Drinking Water Issue: స్వేచ్ఛ బ్యూరో: మేడ్చల్ జిహెచ్ఎంసి పరిధిలోని 297, 298 కిష్టాపూర్–పూడూర్ డివిజన్ ప్రాంతాల్లో నెలకొన్న తీవ్ర మంచినీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జిహెచ్ఎంసి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ఖాళీ కుండలు, బిందెలతో నిరసన తెలుపుతూ కొన్ని కుండలను పగులగొట్టి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ భాస్కర్ యాదవ్ మేడ్చల్ జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ సుధాంశ్ కాళ్లు మొక్కుతూ ప్రజల తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని వేడుకున్నారు. అనంతరం ఆయనకు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా భాస్కర్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. మేడ్చల్ జిహెచ్ఎంసి పరిధిలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. ఎండాకాలం ప్రారంభం కాకముందే అనేక ప్రాంతాల్లో మంచినీరు అందడం లేదని, కొన్నిచోట్ల డ్రైనేజీ కలిసిన నీరు వస్తోందని తెలిపారు. పారిశుధ్య సమస్యలపై అధికారులను అడిగితే వాహనాలకు డీజిల్ లేదని సమాధానం ఇస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు తీవ్రమైన నీటి సమస్యను ఎదుర్కొంటున్నారని అన్నారు. అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందేదని భాస్కర్ యాదవ్ పేర్కొన్నారు. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పలుమార్లు జలమండలి మరియు అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లినా స్పందన లేదన్నారు.
Also Read: BRS party: బీఆర్ఎస్ పార్టీలో కనబడని కీలక మాజీ మంత్రులు..?
మున్సిపాలిటీని జిహెచ్ఎంసిలో విలీనం చేసిన తర్వాత ప్రజలు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కోట్ల రూపాయల పన్నులు వసూలు చేస్తున్నప్పటికీ ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కిష్టాపూర్–పూడూర్ డివిజన్ ప్రజలకు తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కోఆప్షన్ మెంబర్ నవీన్ రెడ్డి, కౌన్సిలర్ నిశిత రెడ్డి, మాజీ కౌన్సిలర్లు ఉమా నాగరాజు, గణేష్, బీఆర్ఎస్ లీగల్ సెల్ నాయకుడు చీర్ల చంద్రశేఖర్, నాయకులు శైలేందర్, విష్ణు చారి, శంభు ప్రభాకర్, మల్లికార్జున స్వామి, శంకర్, సందీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: Tiger Movement: హమ్మయ్యా.. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెల్లిని పెద్దపులి..?