Osmania Hospital: తెలంగాణ వైద్యారోగ్య చరిత్రలో మరో కొత్త శకం ప్రారంభం అవ్వనుంది. వందేళ్లుగా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాల ప్రజలకు సేవలందించిన ఉస్మానియా ఆసుపత్రికి నూతన భవనం నిర్మించాలని ప్రజా ప్రభుత్వం సంకల్పించిన విషయం తెలిసిందే. రేపు పేదల ఆస్పత్రి ఉస్మానియా ఆస్పత్రిని సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నారు.
ప్రజెంట్ ఉస్మానియా ఆసుపత్రి అఫ్జల్గంజ్లో ఉంది. అది శిథలావస్థకు చేరుకుంది. కొత్తగా నిర్మించే ఉస్మానియా ఆస్పత్రిని గోషామహల్ స్టేడియంలో నిర్మించనున్నారు. 2000 పడకల సామర్ధ్యంతో మొత్తం 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నూతన ఆసుపత్రిని నిర్మించనున్నారు. 26 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనాలు కార్పొరేట్ ఆసుపత్రులను తలదన్నేలా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఆస్పత్రి అందుబాటులోకి వచ్చాక పేదలకు, మధ్య తరగతి కుటుంబాలకు మేలు జరుగుతుంది.
రాబోయే వందేళ్ల అవసరాలకు తగినట్లు ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించాలని ఇటీవల నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశాలు జారీ చేశారు. దానికి అనుగుణంగా.. అన్నిరకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, ప్రతి డిపార్ట్మెంట్కు ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు, ప్రతి థియేటర్కు అనుబంధంగా పోస్ట్ ఆపరేటివ్, ఐసీయూ వార్డులు, గ్రౌండ్ ఫ్లోర్లో ఒకే చోట అన్నిరకాల డయాగ్నసిస్ సేవలు, అత్యాధునిక టెక్నాలజీతో కూడిన మార్చురీ, స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ కూడిన ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్లకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
Also Read: Patancheru Incident: అసలు పటాన్చెరులో ఏం జరుగుతోంది.. అక్కడి ఎమ్మెల్యే ఏం చెబుతున్నారంటే..?
అండర్ గ్రౌండ్ రెండు ఫ్లోర్లలో పార్కింగ్, ఆసుపత్రి సమీపంలో ఫైర్ స్టేషన్, ఆసుపత్రి చుట్టూ విశాలమైన రహదారులు, ఆసుపత్రి ప్రాంగంణంలో ఎక్కడికైనా ఫైర్ ఇంజిన్లు, అంబులెన్స్లు తిరిగే మార్గాలు, దివ్యాంగులు ఆసుపత్రిలోకి రాకపోకలు సాగించేందుకు వీలుగా ర్యాంప్లు, ఆసుపత్రిలోని రోగులకు సహాయకులుగా వచ్చే వారు సేద తీరేందుకు డార్మెటరీలు, క్యాంటీన్, మరుగుదొడ్లు వంటి సమస్త సౌకర్యాలతో అత్యాధునికంగా నిర్మించనున్నారు. ఇలా నిరుపేద నుంచి మధ్య తరగతి కుటుంబాలకు ఉపయోగపడేలా ఆస్పత్రిని నిర్మించనున్నారు.