SADAREM Certificate: స్వేచ్చ బ్యూరో: దివ్యాంగుల కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారిలో కొందరి సదరం సర్టిఫికెట్లపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శారీరక వైకల్యం లేని వారు నకిలీ లేదా నిబంధనలకు విరుద్ధంగా పొందిన సదరం సర్టిఫికెట్ల ఆధారంగా ఉద్యోగాలు పొందారా? అనే కోణంలో రాష్ట్రవ్యాప్తంగా విచారణ కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై BIG TV, స్వేచ్ఛ ఎక్స్క్లూజివ్ ఇన్వెస్టిగేషన్లో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.
2024లో దివ్యాంగుల కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారిలో సదరం సర్టిఫికెట్లపై అనుమానాలు ఉన్న 89 మంది ఉద్యోగుల జాబితా తమ వద్ద ఉన్నట్లు BIG TV, స్వేచ్ఛ తెలిపాయి. వీరిలో పలువురి వైకల్య శాతం, సర్టిఫికెట్ జారీ విధానం, ఉద్యోగ నియామక సమయంలో సమర్పించిన మెడికల్ ఫిట్నెస్ వివరాలపై పరిశీలన జరుగుతున్నట్లు సమాచారం.
కామారెడ్డి జిల్లాకు సంబంధించి 18 మంది సదరం సర్టిఫికెట్లపై మెడికల్ బోర్డు అనుమానాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. మెడికల్ బోర్డు నివేదిక నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశాలతో DRDO ఆధ్వర్యంలో తదుపరి విచారణ కొనసాగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియలో భాగంగా నిర్వహించిన మెడికల్ ఫిట్నెస్ పరీక్షల సమయంలో కొందరి సదరం ధ్రువపత్రాలపై అనుమానాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దివ్యాంగుల కోటాలో ఉద్యోగాలు పొందిన కొందరికి వాస్తవంగా పేర్కొన్న స్థాయిలో శారీరక వైకల్యం ఉందా? సదరం సర్టిఫికెట్లు నిబంధనలకు అనుగుణంగానే జారీ అయ్యాయా? అనే అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
Also Read: నామినేటెడ్ పదవుల తుది జాబితా సిద్ధం.. సీఎం వద్దకు చేరిన సీక్రెట్ ఇంటెలిజెన్స్ రిపోర్టు!
విచారణలో సదరం సర్టిఫికెట్లు నిబంధనలకు విరుద్ధంగా జారీ అయినట్లు నిర్ధారణ అయితే వాటి రద్దుకు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అదే సర్టిఫికెట్ల ఆధారంగా ఉద్యోగాలు పొందినట్లు తేలితే ఉద్యోగాలపై చర్యలు, ఇప్పటివరకు పొందిన జీతాలు, ప్రభుత్వ ప్రయోజనాల రికవరీ వంటి అంశాలపైనా నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
కామారెడ్డి జిల్లాకు సంబంధించిన మెడికల్ బోర్డు నివేదికలు ఇతర జిల్లాల అధికారులకు కూడా చేరినట్లు సమాచారం. దీంతో రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగుల కోటాలో ఉద్యోగాలు పొందిన మరికొందరి సర్టిఫికెట్లపైనా పరిశీలన జరిగే అవకాశం ఉంది. విచారణ పూర్తయితే మరిన్ని పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశముందని తెలుస్తోంది.
విచారణ అధికారి DRDO దామోదర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ వ్యవహారంపై విచారణ గోప్యంగా కొనసాగుతోందని, అందువల్ల పూర్తి నివేదిక సిద్ధం కావడానికి కొంత సమయం పడుతుందని తెలిపారు. చట్టాల్లో ఉన్న లొసుగులను ఉపయోగించుకునే అవకాశం ఉన్నందున ప్రతి అంశాన్ని లోతుగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అక్రమాలు నిర్ధారణ అయితే బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసే దిశగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
దివ్యాంగుల కోసం ఉద్దేశించిన రిజర్వేషన్ను అక్రమంగా ఉపయోగించుకున్నట్లు ఆరోపణలు నిజమైతే అది అర్హులైన దివ్యాంగ అభ్యర్థుల హక్కులను హరించినట్టే. సదరం సర్టిఫికెట్ల జారీ నుంచి ఉద్యోగ నియామకం వరకు ఎక్కడ లోపం జరిగింది? ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది? మధ్యవర్తులు లేదా రాజకీయ అండదండలు ఉన్నాయా? అనే అంశాలపైనా సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది. దివ్యాంగుల కోటాలో ఉద్యోగాల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారుతున్న వేళ 89 మంది అనుమానాస్పద ఉద్యోగులపై జరుగుతున్న విచారణలో అసలు నిజాలు ఏమిటన్నది అధికారిక నివేదిక వెలువడిన తర్వాతే స్పష్టమవుతుంది.
Also Read: డీ లిమిటేషన్ బిల్లుపై కేంద్రానికి అకాలీదళ్ పార్టీ బిగ్ షాక్..!