Mahesh Kumar Goud: స్వేచ్ఛ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీ కథ ముగిసిందని, కేసీఆర్ ఫాంహౌస్కే పరిమితం అయ్యారని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. నాగర్కర్నూల్ జిల్లా కేవలంలో ఎంఎల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి నివాసంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అధ్యక్షుడిగా సంఘటన్ శ్రీజన్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నూతన కార్యవర్గాలకు నియామక పత్రాలు అందజేయడంతో పాటు ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు, ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్, సీడబ్ల్యూసీ సభ్యులు చల్లా వంశీ చందర్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, ఎంఎల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణ రెడ్డి, కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. పార్టీకి రాష్ట్రంలో కాలం చెల్లిందన్నారు. కేసీఆర్ ఫాంహౌస్కు పరిమితం అయ్యారని, సంతోష్ రావు సంతోషంగా ఉన్నారని, కవిత వేరు కుంపటి పెట్టుకున్నారన్నారు. అక్రమంగా సంపాదించుకున్నా వాటాలు పంచుకోలేని పరిస్థితి బీఆర్ఎస్ నాయకులది అన్నారు.
Also Read: Iran: ఇరాన్ చేతికి అణు బాంబు.. ప్రపంచ యుద్ధం మొదలైనట్టేనా?
కొలంబియా బిజినెస్ స్కూల్లో కేటీఆర్వి పచ్చి అబద్ధాలు అన్నారు. కాళేశ్వరం 45 లక్షల ఎకరాలకు నీరందిస్తుందని ప్రగల్భాలు పలుకుతుందన్నారు. వాస్తవంగా 86వేల ఎకరాలకే సాగునీరందిస్తుందని అన్నారు. కేసీఆర్ చుట్టం మురళీధర్ రావే ఇవన్నీ చెప్పిండన్నారు. పదవులు అలంకారం కాదని, ప్రజలకు సేవచేసేందుకు వచ్చిన మంచి అవకాశం అన్నారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నూతన నాయకులు కార్యకర్తలను ఆదుకోవాలని, ప్రజలకు మంచిగా సేవ చేసి కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకు రావాలన్నారు. రాహుల్ గాంధీని సీఎం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పని చేయాలని కోరారు.
రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ 200 యూట్యూబ్ ఛానెళ్లలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసత్య ప్రచారం చేస్తున్నదన్నారు. వీటిలో ప్రసారమవుతున్న వాటిని ప్రజలు నమ్మే అవకాశం లేకపోలేదన్నారు. సోషల్ మీడియాను కూడా విరివిగా వినియోగించుకుని ప్రభుత్వంపై బురదజల్లుతున్నదన్నారు. అందుకే కాంగ్రెస్ కార్యకర్తలు వీరికి ధీటుగా సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. దేశంలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. పదవుల వెంట వెళ్లొద్దని, పదవులే మీ వెంట వస్తాయని మంత్రి కార్యకర్తలకు సూచించారు. మంత్రాలకు చింతకాయలు రాలవని గుర్తించాలని, కూర్చున్న వద్ద నుంచే మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకోరాదని, ఫీల్డ్ లోకి వెళ్లి పని చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 2029లో కేంద్రంలో రాహుల్ ప్రధాని కావాలన్నా, రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావాలన్నా కార్యకర్తల పాత్ర ముఖ్యమన్నారు. పార్టీని బూత్ లెవెల్ నుంచి బలోపేతం చేయాలన్నారు.
Also Read: విమాన ప్రయాణికులకు బిగ్ షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిర్ ఇండియా