CM Revanth Reddy: ఎస్సీ వర్గీకరణకు అండగా నిలిచిన సభ్యులందరికీ సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు వర్గీకరణ బిల్లుకు మద్దతు తెలిపాయని సీఎం హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్బంగా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ‘ఎస్సీ వర్గీకరణ కోసం అనేక పోరాటాలు జరిగాయి. ఈ పోరాటంలో అనేక మంది చనిపోయారు. దళితుల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ అనేక నిర్ణయాలు తీసుకుంది. ఉమ్మడి ఏపీకి దళిత సీఎంను చేసిన ఘనత కాంగ్రెస్ కే దక్కుతుంది. ఎన్నికల సందర్భంగా .. సుప్రీంకోర్టులో ఈ అంశానికి అనుకూలంగా వాదనలు వినిపించాం. ఉత్తమ్ సారథ్యంలో వర్గీకరణ అమలు కోసం సబ్ కమిటీ కూడా వేశాం’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ALSO READ: CM Revanth Reddy: యువతకు భారీ గుడ్ న్యూస్.. రూ.4,00,000 స్కీం ప్రారంభించిన సీఎం రేవంత్
‘ఎన్నో ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్న చారిత్రాత్మకమైన సందర్భం ఇది. దళితులకు అండగా ఉంటూ వారి అభ్యున్నతికి మా ప్రభుత్వం కృషి చేస్తోంది. 1960 లోనే ఉమ్మడి రాష్ట్రంలో దామోదరం సంజీవయ్య లాంటి దళితున్ని ముఖ్యమంత్రిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. దళితుడు మల్లికార్జున ఖర్గేను ఏఐసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ నియమించింది. పంజాబ్ కేసు సుప్రీంకోర్టులో సుదీర్ఘంగా కొనసాగింది. మేం అధికారంలోకి వచ్చాక ఏడుగురు జడ్జిల ముందు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా న్యాయవాదితో సుప్రీం కోర్టులో మన వాదనలు వినిపించాం’ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
‘సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే వర్గీకరణకు అనుకూలంగానే శాసనసభలో తీర్మానం చేశాం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం కూడా ఏర్పాటు చేశాం. న్యాయ నిపుణులను సంప్రదించి వన్ మెన్ కమిషన్ ను ఏర్పాటు చేశాం. వన్ మెన్ కమిషన్ ఇచ్చిన నివేదికను తూచ తప్పకుండా ఆమోదించాం. 59 ఉపకులాలను మూడు గ్రూపులుగా విభజించి 15 శాతం రిజర్వేషన్లు వారికి పంచాం. ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలను ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుంది. వారి కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం పథకాల్లో ప్రాధాన్యం కల్పిస్తాం’ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
‘వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అందరూ సమర్ధిస్తున్నారు. 2026 జనగణన పూర్తి కాగానే ఆ లెక్కల ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతాం. రిజర్వేషన్లు పెంచడం వాటిని సహేతుకంగా పంచడం మా బాధ్యత. సభా నాయకుడిగా నేను మాట ఇస్తున్నా. ఇందిరమ్మ రాజ్యంలో మీకు అన్యాయం జరగదు. రిజర్వేషన్లను పెంచి వాటిని అమలు చేసే బాధ్యత మేం తీసుకుంటాం. బిల్లు ఆమోదానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ALSO READ: IOCL Recruitment: ఇంటర్, డిగ్రీ అర్హతతో 200 ఉద్యోగాలు.. సెలెక్ట్ అయిన వారికి స్టైఫండ్ కూడా..!