Telangana Paddy Procurement: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం ఢిల్లీలో కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని ధాన్యం సేకరణ, బకాయిల విడుదల తదితర కీలక అంశాలపై కేంద్ర మంత్రికి వారు వినతిపత్రం సమర్పించారు. 2025-26 వానాకాలం పంటకు సంబంధించి తాము అదనంగా సేకరించిన 18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని భారత ఆహార సంస్థ (FCI) తీసుకోవాలని కోరారు. వానాకాలం పంట సేకరణకు గతంలో 53.73 లక్షల మెట్రిక్ టన్నులకే అనుమతి ఇచ్చారని, అయితే దిగుబడి పెరగడంతో అదనంగా సేకరించిన మొత్తాన్ని 10 శాతం నూకతో ఎఫ్సీఐ సేకరించాలని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా, 2024-25 యాసంగి పంటకు సంబంధించి 5 శాతం నూకతో అదనంగా 10 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ మిల్లింగ్కు అనుమతించాలని ముఖ్యమంత్రి కోరారు. ప్రస్తుతం 2024-25 వానాకాలం పంట కస్టమ్స్ మిల్లింగ్ రైస్ సరఫరాకు ఫిబ్రవరి 28 వరకు ఉన్న గడువును మరో రెండు నెలల పాటు పొడిగించాలని విన్నవించారు. రాష్ట్రంలో మిల్లింగ్ ప్రక్రియ సాఫీగా సాగేందుకు ఈ గడువు పెంపు ఎంతో అవసరమని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై కూడా ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. 2014-15 వానాకాలం సీజన్లో ఎఫ్సీఐకి సరఫరా చేసిన బియ్యానికి సంబంధించి తెలంగాణకు రావాల్సిన రూ. 1,468.94 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నాడు అదనపు లెవీ సేకరణ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించిందని, ఆ రుణంపై వడ్డీయే రూ. 2 వేల కోట్లకు పైగా పెరిగిందని వివరించారు. వీటితో పాటు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన రూ. 343.27 కోట్ల బకాయిలను కూడా చెల్లించాలని కోరారు.
ఈ సమావేశంలో ఎంపీలు డాక్టర్ మల్లు రవి, సురేశ్ షెట్కార్తో పాటు పౌరసరఫరాల శాఖ అదనపు డైరెక్టర్ రోహిత్ సింగ్, డాక్టర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు. రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అదనపు ధాన్యం సేకరణ, నిధుల విడుదలపై కేంద్రం సానుకూలంగా స్పందించాలని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.