CM Revanth Reddy: రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం శుభాకాంక్షలు చెప్పారు సీఎం రేవంత్రెడ్డి. ప్రజాస్వామిక, సార్వభౌమ గణతంత్ర రాజ్యంగా భారతదేశం వర్ధిల్లాలన్నారు. స్వతంత్ర సమరయోధులు, రాజ్యాంగ నిర్మాతలను స్మరిస్తూ సంవిధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలో అనేక ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టిందన్నారు.
ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన కొన్ని విషయాల గురించి ప్రస్తావించారు. మహిళల సాధికారత కోసం వారికి ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. రూ. 500 లకే సిలిండర్ ఇవ్వడం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ సహాయాన్ని రూ.10 లక్షలకు పెంచారు. సంక్షేమ పథకాలతోపాటు ఉద్యోగాల భర్తీ విషయాన్ని ప్రధానంగా గుర్తుచేశారు. వీటికితోడు మరెన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేపడుతోందన్నారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజా ప్రభుత్వం నాలుగు పథకాలకు శ్రీకారం చుట్టింది. వాటిలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టడం సంతోషకరమైన పరిణామంగా వర్ణించారు. రాజ్యాంగ నిర్మాతల ఆకాంక్షలకు అనుగుణంగా అర్హులైన ప్రతి లబ్దిదారుడికి పథకాల ప్రయోజనాలు అందాలన్నదే తమ ప్రభుత్వ ఆకాంక్ష అని పేర్కొన్నారు.
రాష్ట్ర పునర్నిర్మాణం, తెలంగాణను ప్రపంచ పటంలో ఆవిష్కరించాలన్న ఆశయంతో ‘తెలంగాణ రైజింగ్’ నినాదంతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన సంస్థల నుంచి పెట్టుబడులను ఆకర్షించి హైదరాబాద్ను సమున్నత స్థానంలో చేర్చడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు మనసులోని మాట బయటపెట్టారు.
ALSO READ: లేడి అఘోరీపై రాళ్లతో దాడి చేశారు.. ఎందుకంటే..?
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పానికి తోడు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్నామని వెల్లడించారు. ముఖ్యంగా స్కిల్స్ యూనివర్సిటీ స్థాపన, అడ్వాన్స్ డ్ ట్రెయినింగ్ ఇనిస్టిట్యూట్ (ఏటీసీ)ల స్థాపన వంటి ఎన్నో కార్యక్రమాలకు నాంది పలికామన్నారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ నిర్మాతలు, సమున్నత స్థాయిలో దేశాన్ని నిలిపిన మహనీయులు అందరినీ స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ తెలంగాణ పునర్నిర్మాణంలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుందన్నారు.