Telangana Assembly: స్వేచ్ఛ బ్యూరో: భాగ్యనగరం నడిబొడ్డున ఉన్న మూసీ నది మురికి కూపంగా ఎలా మారింది? గత ప్రభుత్వాలు మౌనంగా ఎందుకు ఉన్నాయి? పదేళ్లలో ఎలాంటి విధ్వంసం జరిగింది? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుంది? మూసీ ప్రక్షాళనకు ప్రతిపక్షాలు ఎందుకు అడ్డుకుంటున్నాయి? అనే కీలక అంశాలపై అసెంబ్లీలో చర్చ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ బడ్జెట్ సెషన్స్ లోనే డిస్కషన్ చేయాలని భావిస్తున్నది. అసెంబ్లీ సభా వేదికగానే చర్చ పెట్టి ప్రజల్లోకి ఓ పాజిటివ్ సంకేతాన్ని పంపాలని ప్లానింగ్ జరుగుతుంది. ఇదే అంశంపై ఇప్పటికే సీఎం సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలూ ఇచ్చారు. ముఖ్యమంత్రి, మున్సిపల్ మంత్రి హోదాలో అసెంబ్లీలో చర్చకు తీసుకురానున్నారు. నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం వద్ద ఉన్న మాస్టర్ ప్లాన్ను కూడా సీఎం అసెంబ్లీలో వివరించాలని భావిస్తున్నారు. ఈ అసెంబ్లీ వేదికగానే పబ్లిక్కు ఓ మెస్సేజ్ పంపి, తద్వారా మూసీ ప్రక్షాళనను వీలైనంత వేగంగా మొదలు పెట్టాలని ప్రభుత్వం సిద్ధమైంది. మరోవైపు ప్రతిపక్షాలకు కౌంటర్లు ఇచ్చేందుకూ కొందరు ఎమ్మెల్యేలతో ఓ టీమ్ను కూడా తయారు చేయనున్నారు. అధికారులు ఆయా ఎమ్మెల్యేలకు మూసీ ప్రక్షాళన, గత పదేళ్ల ఆక్రమణలపై బ్రిఫింగ్ ఇవ్వనున్నారు. తద్వారా ప్రతిపక్షాలకు స్పష్టంగా కౌంటర్లు ఇవ్వొచ్చనే అభిప్రాయం ప్రభుత్వంలో ఉన్నది.
2014 నుంచి 2023 డిసెంబరు వరకు గత పదేళ్లలో బీఆర్ఎస్ హయాంలో మూసీ నదీ పరీవాహక ప్రాంతంతో పాటు, గొలుసుకట్టు చెరువులు ఏ విధంగా కబ్జాలకు గురయ్యాయో ప్రభుత్వం సభలో వివరించనుంది. దీంతో పాటు బఫర్ జోన్లలో వెలసిన భారీ భవనాలు, ఫామ్ హౌస్ల వివరాలను అధికారులు ఇప్పటికే సేకరించారు. ఆయా కీలక వివరాలను కూడా సభ ముందు ఉంచే ఛాన్స్ ఉన్నది. అంతేగాక మూసీ తప్పుడు ప్రచారాలు ఎందుకు జరుగుతున్నాయి? ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయి? సోషల్ మీడియాలో ఈ స్థాయిలో అసత్య ప్రచారాలు ఎందుకు చేస్తున్నారు? అనే అంశాలను సాక్షాత్తు సీఎం సభలో వివరించే ఛాన్స్ ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల నుంచి తెలిసింది. ఇక గతంలో మూసీ శుద్ధి పేరుతో ఖర్చు చేసిన నిధులు ఏమయ్యాయి? గ్రౌండ్ లెవల్లో జరిగిన పని ఎంత? అనే అంశాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ను తన డ్రీమ్ ప్రాజెక్టుగా భావిస్తున్నారు. దీంతోనే మూసీ ప్రక్షాళనకు భారీ స్థాయిలో ప్రణాళికలు తయారవుతున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన డీపీఆర్ను రూపొందిస్తున్నారు. ఇందులో రివర్ బెడ్ ప్యూరిఫికేషన్, చెక్ డ్యామ్ల నిర్మాణం, పర్యాటక కేంద్రాల అభివృద్ధి జరగనున్నది. అంతేగాక ప్లడ్స్ వచ్చినా.. నాలాలు తట్టుకునే వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. అత్యాధునిక టెక్నాలజీలతో నాలలు డైవర్షన్, వాటర్ సప్లై, ప్యూరిఫికేషన్ వంటి వాటిని చేయనున్నారు. కలుషితమైన నీటిని సాధారణ గాఢత స్థాయిలకు తీసుకువచ్చి నదీలో ప్రవహించేలా ప్లాన్ చేయనున్నారు.
దీంతో పాటు గోదావరి నీళ్లనూ మూసీలో కలిసేలా యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నారు. కేవలం కాంక్రీట్ కట్టడాలు కాకుండా, నదిలో సహజ సిద్ధమైన నీటి ప్రవాహం ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.దీనికి అనుసంధానంగా నగరంలోని చెరువులను కబ్జాకోరుల నుంచి విడిపించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ‘హైడ్రా’ ద్వారా కఠిన చర్యలు తీసుకుంటోంది. పుల్ ట్యాంక్ లెవల్, బఫర్ జోన్ లోని ఆక్రమణలను తొలగించడం ద్వారా వరద ముప్పును తప్పించడం సాధ్యపడుతుందని సర్కార్ ఆలోచన ఇక ఈ ప్రాజెక్టు కోసం దాదాపు రూ. 50 వేల కోట్ల నుండి రూ.1.5 లక్షల కోట్ల వరకు వ్యయం అవుతుందని ప్రభుత్వం చెబుతుంది .ఇందులో ప్రపంచ బ్యాంకు, ఇతర అంతర్జాతీయ ఆర్థిక సంస్థల సహకారంపై ప్రభుత్వం చర్చిస్తోంది. ఈ అంశాలన్నీ సభలోని సభ్యులకు వివరించనున్నారు.
Also Read: Hyderabad News: హైదరాబాద్లో దారుణం..అర్ధ రాత్రి కానిస్టేబుల్ని కత్తులతో పొడిచి చంపిన దుండగులు