KCR : 2022. మొయినాబాద్ ఫాంహౌజ్. నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర బ్లాస్ట్ అయింది. సీసీకెమెరాల సాక్షిగా ముగ్గురు మీడియేటర్లు అడ్డంగా బుక్ అయ్యారు. అప్పట్లో ఆ న్యూస్ తెగ సెన్సేషనల్ అయింది. ఆనాటి సీఎం కేసీఆర్ ప్రెస్మీట్ పెట్టి బీజేపీని, బీఎల్ సంతోష్రావును చెడుగుడు ఆడుకున్నారు. తమ ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్రెడ్డిలతో బేరాలు ఆడిన నందకుమార్, రామచంద్ర భారతి, సోమయాజీల వీడియోలు, కాల్ రికార్డులు మీడియా ముందు ప్రదర్శించారు. ఆ ఆడియోలన్నీ పెన్డ్రైవ్లో పెట్టి.. మీడియా ప్రతినిధుల నుంచి రాష్ట్రపతి, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీలు, వివిధ రాష్ట్రాల సీఎంలకు పంపించారు గులాబీ బాస్. ఆ విషయాన్ని చాలా గొప్పగా చెప్పుకున్నారు. కట్ చేస్తే.. ఇప్పుడు అవే పెన్డ్రైవ్లు కేసీఆర్ మెడకు ఉచ్చులా బిగుసుకుంటున్నాయి. ఆనాటి ఆ ఆడియో రికార్డులు.. ఫోన్ ట్యాపింగ్ చేసినవే అంటూ కొత్త ట్విస్ట్ బయటపడటం కలకలం రేపుతోంది.
ఆ కాల్ రికార్డింగ్స్ ఫోన్ ట్యాపింగ్తోనేనా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. 2022 ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై సిట్ ఫోకస్ చేస్తోంది. కేసీఆర్ ప్రెస్ మీట్లో విడుదల చేసిన పెన్డ్రైవ్పై దృష్టిపెట్టింది. ఆయన రిలీజ్ చేసిన ఆడియో రికార్డింగ్లు ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో దర్యాప్తు చేస్తోంది. ఆడియోలు ఫోన్ ట్యాపింగ్ ద్వారానే వచ్చినట్లు సిట్ అంచనా వేస్తోంది.. ఏ సర్వర్ నుంచి పెన్డ్రైవ్లోకి కాపీ చేశారనే కోణంలో వివరాలు సేకరిస్తోంది. కేసీఆర్ మీడియాకు ఇచ్చిన పెన్ డ్రైవ్లు కలెక్ట్ చేస్తోంది. అవి కానీ ఫోన్ ట్యాపింగ్ రికార్డింగ్సే అని తేలితే మాత్రం.. కేసీఆర్ రెడ్ హ్యాండెడ్గా బుక్ అయినట్టే. ఆయన ఖేల్ ఖతం అయినట్టే.
కవిత పీఏకు నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు సాగుతున్న కొద్దీ కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రణీత్రావు ఫోన్ డేటా రిట్రైవ్ చేస్తున్న కొద్దీ రోజురోజుకూ కొత్త అంశాలు బయటపడుతున్నాయి. ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులు, ఇతర సాక్ష్యాల ఆధారంగా నోటీసులు పంపుతోంది సిట్. లేటెస్ట్గా కవిత పీఏకు నోటీసులు ఇచ్చారు సిట్ అధికారులు. శ్రవణ్ రావు ఇచ్చిన డేటా ఆధారంగా మరికొందరికి సైతం నోటీసులు పంపుతున్నారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల ఫోన్లతో పాటు ఈటల, పొంగులేటి, బండి సంజయ్, రాజగోపాల్ రెడ్డి, వివేక్, షర్మిల సహా పలువురు రాజకీయ నేతలు, జడ్జీలు, మీడియా అధినేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపణలు రావడంతో విచారణ పకడ్బందీగా చేస్తోంది సిట్.