AP vs Telangana Water Dispute: గోదావరిపై ఏపీ తలపెట్టిన పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం న్యాయ పోరాటాన్ని తీవ్రతరం చేసింది. ఈ ప్రాజెక్టు విస్తరణ పనులకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ సోమవారం విచారణకు రానున్న నేపథ్యంలో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం ముంబైలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
తెలంగాణ వాదనలను సుప్రీంకోర్టులో బలంగా వినిపించాలని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యలపై వీరు సుదీర్ఘంగా చర్చించారు. ఏపీ ప్రభుత్వం ఎటువంటి అనుమతులు లేకుండా పోలవరం నుంచి బనకచర్ల లేదా నల్లమల సాగర్కు లింక్ చేసేందుకు విస్తరణ పనులు చేపడుతోందని, ఇది చట్టవిరుద్ధమని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. ప్రాజెక్టు మొదట ఆమోదించిన స్వరూపానికి భిన్నంగా జరుగుతున్న ఈ పనులను తక్షణమే నిలిపివేసేలా పోలవరం ప్రాజెక్టు అథారిటీకి ఆదేశాలు ఇవ్వాలని తెలంగాణ కోరుతోంది.
తెలంగాణ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ప్రీ-ఫిజిబిలిటీ రిపోర్టులను పరిశీలించడం సమంజసం కాదని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కేంద్ర జల సంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం డీపీఆర్ (DPR) తయారీకి సిద్ధపడుతోందని, దీనికి పర్యావరణ అనుమతులు ఇవ్వకూడదని, కేంద్రం నుంచి ఎటువంటి ఆర్థిక సాయం అందించకుండా చూడాలని పిటిషన్లో కోరారు. ఈ కేసులో అవసరమైన అన్ని సాక్ష్యాధారాలతో సిద్ధంగా ఉండాలని ఇరిగేషన్ అధికారులను సీఎం అప్రమత్తం చేశారు.