Husband Murder: భర్తను కొట్టి చంపి ప్రమాదంగా చిత్రీకరించే యత్నం చేసిన భార్యను హైదరాబాద్ మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ జలేందర్ రెడ్డి తెలిపిన ప్రకారం.. ఫిర్జాదీగూడ రాఘవేంద్రకాలనీ వాస్తవ్యులైన సునీత (44), సత్యనారాయణ భార్యాభర్తలు. వీరి కుమారుడు నిఖిత్. సత్యనారాయణ ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండగా సునీత ఇళ్లల్లో పని చేస్తోంది.
ఇదిలా ఉండగా ఆగస్టు 6న నైట్ డ్యూటీకి వెళ్లిన సత్యనారాయణ ఆ మరుసటి రోజు మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. అప్పటికే పనికి వెళ్లిపోయిన సునీత కూడా మధ్యాహ్నం 1.30గంటలకు ఇంటికి చేరుకుంది. ఆ సమయంలో సత్యనారాయణ మద్యం సేవించి ఉండటం చూసి అతనితో గొడవపడింది. మాటా మాటా పెరిగిపోవటంతో కోపంతో రెచ్చిపోయిన సునీత చీరతో భర్త కాళ్లూచేతులు కట్టేసి సెంట్రింగ్ కర్రతో తలపై బలంగా కొట్టింది.
దాడిలో తీవ్రంగా గాయపడ్డ సత్యనారాయణ స్పృహ తప్పి పడిపోవటంతో కొడుకు నిఖిత్ కు ఫోన్ చేసింది. సత్యనారాయణ రోడ్డు ప్రమాదంలో గాయపడి స్పృహ తప్పాడని చెప్పింది. వెంటనే ఇంటికి చేరుకున్న నిఖిత్ తండ్రిని బోడుప్పల్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాడు. అక్కడి వైద్యుల సూచన మేరకు గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ సత్యనారాయణను పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మరణించినట్టు నిర్ధారించారు.
Also Read: ట్రైనీ ఐపీఎస్కు బిగ్ షాక్.. పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు సంచలన ఉత్తర్వులు!
సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసులు సత్యనారాయణ మృతదేహానికి పోస్టుమార్టం జరిపించారు. దీంట్లో దాడి చేయటం వల్ల అయిన గాయాలతో అతను మరణించినట్టు నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో సునీతను అదుపులోకి తీసుకుని విచారించగా తానే సత్యనారాయణను కొట్టినట్టుగా అంగీకరించింది. ఈ క్రమంలో పోలీసులు సత్యనారాయణ కాళ్లూచేతులు కట్టేందుకు ఉపయోగించిన చీర, సెంట్రింగ్ కర్రను స్వాధీనం చేసుకున్నారు. కేసును హత్యగా మార్చి నిందితురాలిని కోర్టులో హాజరుపరిచి జైలుకు రిమాండ్ చేశారు.
Also Read: ‘దమ్ముంటే అసెంబ్లీకి రండి’.. వైసీపీ నేతలకు చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్!