MP Chamala: భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్పై హైకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ నేతలు తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూడటంపై ఆయన ఘాటుగా స్పందించారు. కోర్టు తీర్పును అడ్డం పెట్టుకుని సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదమని, ఇది ఏమాత్రం బీఆర్ఎస్కు లభించిన క్లీన్ చిట్ కాదని ఆయన స్పష్టం చేశారు.
కేసీఆర్కు ఊరట.. బీజేపీ నేతలు ఆనందం
హైకోర్టు ఎక్కడా కమిషన్ను తప్పుపట్దలేదని, కేవలం విచారణ ప్రక్రియలో (Procedure) కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయని మాత్రమే ప్రస్తావించింది. తీర్పు పూర్తి కాపీ అందిన తర్వాత ప్రభుత్వం తదుపరి అడుగులు వేస్తుందని, అసలు విచారణ అప్పుడే మొదలవుతుందని ఆయన హెచ్చరించారు. కేసీఆర్కు ఊరట లభిస్తే కాంగ్రెస్ కంటే బీజేపీ నేతలు ఎక్కువ ఆనందపడటం వెనుక ఉన్న మర్మమేంటో ప్రజలు గమనిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
ముగిసిపోని విచారణలు..
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన భారీ అవకతవకలను నిరూపించడానికి ఘోష్ కమిషన్ ఒక్కటే ఆధారం కాదని చామల గుర్తుచేశారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇప్పటికే ప్రాజెక్టు వైఫల్యాలపై స్పష్టమైన నివేదిక ఇచ్చిందని, విజిలెన్స్ కమిటీ ఇచ్చిన ఆధారాలతో ఇప్పటికే కొందరిపై చర్యలు ప్రారంభమయ్యాయి చామల తెలిపారు. పదేళ్ల కాలంలో జరిగిన దోపిడీపై రాజీ పడే ప్రసక్తే లేదని, కాళేశ్వరంపై పూర్తిస్థాయి సీబీఐ విచారణ జరగాల్సిందేనని డిమాండ్ చేశారు.
హరీష్ రావు తీరుపై ఫైర్
బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీరును ఎంపీ తీవ్రంగా తప్పుపట్టారు. సీబీఐ విచారణ రాష్ట్రానికి రాకుండా ఉండేందుకు హరీష్ రావు ఢిల్లీ స్థాయిలో మంతనాలు సాగిస్తున్నారని సంచలన ఆరోపణ చేశారు. తీర్పు సారాంశం పూర్తిగా అర్థం చేసుకోకుండానే ప్రకటనలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.
బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్లపై ఇప్పుడు బాధ్యత పెరిగిందని చామల వ్యాఖ్యానించారు. అవినీతిపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే సీబీఐ విచారణ జరిపించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సవాల్ విసిరారు. రాష్ట్ర సంపదను దోచుకున్న వారు ఎవరైనా సరే, చట్టం నుండి తప్పించుకోలేరని ఆయన తేల్చి చెప్పారు.
Also Read: గెట్ ఔట్.. నీ వల్లే ఈ ట్రాఫిక్ జామ్, మంత్రిని కడిగిపడేసిన మహిళ.. వీడియో వైరల్