CM Revanth Reddy: తమ ప్రభుత్వంలో విద్యాశాఖకు తొలి ప్రాధాన్యత ఇచ్చామని.. ప్రభుత్వ ఏర్పాటులో నిరుద్యోగుల కృషి ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్, రవీంద్రభారతిలో జూనియర్ లెక్చరర్లకు సీఎం ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.
1292 జూనియర్ లెక్చరర్స్, 240 పాలిటెక్నిక్ లెక్చరర్స్ పోస్టులకు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. ‘12 ఏళ్ల మీ యుక్త వయస్సు వృథా అయ్యింది. నిరుద్యోగ సమస్య తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసేలా చేసింది. తెలంగాణ వచ్చాక నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతోందని యువత భావించింది. మొదటి సంవత్సరంలోనే 50 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. దేశ ఆర్థిక పురోగతి విద్యా రంగంతోనే సాధ్యం. విద్యారంగానికి రూ.21,650 నిధులు కేటాయించాం. ఇప్పటి వరకు 57,946 ఉద్యోగ నియామకాలు చేపట్టామని గర్వంగా చెబుతున్నా’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
‘ఒక కుటుంబంలో ఉద్యోగం వస్తే వారి భవిష్యత్తు తరాలలో కూడా మార్పు వస్తుంది. విద్యలో తెలంగాణ చిట్ట చివరి నుంచి మూడో స్థానంలో ఉంది. ఇది ఆందోళనకరం, అవమానకరం. 25 ఏళ్ల లోకి ఉద్యోగం చేరాల్సింది.. 35 ఏళ్లు వచ్చే వరకు ఉద్యోగంలోకి చేరుతున్నారు. ఈ నష్టం మీది కాదు. తెలంగాణకు జరిగిన నష్టం ఇది. మా ప్రభుత్వంలో విద్యాశాఖకు మా ప్రభుత్వంలో తొలి ప్రాధాన్యత ఇచ్చాం. ప్రభుత్వ ఏర్పాటులో నిరుద్యోగుల కృషి ఉంది’ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కన్నారు.
‘ఇంతకుముందు న్యాయస్థానాల్లో ఏళ్లుగా కేసులు వాయిదా పడుతూ వచ్చాయి. న్యాయ స్థానాల్లో చిక్కుముడులు విప్పుకుంటూ ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేశాం. 55 రోజుల్లో ఉపాధ్యాయ పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు ఇచ్చాం. రాష్ట్రంలో అన్ని కలిపి 29,500 స్కూళ్లు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది. ప్రమాణాలు పడిపోతున్నాయి. రెసిడెన్షియల్ స్కూల్స్ లో విద్యార్థులకు రూ.40 వేలు ఖర్చు చేస్తున్నాం. విద్యార్థులు ఎందుకు చేరడం లేదు. అంతా దీనిపై ఆలోచించాలి. ప్రపంచంతో పోటీ పడాలంటే చదువుతో పాటు సాంకేతిక నైపుణ్యం కూడా ఉండాలి’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
‘ప్రభుత్వ స్కూళ్లలో విద్యాప్రమాణాలు పెంచేందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ను నిర్మించబోతున్నాం. ఇటీవలే 55 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కోసం రూ.11000 కోట్లు కేటాయించాం. విద్యార్థి, నిరుద్యోగుల్లో నైపుణ్యాన్ని పెంచేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. వచ్చే ఒలంపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ అథారిటీని ఏర్పాటు చేసుకుంటున్నాం. క్రీడల్లో రాణించిన వారికి ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తోంది. క్రికెట్ లో రాణించిన సిరాజ్ కోసం నిబంధనలు సడలించి ఉద్యోగం ఇచ్చాం. బాక్సింగ్ లోరాణించిన నిఖత్ జరీన్ కు డీఎస్పీ ఉద్యోగం కల్పించాం. పారాలింపిక్స్ లో రాణించిన దీప్తి జీవాంజీకి ఇంటి స్థలంతో పాటు ఉద్యోగం ఇచ్చాం’ అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
ALSO READ: RWF: టెన్త్ అర్హతతో 192 ఉద్యోగాలు.. ఏడాది పాటు స్టైఫండ్.. ఇప్పుడే దరఖాస్తు చేయండి..
ALSO READ: ITI LIMITED: శుభవార్త.. డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. జస్ట్ ఇంటర్వ్యూతోనే జాబ్.. ఇంకెందుకు ఆలస్యం