CM Revanth Reddy: విద్య, వైద్య రంగాలకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సంధర్భంగా నిర్వహించిన ప్రజారోగ్య విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రజా సంక్షేమానికి పెద్దపేట వేస్తున్నట్లు తెలిపారు.
ప్రజాపాలన వేడుకలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి సోమవారం 213 అంబులెన్స్లను ప్రారంభించారు. అలాగే 108 కోసం 136 అంబులెన్స్లు, 102 కోసం 77 అంబులెన్స్లు కూడా సీఎం ప్రారంభించారు. 442 సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, 24 ఫుడ్ సేఫ్టీ అధికారులకు నియామక పత్రాలు అందజేసీన అనంతరం, 33 ట్రాన్స్జెండర్ క్లినిక్లు, 28 పారామెడికల్, 16 నర్సింగ్ కాలేజీలు వర్చువల్గా ప్రారంభించారు.
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 60 సంవత్సరాల ఆకాంక్ష మేరకు తెలంగాణ వచ్చిందని, ఎందరో నిరుద్యోగులు ఉద్యమబాట పట్టి రాష్ట్ర సాధనకు తోడ్పడ్డారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉన్నా కూడా, ఎటువంటి నోటిఫికేషన్స్ జారీ చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎన్నో ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఏడాదిలోగా 50 వేల ఉద్యోగాలు ఇచ్చిన రికార్డును తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంకే దక్కుతుందన్నారు.
దేశంలోని మరే రాష్ట్రంలో ఇలా ఉద్యోగాలు అందించిన ఘనత లేదన్నారు. మొదటి ఏడాదిలోగా 25 లక్షల మంది రైతులకు రూ.21వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. కానీ ఇవన్నీ ఓర్చుకోలేక మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో కుట్రలు పన్నుతున్నారని, తాము మాత్రం ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా రాష్ట్ర అభివృద్దికి తాము కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఒక్క రోజులో 14 వేల పోస్టులు భర్తీ చేసిన ఘనత తమకే దక్కుతుందన్నారు. ఉద్యోగాలకు ఎంపికైన వారు ప్రజల ఆరోగ్య సేవలో తరించాలన్నారు. గత ప్రభుత్వం విద్య, వైద్యరంగాలను తుంగలోకి తొక్కిందని, తాము ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ శాఖలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.
పేదవారికి గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు, సంక్రాంతికి చాలా మంది వేషాలు వేయడానికి వస్తున్నారని పరోక్షంగా బీఆర్ఎస్ ను ఉద్దేశించి అన్నారు. అలాగే బీజేపీకి చెందిన కిషన్ రెడ్డిని ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ.. కేంద్ర మంత్రిగా ఉన్నారు కానీ, తెలంగాణకు చేసింది మాత్రం ఏమి కూడా లేదన్నారు. కేసీఆర్ పదేళ్లు సీఎంగా ఉన్నా మన సంస్కృతిని కాపాడే చర్యలు అస్సలు తీసుకోలేదన్నారు. జయహే గానంను బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు అంకితం చేయలేదో ఇప్పటికీ ఎవరికీ అర్థం కాదన్నారు.
అంతేకాదు సచివాలయం నిర్మించారు సరే, తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టలేదని సీఎం ప్రశ్నించారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తమ ప్రభుత్వం ఉద్యోగాలు, పథకాలన్నీ ప్రవేశ పెట్టిందని, బీఆర్ఎస్ పాలనలో వాటి ఊసేలేదన్నారు. ఈ నెల 7, 8, 9వ తేదీలలో విజయోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని, ఆ విజయోత్సవాలలో లక్షలాది మంది ప్రజలు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు పలకాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు రాజనర్సింహ, పొన్నం, పలువురు పాల్గొన్నారు.