MP Chamala: బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావుపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు దుబాయ్ కి పోయిన రోజే తెలుగు సినీ నిర్మాత కేదార్ శెలగం శెట్టి మృతిచెందారని సంచలన ఆరోపణలు చేశారు. హరీష్ రావుకు శవ రాజకీయాలు చేయడం ఇదేం కొత్త కాదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేదార్ మృతిచెందడంపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆయన డిమాండ్ చేశారు.
ప్రముఖ సినీ నిర్మాత కేదార్ దుబాయిలో అనుమానాస్పద స్థితిలో చనపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎంపీ చామల కిరణ్ సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు. ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసే హరీష్ రావు దుబాయి పర్యటన వివరాలు ఎందుకు పెట్టలేదని ఆయన నిలదీశారు. హరీష్ రావు స్నేహితుడి కూతురి పెళ్లి మార్చి 6న ఉంటే.. మరీ ఫిబ్రవరి 22న ఎందుకు దుబాయికి వెళ్లారో చెప్పాలని ప్రశ్నించారు. ఎవరి బ్యాండ్ కొట్టడానికి వెళ్లినవ్, రీల్స్ కూడా ఎక్కడా చూపియ్యలే.. అని చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. హరీష్ రావు ఎప్పుడైతే దుబాయికి వెళ్లారో అప్పుడే కేదార్ మృతిచెందారు. హరీష్ రావుకు శవ రాజకీయాలు చేయడం కొత్తేమీ కాదని.. ఆగ్రహం వ్యక్తం చేశారు. కేదార్ మృతిచెందడం పట్ల కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
ALSO READ: TGPSC Group-2,3 Results: గ్రూప్-2,3 ఫలితాలపై కీలక అప్డేట్ వచ్చేసింది.. కొత్త నోటిఫికేషన్లు కూడా..?
బీఆర్ఎస్ నేతలు బ్లాక్ మనీని వైట్ గా మార్చుకోవడానికి దుబాయి వెళ్తున్నారని ఆరోపించారు. అవినీతిగా సంపాదించిన పైసలే దుబాయిలో దాచుకోవడానికి హరీష్ రావు దుబాయికి వెళ్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. హరీష్ ఏమైనా అంటే రాజీనామా అంటారని.. ఆయన డిక్షనరీలో అగ్గిపెట్టె, రాజీనామాలు మొదటి పదాలు అని ఎద్దేవా వేశారు. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు చేస్తోందని ఫైరయ్యారు. సోషల్ మీడియా వాడడంలో బీఆర్ఎస్ నంబర్ వన్ అని అన్నారు.
మాజీ సీఎం కేసీఆర్ కోట్లు ఖర్చు పెట్టారు కానీ అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ఎస్ఎల్బీసీ ఎప్పుడో పూర్తి చేసే వారని, నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి నాయకులే లేరని తీవ్ర స్థాయిలో ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో ఎక్కడైనా ప్రమాదాలు జరిగితే కేసీఆర్ వెళ్లారా..? అని నిలదీశారు. కొండగట్టులో 60 మందికి పైగా చనిపోతే కేసీఆర్ అక్కడకు వెళ్లారా..? అని ప్రశ్నించారు. ప్రతి రోజు మధ్యాహ్నం తొడలు కొట్టడానికి మాత్రమే బీఆర్ఎస్ నాయకులు బయటకు వస్తారని చెప్పారు. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రతిపక్షాలు సహకరించాలని కానీ ఇలా తప్పుడు ప్రచారాలు చేయకూడదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఢిల్లీకి సీఎం వెళ్తే ప్రధాని సానుకూలంగా స్పందిస్తున్నారని.. కిషన్రెడ్డి, బండి సంజయ్ మాత్రం తెలంగాణకి ఏమీ రానివ్వడం లేదని ఆరోపించారు.