితం చేశారని, ఆ మరుసటి రోజే దాన్ని మళ్లీ ఆఫ్ చేశారని ఎద్దేవా చేశారు. కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడమే కాకుండా, రూ. 40 వేల కోట్ల బిల్లులను పెండింగ్ లో పెట్టి తమ ప్రభుత్వంపై భారం మోపారని మంత్రి మండిపడ్డారు.
కాళేశ్వరంపై ఉన్న మోజుతో పాలమూరును గాలికొదిలేశారని, అక్కడ సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోయి.. ఇక్కడ మాత్రం 1.5 టీఎంసీల నుంచి 1 టీఎంసీకి తగ్గించారని ఉత్తమ్ విమర్శించారు. వాస్తవానికి జూరాల నుంచి నీటిని తీసుకుంటే 60 రోజుల్లో 121 టీఎంసీలు వచ్చేవని, కానీ శ్రీశైలానికి మార్చడం వల్ల అది 68 టీఎంసీలకు పడిపోయిందని సభకు వివరించారు. ఆయకట్టు, భూసేకరణ లేకుండానే డీపీఆర్ రూపొందించారని తప్పుబట్టారు. జూరాల వద్ద అయితే 22 పంపులతో 414 మీటర్ల లిఫ్ట్ సరిపోయేదని, కానీ శ్రీశైలానికి మార్చడం వల్లే పంపుల సంఖ్య 37కి పెరిగి, 560 మీటర్ల లోతు నుంచి నీటిని ఎత్తిపోయాల్సి వస్తోందని మంత్రి గణాంకాలతో సహా వివరించారు.
Read Also: Man Climbs Gopuram: తిరుపతిలో గోవిందరాస్వామి ఆలయం పైకెక్కిన మందుబాబు.. టీటీడీ ఏం చెప్పిందంటే?