CM Revanth Reddy: తెలంగాణలోని ప్రజా ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్ద పీట వేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సనత్ నగర్ లో టిమ్స్ ఆస్పత్రిని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. టిమ్స్ మెడికల్ కాలేజీలో చదివే యువతులు డాక్టర్లు, నర్సులు అయ్యి.. విదేశాల్లో సేవలు అందించాలని ఆకాంక్షించారు. జర్మనీ, జపాన్, సౌత్ కొరియా వంటి దేశాలు.. ఇక్కడి నర్సింగ్ స్టాఫ్ మీద ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నాయని రేవంత్ తెలియజేశారు.
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం వచ్చాక 16,000 మందికి పైగా మెడికల్ సిబ్బందిని కొత్తగా నియమించుకున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. విద్య, వైద్యం మీద తాము చేస్తున్న ఖర్చును భవిష్యత్తుపై చేసే పెట్టుబడిగా తాము భావిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం పిల్లల చదువులు, వైద్యం పేదవాడికి అత్యంత ఖరీదైనదిగా మారిందని అన్నారు. సామాన్యులు కార్పోరేట్ ఆస్పత్రిలో చేరితే ఆస్తులు అమ్మినా వైద్యానికి సరిపోని పరిస్థితి ఉందన్నారు. చివరికి కిడ్నీలు కూడా అమ్ముకునే పరిస్థితులు రాష్ట్రంలో, దేశంలో ఉన్నాయన్నారు. ప్రస్తుతం వైద్యం ఎంతో ఖరీదై పోయిందన్నారు. అందుకే ఉచితంగా వైద్యం అందించాలన్న సంకల్పంతో తమ ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు చెప్పారు.
Also Read: చీరతో భర్తను కట్టేసి.. కర్రతో తలపై బాది.. హైదరాబాద్లో భార్య ఘాతుకం!
మరోవైపు ఇదే వేదిక నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తనదైన శైలిలో రేవంత్ చురకలు అంటించారు. సనత్ నగర్ టిమ్స్ ను తామే కట్టించామని కేటీఆర్ అంటున్నారని.. పక్కనే ఉన్న ఎర్రగడ్డ ఆస్పత్రిలో నెత్తికి కరెంటు వైర్లు పెడితే అంతా సెట్ అయిపోతుందని చురకలు అంటించారు. ఒకవేళ మీరే నగరంలోని టిమ్స్ ఆస్పత్రులను కట్టించి ఉంటే.. మీ పదేళ్ల పాలనలో ఎందుకు శంకుస్థాపన చేయలని నిలదీశారు. టిమ్స్ కు వాళ్లే కొబ్బరికాయ కొట్టి ఉంటే.. ఎందుకు రిబ్బన్ కట్ చేయలేదని ప్రశ్నించారు. జీవోలు ఇచ్చి.. టెంకాయ కొడితే సరిపోతుందా అంటూ ప్రశ్నించారు. పేదలకు వైద్యం అందించే ఆస్పత్రుల నిర్మాణాల్లో ఎందుకు జాప్యం చేశారని నిలదీశారు. ఫామ్ హౌస్ లు కట్టుకోవడంలో బిజీగా మారిపోయి.. ఆస్పత్రులను ఆలస్యం చేశారా అంటూ చురకలు అంటించారు.
Also Read: ట్రైనీ ఐపీఎస్కు బిగ్ షాక్.. పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు సంచలన ఉత్తర్వులు!