రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మంథని నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక మంత్రి శ్రీధర్ బాబు ఇక్కడ అందుబాటులో లేని సమయంలో కార్యకర్తలకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. తమకు ఒక్క సమాచారం ఇస్తే చాలని.. తాను, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే విజయరమణారావు ముగ్గురం కేవలం రెండు గంటల్లోనే మంథనికి చేరుకుంటామని చెప్పారు. సైరన్ వేసుకుంటూ వేగంగా వస్తామని.. తమ కార్యకర్తలకు ఎవరైనా అడ్డంగా వస్తే వారిని అడ్డంగా నరుకుతామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎమ్మెల్యే హోదాలో ఉన్న వ్యక్తి బాధ్యత మరచి వీధి రౌడీలా మాట్లాడటం ఏమిటని ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధి ఇలాంటి హింసాత్మక వ్యాఖ్యలు చేయడం చట్ట వ్యతిరేకమని వారు ఆరోపిస్తున్నారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన వారే ఇలా నరుకుతాం.. చంపుతాం అనడం సమాజానికి తప్పుడు సంకేతాలు పంపుతుందని విమర్శిస్తున్నారు. మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మంత్రి శ్రీధర్ బాబు ఏమన్నారంటే..?
ఈ వివాదంపై మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో హింసను ప్రేరేపించే విధంగా ఎవరు మాట్లాడినా అది ఖండించదగ్గ విషయమేనని స్పష్టం చేశారు. అయితే మక్కన్ సింగ్ వ్యాఖ్యలను మరో కోణంలో చూడాలని కోరారు. కార్యకర్తలు తమ కష్టాలను చెప్పుకుంటున్న సమయంలో వారిలో ధైర్యం నింపేందుకే ఆయన అలా మాట్లాడి ఉండవచ్చునని అభిప్రాయపడ్డారు. కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పే ఉద్దేశంతోనే ఆ మాటలు అన్నారని.. దీనిని అనవసరంగా వివాదం చేయవద్దని మంత్రి సూచించారు.
ప్రస్తుతం ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు కాంగ్రెస్ నేతలు ఇది కేవలం కార్యకర్తలను ఉత్సాహపరిచేందుకు అన్న మాటలేనని సర్దిచెబుతుండగా.. మరోవైపు ప్రత్యర్థి పార్టీలు మాత్రం దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నాయి. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటామనే అర్థం వచ్చేలా మాట్లాడటంపై సర్వత్రా చర్చ నడుస్తోంది.
ALSO READ: కవితకు కేటీఆర్ పరోక్ష వార్నింగ్.. గులాబీ కోటలో రగులుతున్న రాజకీయం