Ramchander Rao: ప్రభుత్వం అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. బషీర్ బాగ్ లో నిర్వహించిన నమో జన్ జీ కాంక్లేవ్ కు హాజరై ఆయన మాట్లాడారు. విద్యార్థులు కేవలం ఇంజినీరింగ్ మాత్రమే చేయకుండా బీఏ, బీఎస్సీ కూడా చదవాలని సూచించారు. ఉద్యోగాలు కల్పించే దిశగా యువత ఎదిగేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారన్నారు. మరోవైపు దేశాన్ని ముక్కలు చేసేందుకు కొంతమంది తయారవుతున్నారని విమర్శించారు. విద్యార్థులకు కావాల్సింది దేశ భక్తి అని, దేశభక్తితోనే దేశం అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు.
నేపాల్ తరహాలో జెన్ జీ బయటకు వచ్చి భారత్ లో కూడా ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఓ నేత మాట్లాడుతున్నారని రాంచందర్ రావు చురకలంటించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇస్తానన్న జాబ్ క్యాలెండర్ ఎక్కడికి పోయిందని ఆయన ప్రశ్నించారు. ఉస్మానియా యూనివర్సిటీకి ఇస్తామన్న రూ.వెయ్యి కోట్లు నేటికీ ఇవ్వలేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించుతామని, అందుకు యువత అంతా ముందుకు రావాలని కోరారు. రాష్ట్రంలో ఒక ఉద్యమాన్ని నిర్మించబోతున్నామని అందుకు యువత తరలిరావాలని రాంచందర్ రావు పిలుపునిచ్చారు.
విద్యార్థులకు చదువుతో పాటు రాజకీయ చైతన్యం ఉండాలని రాంచందర్ రావు అభిప్రాయపడ్డారు. రాబోయే ఎన్నికల్లో యువత, మహిళలకు పెద్ద ఎత్తున అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించింది కాంగ్రెస్ పార్టీయేనని మండిపడ్డారు. రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదని రాంచందర్ రావు ధ్వజమెత్తారు.
అంతకుముందు నాంపల్లి బీజేపీ ఆఫీసులో.. జనసంఘ్ స్థాపకుడు డా. శ్యామ ప్రసాద్ ముఖరీ వర్థంతి సందర్భంగా రాంచందర్ రావు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశం కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు శ్యామప్రసాద్ అని కొనియాడారు. దేశంలో పశ్చిమ బెంగాల్ అంతర్భాగంగా ఉందంటే దానికి శ్యామప్రసాద్ ముఖర్జీ పోషించిన దృఢమైన, చారిత్రాత్మక పాత్రే కారణమని తెలిపారు. రాజీ ధోరణిని అంగీకరించలేక శ్యామాప్రసాద్ ముఖర్జీ.. నెహ్రూ క్యాబినెట్ నుంచి రాజీనామా చేశారని గుర్తుచేశారు.
Also Read: భోగాపురం విమానశ్రయం.. ఇది చాలా కాస్ట్లీ గురూ.. ప్రయాణికులకు చుక్కలే!
మరోవైపు నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పలువురు ప్రముఖులు, మహిళా నేతలు.. రాంచందర్ రావు సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారందరికీ ఆయన కండువా కప్పి ఘనంగా స్వాగతించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను, కార్పొరేటర్లను భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో బీజేపీ మేయర్ పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో యాక్టివ్గా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.
Also Read: BSNL ఆల్ రౌండర్ ప్లాన్.. ఇదొక్కటి చాలు మామ.. 70 రోజులు తిరుగుండదు!