Political Combination: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని అన్నాచెళ్లెల్ల అనుబంధం మార్చేయబోతున్నది. ఉద్యమాల పురిటిగడ్డ ఖమ్మం వెలుగుమట్ల వేదికగా పురుడుపోసుకున్న ఈ అన్నాచెళ్లెల్ల అనుబంధం రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త విన్నింగ్ కాంబినేషన్ గా అవతరించబోతోందనే ప్రచారం జరుగుతుంది. గతంలో టీడీపీ, ప్రస్తుత కాంగ్రెస్లో అన్నాచెళ్లెల్ల కాంబినేషన్ గా ఉన్న రేవంత్ రెడ్డి, సీతక్క ఒకే మాటతో ముందుకు సాగారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయకాంబినేషన్ చాటారు. అదే స్థాయిలో కల్వకుంట్ల కవిత, విశారదన్ మహరాజ్ల అన్నాచెళ్లెల్ల కాంబినేషన్ విజయం కోసం పావులు కదుపుతున్నారు. రాబోయే కాలంలో ఏ ఎన్నికలు వచ్చినా సత్తాచాటాలని భావిస్తున్నట్లు సమాచారం.
టీడీపీ పార్టీలో రేవంత్ రెడ్డి, సీతక్క పనిచేశారు. అప్పటి నుంచి అక్కా తమ్ముడి బంధం మొదలైంది. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాసమస్యలపై గళమెత్తారు. నిత్యం ప్రజల మధ్య ఉండేలా ప్రణాళికలతో ముందుకు సాగారు. రెడ్డి సామాజికవర్గానికి చెందిన రేవంత్ రెడ్డి, ఆదివాసీల్లోని కోయ కులానికి చెందిన సీతక్క తమ్ముడు అక్క కాంబినేషన్ తెలంగాణలోని అన్నివర్గాల ప్రజల మన్ననలు సొంతం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కడానికి ఇదే అన్నాచెళ్లెల్ల కాంబినేషన్ కీలకంగా దోహద పడిందని పార్టీ వర్గాలే అభిప్రాయపడుతున్నాయి. 2023లో రెండువర్గాల ప్రజలు కాంగ్రెస్ కు బాసటగా నిలవడానికి వీరి సామాజిక వర్గాలు సైతం కలిసి వచ్చాయనే ప్రచారం జరుగుతుంది.
అదే కాంబినేషన్ కోసం కవిత ప్రయత్నాలు మొదలు పెట్టింది. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలిగా రెండు దశాబ్దాలకు పైగా ప్రజల మధ్యనే ఉన్న కల్వకుంట్ల కవిత కొన్ని రోజుల్లోనే సొంత రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాకుడు విశారదన్ మహరాజ్ పాదయాత్ర సహా అనేక ఉద్యమాలతో ఇప్పటికే పలుమార్లు తెలంగాణను చుట్టేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కడంతో పాటు అన్ని రంగాల్లో ప్రాధాన్యత కోసం కవిత యునైటెడ్ ఫూలే ఫ్రంట్ (యూపీఎఫ్) ఏర్పాటు చేశారు. తెలంగాణలోని అన్ని బీసీ కులాల ప్రతినిధులతో కలిసి విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం అనేక ఉద్యమాలు, రైల్ రోకో సహా అనేక ప్రజా ఉద్యమాలు చేపట్టారు.
Also Read: Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో.. ప్రభుత్వం చర్చించే అతి కీలకమైన అంశాలివే..?
సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజలకు సైతం అన్నిరంగాల్లో ప్రాధాన్యత దక్కాలని ఉద్యమిస్తోన్న కవిత, ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు విశారదన్ తో కలిసి రాజకీయ శక్తుల పునరేకీకరణ కోసం అడుగులు వేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలతో కొత్త సోషల్ ఇంజనీరింగ్ కు కవిత ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కొన్ని నెలల క్రితమే సొంత కుటుంబానికి చెందిన రాజకీయ పార్టీ బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు కవిత గురయ్యారు. కుటుంబ పార్టీ బహిష్కరించినా ప్రజల కోసం నిత్యం వారి సమస్యల పరిష్కారమే ఏజెండాగా వారి మధ్యనే ఉంటున్నారు. కవిత ప్రకటించబోయే పార్టీతో రాజకీయంగా ముందుకు వెళ్లేందుకు విశారదన్ ముందుకు వచ్చారు.
యూపీఎఫ్ ఏర్పాటుతో బీసీలకు అతి దగ్గరగా పని చేస్తున్న కవిత సొంత సంస్థ జాగృతిలో బీసీ నాయకత్వానికి పెద్దపీట వేస్తున్నారు. కమిటీల్లో ప్రాధాన్యత ఇస్తున్నారు. జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఒక బంజారా నాయకుడిని నియమించి తెలంగాణ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఉద్యమనాయకుడు విశారదన్ మహరాజ్ తో కలిసి ఖమ్మం వెలుగుమట్ల బాధితుల కోసం నిరవధిక నిరాహార దీక్ష చేపట్టి.. బాధితుల ఇండ్లు కూల్చేసిన చోటనే పట్టాలు ఇప్పించారు. ఇదే అన్నాచెళ్లెల్ల విన్నింగ్ ఫార్ములా అని రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తం అవుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు ఇతర వర్గాల్లోని పేదలతో కలిసి కొత్త పొలిటిక్స్ తెరదీయబోతున్నారు. వెలమ కులానికి చెందిన కవిత, ఎస్సీ(మాదిగ) సామాజికవర్గానికి చెందిన విశారదన్ మహరాజ్ ల అన్నాచెళ్లెల్ల బంధం తెలంగాణ కొత్త సోషల్ ఇంజనీరింగ్ కు రంగం సిద్ధం చేస్తున్నది. అనేక ప్రజా ఉద్యమాలకు వేదికయిన తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వీరిద్దరి అన్నాచెళ్లెల్ల బంధం విన్నింగ్ కాంబినేషన్ గా అవతరించబోతోందనే ప్రచారం జరుగుతుంది. అయితే ఏమేరకు సక్సెస్ అవుతారు అనేది వారు చేపట్టే కార్యక్రమాలతో పాటు కాలమే నిర్ణయించాల్సి ఉంది.
Also Read: Hyderabad News: హైదరాబాద్లో దారుణం..అర్ధ రాత్రి కానిస్టేబుల్ని కత్తులతో పొడిచి చంపిన దుండగులు