CM Revanth Reddy: బీఆర్ఎస్ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పంటలు ఎండిపోయినా, ప్రజల ప్రాణాలు పోతున్నా బీఆర్ఎస్ నేతలు డ్యాన్సులు వేస్తున్నారని మండిపడ్డారు. గురువారం ఢిల్లీలో మీడియాతో ఆయన చిట్చాట్ చేశారు. పలు అంశాలపై మాట్లాడారు. తొలుత ఎమ్మెల్సీ టికెట్ల వ్యవహారంపై మాట్లాడారు.
అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు రానివారికి అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తానని హామీ ఇచ్చామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు అమలు చేసి చూపిస్తున్నామని గుర్తు చేశారు. పార్టీ అనుబంధ విభాగాల్లో పని చేసిన వారికి ఒకేసారి 37 కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
అందులో భాగంగానే అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్లకు ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చామన్నారు. చాలామందికి డీసీసీ అధ్యక్షులందరికీ పదవులు ఇచ్చిన విషయాన్ని వివరించారు. గాంధీ కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందన్న ఆయన, తాను ఫోటోలు దిగి చూపించాల్సిన అవసరం లేదన్నారు.
కేంద్ర కేబినెట్లో ఉన్న ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ గతంలో తమిళనాడుకు మెట్రో ప్రకటనలో కీలక పాత్ర పోషించారని మనసులోని మాట బయపెట్టారు సీఎం. కానీ, తెలంగాణ రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రి కిషన్రెడ్డి మాత్రం రాష్ట్ర సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు.
ALSO READ: రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
మామునూరు ఎయిర్పోర్టుకు 253 ఎకరాల భూసేకరణ పూర్తి చేస్తామన్నారు సీఎం. మెట్రో, మూసీ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతిస్తే సరిపోతుందన్నారు. రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. తెలంగాణలో ఏప్రిల్లో మూడు రోజులపాటు భారత్ సమ్మిట్ నిర్వహించాలని అనుకుంటున్నాము.
ఏప్రిల్లో మూడు రోజులపాటు తెలంగాణలో భారత్ సమ్మిట్ నిర్వహించాలని అనుకుంటున్నామని తెలిపారు సీఎం. దీనికి 60 దేశాల నుంచి అతిథులను ఆహ్వానించామని, అందుకు విదేశాంగ శాఖ మంత్రి అనుమతి కావాలన్నారు. అందుకోసమే విదేశాంగ శాఖ మంత్రిని కలిసినట్టు తెలిపారు.
ఈనెల 22న చెన్నైలో ఏర్పాటు చేసిన సమావేశానికి తమను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించిందన్నారు సీఎం. డీలిమిటేషన్ కారణంగా జరిగే నష్టం, భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించడానికి రమ్మని అడిగారని గుర్తు చేశారు. పార్టీ అనుమతి తీసుకున్న తర్వాత ఆ సమావేశానికి హాజరవుతామన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర పన్నుతున్న కుట్రను తిప్పికొట్టడానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
తమిళనాడుకు వెళ్లేలోపు తెలంగాణలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఇది పార్టీలకు అతీతంగా స్పందించాల్సిన విషయమన్నారు. త్రీ భాషా విధానంపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, జానారెడ్డి నేతృత్వంలో కమిటీ వేశానన్నారు సీఎం రేవంత్. దీనికి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని ఆహ్వానిస్తున్నామన్నారు. తెలంగాణలో అందరి అభిప్రాయాన్ని సేకరించి ఆ తర్వాత డీఎంకే మీటింగ్ మా వైఖరి చెబుతామన్నారు.