బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోనే ఆ ఎమ్మెల్యేకి ఒక ప్రత్యేకత ఉండేది. ఆయన హడావుడి కూడా అలాగే ఉండేది. అయితే మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయాక ఆయన మాయమయ్యారంట. దాంతో అక్కడ గులాబీపార్టీ పట్టించుకునే దిక్కు లేక అనాధలా తయారైందంట. గత ఎన్నికల్లో అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు నియోజక వర్గాన్ని వదిలేసి సంవత్సరం గడుస్తుందంట. పార్టీ కార్యకర్తలకు పెద్దదిక్కుగా ఉండాల్సిన ఆయన నాకెందుకులే అన్నట్లు వ్యవహరిస్తుండటం ఎందుకో? ఎవరికీ అంతుపట్టడం లేదంట.. అసలు మిస్సింగ్ అయిన ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరు?… ఆ నియోజకవర్గం ఏది?
నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజవర్గం ఒకప్పుడు బీఆర్ఎస్కి కంచుకోట. రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ గెలిచి .. గత ప్రభుత్వంలో రాష్ట్రంలోనే ఏకైన మైనార్టీ ఎమ్మెల్యేగా పేరుపొందిన మహ్మద్ షకీల్ ఇప్పుడు నియోజకవర్గంలో కనిపించడం మానేశారు. గత సంవత్సర కాలంగా పార్టీకి, నియోజకవర్గానికి దూరం ఉంటూ తన సతీమణి అయోషా ఫాతిమాకు పెత్తనం అప్పగించి విదేశాలకు వెళ్లిపోయారు .. షకీల్తో పాటు ఆయన కొడుకు సాహిల్పై ఉన్న కేసుల నేపథ్యంలో అప్పటినుంచి ఇండియాకు రాలేదు. అయితే ఇప్పటికే రాష్ట్ర పోలీసు శాఖ షకీల్ ఆయన కొడుకు రాహిల్పై ఉన్న కేసులు నేపథ్యంలో లుకౌట్ నోటీసులు జారీ చేసింది.
ఈ ఏడాది ఆరంభంలో మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు ప్రజాభవన్ వద్ద రోడ్డు ప్రమాదం చేశాడు. కొడుకుని తప్పించడానికి షకీల్ తీవ్ర ప్రయత్నాలు చేశారు. యాక్సిడెంట్ కేసులో తనకుమారుడిని తప్పించడానికి షకీల్ సహకరించాడని అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఆ ఇద్దరితో పాటు మరో నలుగురు విదేశాలకు పారిపోవటంతో లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. అప్పటినుంచి మాజీ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ తన నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడడం లేదు.
షకీల్ పారిపోతూ నియోజకవర్గంలో పార్టీ బాధ్యతలు తన సతీమణి ఫాతిమాకు అప్పగించారంట. అప్పటి నుంచి బీఆర్ఎస్ పిలుపు మేరకు ఫాతిమా అడపాదడపా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే ఆమె కార్యకర్తలకు బలమైన భరోసా ఇవ్వలేక పోతున్నారని పార్టీ వర్గాలు పెదవి విరుస్తున్నాయి. గత ఎన్నికల్లో షకీల్ మీద కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గెలుపొందారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటం, సుదర్శన్రెడ్డి బలమైన నేత అవ్వడం, దానికి తోడు మంత్రివర్గ విస్తరణలో ఆయనకు మంత్రి పదవి ఖాయమన్న ప్రచారంతో … బోధన్లో కారు పార్టీ మొత్తం కాళీ అవుతుందంట. ఇప్పటికే మున్సిపల్ ఛైర్మెన్ తూము పద్మాశరత్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరగా కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. దాంతో బీఆర్ఎస్లో మిగిలింది రూపాయిలో చారణా భాగమే అంటున్నారు… వాళ్ళను అయినా కపడుకుంటారో లేదో అన్న చర్చ నియోజకవర్గంలో నడుస్తుంది.
బోధన్ నియోజవర్గానికి షకీల్ దూరమవ్వడంతో.. ఆయన భార్య ఫాతిమా పార్టీకి, కేడర్కి తానే పెద్ద దిక్కని నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆమె కార్యకర్తలకు పూర్తిస్థాయిలో భరోసా ఇవ్వలేకపోతున్నారంట. రాష్ట్రంలోనే మైనార్టీ ఫుడ్ బ్యాంక్ ఉన్న నియోజకవర్గాల్లో బోధన్ నియోజకవర్గ ఉంటుంది. అక్కడ తరచూ పొలిటికల్ వివాదాలు, ఇసుక మాఫియా ఆగడాలు, వివిధ ఇల్లీగల్ యాక్టివిటీస్ చోటుచేసుకుంటాయి. అంత వివాదాస్పదమైన నియోజవర్గం కాబట్టే ఫాతిమా వివాదాలు, కార్యకర్తల పంచాయతీలు పరిష్కరించలేక పోతున్నారంట.
Also Read: కమలంలో కీలక మార్పులు.. నడ్డా ప్లేస్లో అధ్యక్షుడిగా కిషన్రెడ్డి?
ఇక వచ్చే ఎన్నికల్లో తానే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఫాతిమా ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ఎన్నికలకు ఇంకా నాలుగు సంవత్సరాలు సమయం ఉండడంతో .. అప్పటికి ఆమెకు బీఆర్ఎస్ టికెట్ ఇస్తుందో? లేదో? చూద్దాం లే అని కేడర్ లైట్ తీసుకుంటుందంట.. మరి లుక్ఔట్ నోటీసులు ఉన్న మాజీ ఎమ్మెల్యే షకీల్ నాలుగేళ్లకైనా విదేశాల నుంచి తిరిగివస్తారా?.. ఆయన్ని రప్పించడానికి పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా?.. బోధన్ బీఆర్ఎస్కు దిక్కెవరన్నది సెగ్మెంట్లో హాట్ టాపిక్గా మారింది.