Allu Arjun:హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్రోడ్స్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసు విచారణ నాంపల్లి కోర్టులో జరిగింది. ఈ విచారణకు సినీ హీరో అల్లు అర్జున్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. కోర్టు ప్రత్యేక అనుమతితో ఆయన వర్చువల్గా కోర్టు ప్రక్రియలో పాల్గొన్నారు. కేసు వాదనలను ఆలకించిన న్యాయస్థానం తదుపరి విచారణను సెప్టెంబర్ 1కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
‘పుష్ప-2’ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా డిసెంబర్ 4, 2024న సంధ్య థియేటర్ వద్దకు అల్లు అర్జున్ను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఈ క్రమంలో అక్కడ తీవ్రమైన తొక్కిసలాట చోటుచేసుకుంది. ఇక ఈ దురదృష్టకర సంఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.
ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి ముమ్మర దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ కేసులో అల్లు అర్జున్ను ఏ-11 నిందితుడిగా చేర్చారు. అల్లు అర్జున్తో పాటు థియేటర్ యాజమాన్యం, ఈవెంట్ నిర్వాహకులు, భద్రతా సిబ్బంది సహా మొత్తం 23 మందిపై పోలీసులు చార్జ్షీట్ దాఖలు చేశారు. కేసు విచారణలో భాగంగా గతంలోనే నాంపల్లి కోర్టు నిందితులకు సమన్లు జారీ చేసింది.
గతంలో జూన్ 22న జరిగిన విచారణ సమయంలోనూ అల్లు అర్జున్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. ఇక వ్యక్తిగతంగా కోర్టుకు రావాల్సి ఉన్నప్పటికీ, తన సినిమా షూటింగ్ రద్దీ కారణంగా వర్చువల్గా హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్ వేయగా కోర్టు అంగీకరించింది. తాజాగా జరిగిన విచారణలోనూ ఆయన ఆన్లైన్ ద్వారానే హాజరై కోర్టు విచారణలో పాల్గొన్నారు.
ALSO READ:ఉప్పల్ బాలు వివాదంపై స్పందించిన నవదీప్.. వీడియో వైరల్!
ఈ దుర్ఘటనకు అసలు బాధ్యులు ఎవరు, భద్రతా లోపాలు ఎక్కడ జరిగాయి అనే అంశాలపై పోలీసులు సేకరించిన ఆధారాల ఆధారంగా కోర్టు విచారణ వేగవంతంగా జరుగుతోంది. కేసులోని కొందరు నిందితులకు ముందస్తు బెయిల్ లభించగా, మరికొందరిపై న్యాయ ప్రక్రియ కొనసాగుతోంది.
ఇక నాంపల్లి కోర్టు కేసు విచారణను సెప్టెంబర్ 1వ తేదీకి వాయిదా వేయడంతో, ఆ రోజు కోర్టు ఎలాంటి తీర్పులు ఇస్తుంది, ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందనే దానిపై సినీ వర్గాల్లోనూ, సాధారణ ప్రజల్లోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది.