Telangana Politics: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మార్క్ గులాబీపార్టీలో పెరుగుతోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. బీఆర్ఎస్తో సంబంధం లేకుండా జాగృతి వేదికగా చేపడుతున్న కార్యక్రమాలను గులాబీ పార్టీ ఫాలో కావడం ఇటీవల కాలంలో పరిపాటిగా మారిందనే చర్చ నడుస్తోంది. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కవిత సమర్ధిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలను స్వాగతిస్తూ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. తాజాగా బీసీ రిజర్వేషన్ల రిజర్వేషన్లపై ఆమె అడుగుజాడల్లోనే.. గులాబీ దళం అడుగులు వేస్తున్నందనే టాక్ నడుస్తోందట.
కవిత వ్యూహాలతో బీఆర్ఎస్ శ్రేణుల్లో గందరగోళం
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ప్రస్తుతం జాగృతి వేదికగా సొంత అజెండా నడిపిస్తున్న కల్వకుంట్ల కవిత వేసే ప్రతి స్కెచ్లతో గులాబీ పార్టీ గందరగోళానికి గురవుతుందట. బీఆర్ఎస్ నేతలంతా తన దారిలోకి రావాల్సిందేనేని ప్రకటించిన కవిత.. అందుకు తగ్గట్లుగానే పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది. ఎమ్మెల్సీగా ఉన్న కవిత ఏ కార్యక్రమం చేపడితే దానికి కంటిన్యూగా బీఆర్ఎస్ ప్రోగ్రాంలు నిర్వహిస్తుండడం ఇప్పుడు చర్చనీయంశంగా మారిందట. విధాన పరమైన నిర్ణయాలు, ప్రజాక్షేత్రంలో చేపట్టాల్సిన కార్యక్రమాల్లో గులాబీ నేతలు కవితను ఫాలో అవుతుండటం అటు పార్టీలోనూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారితీస్తున్నాయి. బీసీ రిజర్వేషన్లపై కవిత ఉద్యమం స్టార్ట్ చేసిన తర్వాతనే బీఆర్ఎస్ పార్టీ సైతం కార్యక్రమాలు చేపడుతుండటం గమనార్హం.
జాగృతి అధ్యర్యంలోనే కవిత నిరసన కార్యక్రమాలు
జాగృతి ఆధ్యర్యంలోనే కవిత నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. పార్టీలో యాక్టివ్గా ఉన్న సమయంలోనే బీసీ రిజర్వేషన్ల అంశంతో జిల్లాల్లో తిరిగిన కవిత.. ఆ తర్వాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తే బీఆర్ఎస్ మాత్రం వ్యతిరేకించిన పరిస్ధితి. ఆ సందర్భంలోనే కవిత పార్టీ నేతలనుద్దేశించి చేసిన కామెంట్స్ సంచలనగా మారాయి. పార్టీ నేతలందరూ నా దారిలో రావాల్సిందేనేన్న కవిత వ్యాఖ్యలు బీఆర్ఎస్లో పెద్ద దూమారాన్నే రేపాయి. ఓవైపు ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై తీసుకొచ్చిన గవర్నెన్స్ ఆర్డినెన్స్ ను సమర్ధిస్తూనే.. దాని అమలుకోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు కవిత.
72 గంటల నిరాహారదీక్ష చేస్తానని కవిత ప్రకటన
బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపడంతో మరింత ఒత్తిడి పెంచేందుకు కవిత.. ఆగస్టు 4వ తేదీ నుంచి 7 తేదీ వరకు 72 గంటల నిరాహారదీక్ష చేస్తానని ప్రకటించారు. బీసీలంతా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. దీంతో కవితకు క్రెడిట్ ఎక్కడ వెళ్తుందోనని అలర్టు అయిన బీఆర్ఎస్ పార్టీ బీసీ నేతలతో సమావేశం నిర్వహించింది. కవిత యాక్టీవిటీస్ను పసిగట్టిన బీఆర్ఎస్ ఆగస్టు 8న కరీంనగర్ లో బీసీ బహిరంగసభ నిర్వహిస్తామని ప్రకటించింది. దీంతో ఇటీవల జరుగుతున్న పరిణామాల చూస్తుంటే కవితను బీఆర్ఎస్ ఫాలో అవుతుందనే చర్చ పార్టీలో నడుస్తోందట.
కేసీఆర్కు నోటీసులపై స్పందించని బీఆర్ఎస్ నేతలు
గతంలోనూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపై పార్టీ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో కవిత సీరియస్గా స్పందించారు. బీఆర్ఎస్ నేతలు ప్రకటనలు, ప్రెస్ మీట్లకే పరిమితమైతే.. నోటీసులను వ్యతిరేకిస్తూ ఇందిరాపార్కులోని ధర్నా చౌక్ లో జాగృతి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఆతర్వాత కవిత ఇరిగేషన్ పై సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. భద్రాచలం ముంపు గ్రామాల సమస్యలపైనా రౌండుటేబుల్ సమావేశాలు నిర్వహించింది. ఆ క్రమంలో బీఆర్ఎస్ సైతం ఇరిగేషన్ పై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చింది. బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విద్యాసంస్థల్లో బనకచర్ల ప్రాజెక్టతో నష్టం గురించి ప్రచారం నిర్వహించింది. ఇలా వరుస కార్యక్రమాలు చూస్తుంటే ఎమ్మెల్సీ కవిత..తన దారిలోకి బీఆర్ఎస్ రావాల్సిందేనని చేసిన వ్యాఖ్యలు నిజమేనని అనిపిస్తున్నాయి. ఆమె చేపట్టే ప్రతి కార్యక్రమానికి కంటిన్యూగా బీఆర్ఎస్ చేపడుతున్నట్లు స్పష్టమవుతోంది.
తెలంగాణ జాగృతి, యూపీఎఫ్ ఆధ్వర్యంలో నిత్యం కార్యక్రమాలు
ఈ మధ్యకాలంలో జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతి, యూపీఎఫ్ ఆధ్వర్యంలో నిత్యం ఏదో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ.. ప్రజల్లో ఉంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అయినప్పటికీ ఆమె.. జాగృతి కార్యక్రమాలతో ఓన్ అజెండాలో ముందుకు సాగుతున్నారు. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్యాయం కవిత అనే ప్రచారం ఊపందుకుంది. కేసీఆర్ ఓటమి తర్వాత సైలెంట్ అవ్వడంతో పార్టీకి డ్యామేజ్ అవుతుందని భావిస్తున్న పార్టీ శ్రేణులు కవిత చేపట్టే కార్యక్రమాలను అనుసరించాల్సిన పరిస్ధితి వస్తుందనే టాక్ నడుస్తోందట. ఆమె ఏ కార్యక్రమం చేపట్టినా.. మళ్లీ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అదే కార్యక్రమం చేపడుతుండటం హాట్ టాపిక్ అయింది. కవిత వైపు గులాబీ కేడర్ మొగ్గుచూపకుండా కేటీఆర్ టీమ్ కట్టడి చేసే ప్రయత్నాల్లో నిమగ్నమైనట్లు స్పష్టమవుతోంది. ఆ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల కన్నా కవితపైనే పార్టీ అధిష్టానం దృష్టిసారించినట్లు సమాచారం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కవిత ప్రభావం పడకుండా చక్కదిద్దేపనిలో పడ్డారంటున్నారు
యవత ఫోకస్గా లీడర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కవిత
గతేడాది డిసెంబర్ నుంచి కవిత ప్రజల్లోకి వెళ్తున్నారు. కవిత రాజకీయంగా స్ట్రాంగ్ కాకుండా బీఆర్ఎస్ అడ్డుకోవాలనే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె ఎక్కువగా యువతపై ఫోకస్ పెడతున్నారు. భవిష్యత్ ను దృష్ఠిలో ఉంచుకొని పక్కా ప్రణాళికలతో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే లీడర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ ఎఫెక్ట్తో బీఆర్ఎస్ సైతం విద్యార్థి విభాగం బలోపేతంపై దృష్టిసారించింది. అధికారంలో ఉన్న పదేళ్లు పార్టీ అనుబంధ విభాగాలను పట్టించుకోని గులాబీ పార్టీ పెద్దలు ఇప్పుడు కవిత ఎఫెక్ట్తో వాటిపై దృష్టిపెడుతున్నారు.
Also Read: విష్ణుకుమార్రాజు మౌనం వెనుక కారణం అదేనా
కవిత ప్రోగ్రాంలు బీఆర్ఎస్ కాపీ కొడుతోందని చర్చ
బీఆర్ఎస్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రభుత్వ వైఫల్యాలపై దృష్టిసారించకుండా కవితను అనుసరిస్తుందని వరుస కార్యక్రమాలు స్పష్టం చేస్తున్నాయి. పార్టీ ఏదైనా మంచి కార్యక్రమం తీసుకొని గ్రామస్థాయిలోకి వెళ్లకుండా కవిత ప్రోగ్రాంలను కాపీలు కొట్టడం ఏంటనే ప్రయత్నాలు ఉత్పన్నమవుతున్నాయి. పార్టీని క్షేత్రస్థాయి నుంచి కమిటీలు వేసి బలోపేతం చేయకుండా విమర్శలు చేయడంతోనే కాలం వెళ్లదీస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. స్థానిక ఎన్నికల ముందు పార్టీ నిర్ణయాలతో కేడర్లో సైతం కొంత నైరాశ్యం నెలకొందనే సమాచారం. ఏది ఏమైనా కవితను బీఆర్ఎస్ పార్టీ అనుసరిస్తుండటం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.
Story By Rami Reddy, Bigtv