CM Revanth Reddy: హైదరాబాద్ లోని ఎన్టీఆర్ మార్గ్ వద్ద గల హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో హైదరాబాద్ రైజింగ్ ఉత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్న సందర్భంగా ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా రైజింగ్ ఉత్సవాలను నిర్వహించారు. ఈ ఉత్సవాలలో భాగంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మార్చాలనేది తమ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమన్నారు. గత ప్రభుత్వం మాయమాటలు చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసిందన్నారు. హైదరాబాద్ నగర సుందరీకరణకు ప్రత్యేక నిధులు కేటాయించి, నగరానికి కావలసిన మౌలిక సదుపాయాలపై తాము ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూసేలా మూసీ సుందరీ కరణ పేరుతో నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా అభివృద్ది విషయంలో తాము వెనుకడుగు వేయబోమన్నారు.
హైదరాబాద్ నగరం అంటేనే దేశంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు గల నగరంగా పేరుగాంచిందన్నారు. ఈ నగరం ఎందరో యువకులకు ఉపాధినిస్తుందని, ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు ఎందరో నాయకులు, ఐటీ కంపెనీలను హైదరాబాద్ కు తీసుకువచ్చి నగరం అభివృద్దికి దోహద పడ్డారన్నారు. పిజెఆర్ వల్లే గోదావరి జలాలు నగరానికి వచ్చాయని తెలిపారు. న్యూయార్క్, టోక్యో వంటి నగరాలకు పోటీనిచ్చే సత్తా ఉన్న నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని సీఎం తెలిపారు. ఎన్నో కంపెనీలు ఇక్కడ ఉన్నాయని, ప్రభుత్వానికి 65 శాతం ఆదాయం ఇక్కడి నుండే వస్తుందన్నారు. తెలంగాణ మణిహారంగా రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం సాగిస్తున్నామని, 7 వేల కోట్లతో హైదరాబాద్ అభివృద్దికి ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Also Read: Hyderabad City Buildings: మీరు హైదరాబాద్ వాసులా.. ఈ గుడ్ న్యూస్ మీకోసమే
కిషన్ రెడ్డి.. ఒక్క రూ. 10 వేల కోట్లు తీసుకురండి
కేంద్ర మంత్రి హోదాలో గల సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి, కేంద్రంతో మాట్లాడి ఒక్క రూ.10 వేల కోట్లు తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మూసీ ప్రక్షాళన పేరిట తాము నిర్వాసితులకు అండగా నిలబడుతుంటే, అక్కడికి వెళ్లి నిద్రలు చేయడం మాని కేంద్రం నుండి నిధులు తీసుకురావాల్సిన భాద్యత కిషన్ రెడ్డిపై ఉందన్నారు. ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా కిషన్ రెడ్డి తీసుకు రాలేదని ఈ విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం సహకారం కావాలని, నిధులు తెస్తరా? గుజరాత్ కు వలసపోతారా? మూసీ ప్రక్షాళనకు కేంద్రం నుంచి ఎంత నిధులు తీసుకొస్తవ్ అంటూ సీఎం ప్రశ్నించారు.
ఫామ్ హౌస్ లో కేసీఆర్..
పదేళ్లు తెలంగాణను భ్రష్టు పట్టించిన కేసీఆర్ ఇప్పుడు ఫామ్ హౌస్ కి పరిమితమై, తాము చేసే అభివృద్దికి అడ్డు పెట్టడం ఎలా అంటూ ఆలోచిస్తున్నారని సీఎం రేవంత్ అన్నారు. ట్యాంక్ బండ్ నీరు పాలమాదిరిగా మారుస్తామని హామీలిచ్చి, పదేళ్లు అప్పుల ఊబిలోకి నెట్టేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. బీఆర్ ఎస్ , బీజేపీలపై చర్చించేందుకు తాను సిద్దమని, మీ పాలసీ డాక్యుమెంట్ ను తెలంగాణ సమాజానికి చూపించండంటూ సీఎం సవాల్ విసిరారు.
నగర అభివృద్ధిపై మంత్రివర్గ ఉపసంఘం..
హైదరాబాద్ నగర అభివృద్దికి తాము కట్టుబడి, వేల కోట్ల రూపాయలతో ఎన్నో అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉప ముఖ్యమంత్రి అధ్వర్యంలో మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేస్తామని, అఖిల పక్ష సమావేశం సైతం నిర్వహిస్తామన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ లు ఏమేమి సలహాలు ఇస్తారో ఇవ్వండి అంటూ సీఎం పిలుపునిచ్చారు.